Begin typing your search above and press return to search.

లోకేశ్ ట్వీట్ సంచలనం.. లక్షలాది మంది జలసమాధికి ప్లాన్ చేశారు!

ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి చెందిన పలువురు ఆరోపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   10 Sep 2024 1:08 PM GMT
లోకేశ్ ట్వీట్ సంచలనం.. లక్షలాది మంది జలసమాధికి ప్లాన్ చేశారు!
X

భారీ వర్షాలు.. వరదతో విజయవాడ నగరం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో రెండు వారాలు అవుతున్నా.. వరద తీవ్రత నుంచి ఇప్పటికి బెజవాడవాసులు బయటపడింది లేదు. ఇదిలా ఉంటే.. వరద తీవ్రత ఎక్కువగా ఉన్న వేళ.. టన్నుల బరువు ఉన్న ఇనుప పడవలు ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీ కొన్నాయి. దీని వెనుక వైసీపీ నేతల కుట్ర ఉందంటూ ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి చెందిన పలువురు ఆరోపిస్తున్నారు. పోలీసులు సైతం కేసు విచారణను ముమ్మరం చేశారు.

ఇదిలా ఉంటే.. ఈ అంశం మీద ఏపీ మంత్రి లోకేశ్ సంచలన ట్వీట్ చేశారు. లక్షలాది మంది జలసమాధి అయ్యేలా పన్నిన కుట్ర బట్టబయలైందన్న ఆయన.. షాకింగ్ ట్వీట్ చేశారు. అందులో ఏముందన్నది చూస్తే.. ‘‘అధికారం అండతో సైకో జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకకుపోయేలా చేసి 50 మందిని చంపారు. ఐదు ఊళ్లను నామరూపాలు లేకుండా చేశారు. ఇదే ప్లాన్ ప్రకారం ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీని ఢీ కొని కూల్చేలా కుట్ర చేశారు’’ అని పేర్కొన్నారు.

అంతేకాదు.. ఇదే ట్వీట్ లో మరిన్ని ఆరోపణలు చేశారు. ‘‘విజయవాడతో పాటు పదుల సంఖ్యలో లంక గ్రామాలు నామరూపాలు లేకుండా చేసి లక్షల మంది జలసమాధి అయ్యేలా జగన్ పన్నిన కుట్ర బట్టబయలైంది. దీన్ని ప్లాన్ చేసింది సైకో జగన్ అయితే.. అమలు చేసింది వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం.. మాజీ ఎంపీ నందిగం సురేశ్’’ అంటూ పేర్కొన్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఏపీ మంత్రే స్వయంగా ఈ తీరులో ట్వీట్ చేసిన వేళ.. రానున్న రోజుల్లో ఈ అంశం రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్న మాట వినిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద చేసిన ఈ ఆరోపణల వేళ.. పోలీసులు ఎలా రియాక్టు అవుతారన్నది ప్రశ్నగా మారింది.