Begin typing your search above and press return to search.

జగన్ కి మోడీ అపాయింట్మెంట్ ఇస్తున్నారా ?

ఢిల్లీ వెళ్ళేది ధర్నా చేసేది అన్నీ కూడా కేంద్ర పెద్దలతో మాట్లాడేందుకే అన్నది వైసీపీలో వినిపిస్తున్న మాట

By:  Tupaki Desk   |   21 July 2024 9:21 AM GMT
జగన్ కి మోడీ అపాయింట్మెంట్ ఇస్తున్నారా ?
X

ఢిల్లీ వెళ్ళేది ధర్నా చేసేది అన్నీ కూడా కేంద్ర పెద్దలతో మాట్లాడేందుకే అన్నది వైసీపీలో వినిపిస్తున్న మాట. కేంద్ర పెద్దలకు టచ్ లోకి వచ్చేందుకే జగన్ చూస్తున్నారు అని అంటున్నారు. అధికారం పోయిన వేళ కూటమి ప్రభుత్వం ఏపీలో స్ట్రాంగ్ గా ఉన్న వేళ తనపైన పాత కేసులు కొత్త కేసులు సైతం పెట్టి ఇబ్బందులు పెడతారు అని వైసీపీ అధినాయకత్వానికి తెలుసు అని అంటున్నారు.

అందుకే ఇపుడు ఢిల్లీ స్థాయిలో భారీ ఆందోళన కార్యక్రమం పరుతో అక్కడ హైలెట్ కావాలని ఆ విధంగా కేంద్ర పెద్దలను కలసి మాట్లాడాలని వైసీపీ భారీ స్కెచ్ ని గీసింది. దీంతోనే ఢిల్లీకి పయనం అవుతోంది. అసెంబ్లీ సమావేశాలను సైతం పక్కన పెట్టేసి ఢిల్లీ ధర్నాకు తెర తీయడం వెనక కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ ని కోరే వ్యూహం ఉందని అంటున్నారు.

అయితే ప్రధాని నరేంద్ర మోడీ జగన్ కి అపాయింట్మెంట్ ఇస్తారా అన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న. జగన్ పార్టీ ఇటీవల ఎన్నికల్లో దారుణంగా ఓడింది. ఎంతలా అంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా జగన్ కి దక్కనంతంగా మరోవైపు చూస్తే బీజేపీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలతో ఏపీలో కొంత బలం సంపాదించుకుంది. పైగా టీడీపీ కూటమిలో ఉంది.

ప్రభుత్వంలో మంత్రి పదవిని పొందింది. రానున్న రోజులలో ఏపీలో బలపడాలీ అంటే టీడీపీతో ఉంటేనే మేలు అన్నది కూడా కేంద్ర పెద్దలకు తెలియనిది కాదు అని అంటున్నారు ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మనుగడకు టీడీపీ ఎంపీలే కీలకమైన ఆధారం. వారి మద్దతు లేకుండా ఒక్క రోజు కూడా కేంద్ర ప్రభుత్వం కొనసాగదు.

ఇలా లెక్కలు అన్నీ కళ్ల ముందు ఉండగా జగన్ కి అపాయింట్మెంట్ మోడీ ఇస్తారా అన్నది చర్చగా ఉంది. రాజ్యసభలో వైసీపీకి ఎంపీల బలం ఉంది. అయితే దానికి కూడా తరుణోపాయం కనిపెట్టేశారు. టీడీపీ ఆయా ఎంపీలను తన వైపునకు తిప్పుకోవడం ద్వారా వైసీపీని చీల్చబోతోంది. వారి మీద అనర్హత వేటు లేకుండా బీజేపీ అండగా ఉండనుంది అని అంటున్నారు.

ఈ రకంగా చూస్తే కనుక వైసీపీని ఏ రాజకీయ అవసరం కోసం తాము దగ్గరకు తీయాలని బీజేపీ పెద్దలకు అనిపించడం సహజమని అంటున్నారు. ఏపీలో వైసీపీని పూర్తిగా లేకుండా చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు ఒక విధంగా అయితే ఆయన తీవ్రమైన ప్రతిజ్ఞచేసి ఉన్నారు. ఏపీలో 2029లో సునాయాసంగా గెలిచేందుకు కూడా పక్కాగా ప్లాన్ చేస్తుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి కేంద్ర పెద్దలు అపాయింట్మెంట్ ఇస్తే బాబు కానీ టీడీపీ కానీ అసలు ఊరుకోరని అంటున్నారు.

ఇక టీడీపీ మనసెరిగిన బీజేపీ పెద్దలు సైతం జగన్ కి ఏ విధంగానూ అపాయింట్మెంట్లు ఇచ్చి తమ కాళ్ల కిందకు నీళ్ళు తెచ్చుకోరని అంటున్నారు. అంతే కాదు రానున్న రోజులలో జగన్ మీద కేసులు కూడా మరింత జోరందుకుంటాయని అంటున్నారు. అలాగే ఆయన అయిదేళ్ల పాలన మీద టీడీపీ నుంచి వచ్చిన నివేదికలు కూడా బీజేపీ వద్ద ఉన్నాయని అంటున్నారు.

గత అయిదేళ్ళూ బీజేపీ పెద్దలు అడిగినపుడల్లా జగన్ కి అపాయింట్మెంట్లు ఇచ్చారూ అంటే అనాడు ఆయన రాజకీయంగా బలంగా ఉన్నారు. పైగా అధికారంలో ఉన్నారు. సీఎం గా కూడా హోదాలో ఉన్నారు. దాంతో రాజ్యసభలో తన అవసరాల కోసం కూడా బీజేపీ సహకరించింది అని అంటున్నారు. ఇపుడు అంతా ఉల్టా అయిందని ఏ విధంగా చూసినా జగన్ కి కేంద్ర బీజేపీ పెద్దల నుంచి సానుకూలత దొరకదు అనే అంటున్నారు. దాంతో ధర్నా చేసి వెనక్కి వచ్చేయడమేనా లేక ఏమైనా రాజకీయ మెరుపులు ఉంటాయా అంటే వెయిట్ అండ్ సీ.