Begin typing your search above and press return to search.

ఆస్పత్రికి వెళ్లిన కవిత.. ఆమె ఆరోగ్యానికి ఏమైంది..?

మార్చి 15న అరెస్ట్ అయిన కవిత.. ఆగస్టు 27న బెయిల్‌పై విడుదలయ్యారు.

By:  Tupaki Desk   |   1 Oct 2024 5:28 AM GMT
ఆస్పత్రికి వెళ్లిన కవిత.. ఆమె ఆరోగ్యానికి ఏమైంది..?
X

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశంలోనే సంచలనం రేపింది. ఢిల్లీ వేదికగా కొందరు కలిసి మద్యం సిండికేట్‌కు పాల్పడిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కవిత కూడా నిందితురాలిగా ఉన్నారు. దాంతో అరెస్ట్ చేసి 153 రోజులపాటు తీహార్ జైలులోనే ఉన్నారు.

మార్చి 15న అరెస్ట్ అయిన కవిత.. ఆగస్టు 27న బెయిల్‌పై విడుదలయ్యారు. ఇన్ని రోజులు జైలులో ఉన్న కవిత ఆ మధ్య అనారోగ్యానికి గురయ్యారు. పలుమార్లు జ్వరం బారిన పడ్డారు. దాంతో అప్పటికప్పుడు జైలు అధికారులు ఆమెకు చికిత్స చేపించారు. పలు గైనిక్‌తోపాటు ఇతర ఇబ్బందులు వచ్చాయి. దాంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆమెకు చికిత్స చేయించారు. పలు వైద్యపరీక్షలు చేసిన వైద్యులు.. గైనిక్ సమస్య వచ్చినట్లుగా నిర్ధారించారు.

కవిత బెయిల్‌పై విడుదలై నెల రోజులు గడిచింది. దీంతో ఇప్పుడు మరోసారి ఆమెకు అలాంటి సమస్యనే వచ్చినట్లుగా సమాచారం. అందుకే మరోసారి ఆస్పత్రికి వెళ్లాలని నిర్ణయించుకోగా.. ఈ రోజు ఉదయం గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కు వెళ్లారు. వైద్యులు ఆమెకు పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. వచ్చిన రిపోర్టుల ఆధారంగా ఆమె ట్రీట్‌మెంట్ తీసుకోనున్నారు. సాయంత్రం వరకు టెస్టులు కొనసాగే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు తెలిపారు.

అయితే.. కవిత విడుదల సందర్భంగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరినీ వదలబోనంటూ ప్రతినబూనారు. దాంతో బీఆర్ఎస్ నేతలంతా కవిత ఎప్పుడెప్పుడు ప్రజాక్షేత్రంలోకి వస్తుందా అని ఎదురుచూశారు. నెల రోజులైనా ఇంకా ఆమె బయటకు రాకపోవడంపై అసంతృప్తితో ఉన్నారు. అయితే.. తెలంగాణలో రేపటి నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఏటా బతుకమ్మ పండుగ వచ్చిందంటే కవిత ప్రజల్లోనే ఉండిపోయేవారు. జాగృతి పేరిట ఏరియాల వారీగా బతుకమ్మలను పేర్చి ఆడిపాడేవారు. అటు విదేశాల్లోనూ మన సంస్కృతి సంప్రదాయాన్ని చాటేవారు. అయితే.. ఈసారి ఆమె బతుకమ్మ ఉత్సవాలకు హాజరవుతారా లేదా అన్నది ఇంతవరకు క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో హాస్పిటల్‌కు వెళ్లడం కూడా చర్చనీయాంశం అయింది. రేపటి నుంచి బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేందుకే ఆమె చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లారా అనే ప్రచారం కూడా జరుగుతోంది. వచ్చిన రిపోర్టులు, ట్రీట్మెంట్‌ను బట్టి ప్రజల్లోకి వస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు.. ఉన్నట్లుండి కవిత ఆస్పత్రికి వెళ్లడంపైనా బీఆర్ఎస్‌ నేతల్లో ఆందోళన కనిపిస్తోంది.