Begin typing your search above and press return to search.

అందరి దృష్టి ఆ ఫలితం మీదే !

దేశంలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేశాయి. ఎన్డీఎ భాగస్వామ్య పక్షాల సహకారంతో మోడీ మూడోసారి ప్రధాని పీఠం ఎక్కనున్నాడు.

By:  Tupaki Desk   |   5 Jun 2024 4:59 AM GMT
అందరి దృష్టి ఆ ఫలితం మీదే !
X

దేశంలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేశాయి. ఎన్డీఎ భాగస్వామ్య పక్షాల సహకారంతో మోడీ మూడోసారి ప్రధాని పీఠం ఎక్కనున్నాడు. అయితే తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. ప్రజలు లోక్ సభ ఎన్నికలలో జాతీయ పార్టీల వైపే మొగ్గు చూపడంతో బీఆర్ఎస్ పార్టీకి నిరాశజనక ఫలితాలు వచ్చాయి. మూడు రోజుల క్రితం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆ పార్టీకి లోక్ సభ ఫలితాలు నిరాశ కలిగించాయి. అయితే బీఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణలోని అన్ని పార్టీలు ఇప్పుడు వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ రాత్రికి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మూడు జిల్లాలలో ప్రభావం చూపనున్న ఈ ఎన్నికలలో గెలుపు బీఆర్ఎస్ పార్టీకి అత్యంత ఆవశ్యకం.

‘వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ’ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైంది. నల్లగొండ పట్టణ శివారులోగల స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ గోదాములోని నాలుగు కౌంటింగ్‌ హాల్స్‌లో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం 605 పోలింగ్‌ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్‌ బాక్సుల్లోని ఓట్లను సిబ్బంది కట్టలుగా కడుతున్నారు. మధ్యాహ్నం వరకు బండిల్స్‌ కట్టడం పూర్తిచేసి మధ్యాహ్నం నుంచి తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఇవాళ అర్ధరాత్రికల్లా తుది ఫలితం వచ్చే అవకాశం ఉన్నది.

ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి ఏనుగు రాకేశ్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి సహా మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నాలుగు కౌంటింగ్‌ హాల్స్‌లో ఒక్కో హాల్‌లో 24 టేబుళ్ల చొప్పున మొత్తం 96 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. 605 పోలింగ్‌ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్‌ బాక్సులను వరుస క్రమంలో టేబుల్‌కు ఒకటి ఇస్తున్నారు. సిబ్బంది వాటిని టేబుల్‌పై కుప్పగా పోసి 25 బ్యాలెట్‌ పేపర్లను ఒక కట్టగా కడుతున్నారు. పోస్టల్‌ బ్యాలెట్లను కూడా వీటితో కలిపే లెక్కిస్తారు. బండిల్‌ కట్టడం పూర్తయిన తర్వాత లెక్కింపు మొదలుకానుంది. తొలి ప్రాధాన్యత ఓట్లను ముందుగా లెక్కిస్తారు.

తొలి ప్రాధాన్యత ఓట్లు పూర్తయ్యేసరికి అభ్యర్థుల వారీగా పోలైన ఓట్లపైన, గెలుపు కోటాపైన స్పష్టత వస్తుంది. అప్పటికీ ఏ అభ్యర్థి గెలుపు కోటా ఓట్లు సాధించలేకపోతే ఎలిమినేషన్‌ ప్రక్రియను మొదలుపెడతారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్‌ రౌండ్‌ను ప్రారంభిస్తారు. ఆయనకు బ్యాలెట్‌లో పడిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను ఆయా అభ్యర్థుల వారీగా పంచుతూ వస్తారు. ఇలా ఒక్కో అభ్యర్థిని కిందినుంచి పైకి ఎలిమినేట్‌ చేస్తూ కౌంటింగ్‌ కొనసాగిస్తారు. ఈ క్రమంలో ఏ అభ్యర్థికైనా గెలుపు కోటా ఓట్లు వస్తే అక్కడితో కౌంటింగ్‌ను నిలిపివేసి విజేతను ప్రకటిస్తారు.

అయితే మొత్తం 52 మంది బరిలో ఉండడంతో ఎలిమినేషన్‌ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. కిందటిసారి ఎలిమినేషన్‌ రౌండ్‌కే 44 గంటల సమయం పట్టింది. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లలోనూ విజేత తేలకపోతే తృతీయ ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించనున్నారు. లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఫలితం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.