Begin typing your search above and press return to search.

మోడీ అంత ధైర్యం చేస్తారా....!?

ఈ నేపధ్యంలో మోడీ మల్కజ్ గిరిలో పోటీకి ఓకే అంటారా అన్నది ఒక చర్చగా ఉంది. ప్రధాని అంతటి సాహసం చేస్తారా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్న విషయం.

By:  Tupaki Desk   |   15 Dec 2023 1:23 PM GMT
మోడీ అంత ధైర్యం చేస్తారా....!?
X

దేశానికి ప్రధాని అయినా ఎక్కడో ఏదో ఒక లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవాల్సిందే. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్. అయితే ఆయన తొలిసారి లోక్ సభకు పోటీ చేసినపుడు గుజరాత్ తో పాటు ఆ రాష్ట్రం వెలుపల కూడా పోటీ చేశారు. అలా వారణాసిలో గెలిచిన ప్రధాని దానికి తన సొంత నియోజకవర్గం గా భావించి అదే ఖరారు చేసుకున్నారు. 2019 ఎన్నికల్లోనూ ఆయన వారణాసి నుంచి పోటీ చేసి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు.

అలా ప్రధాని యూపీకి చెందిన ఎంపీగా ఉన్నారు. దేశంలో అత్యధిక లోక్ సభ సీట్లు ఉన్నది యూపీలోనే. అలా ఆ రాష్ట్రాన్ని ప్రభావితం చేసే ఉద్దేశ్యంతో మోడీ యూపీని స్థావరంగా చేసుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో ప్రధాని దక్షిణ భారతం వైపు చూస్తున్నారు అని అంటున్నారు. ఈ రోజుకు చూస్తే సౌతిండియాలో బీజేపీకి ఏ రాష్ట్రంలోనూ అధికారం లేదు.

అదే కాంగ్రెస్ కి కర్నాటక తెలంగాణా చేతిలో ఉన్నాయి. సౌత్ మొత్తం 129 ఎంపీ సీట్లు ఉన్నాయి. బీజేపీ మళ్లీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే సౌత్ చాలా ముఖ్యం. 2019లో కర్నాటక పాతిక సీట్లు ఇచ్చి బీజేపీని నిలబెట్టింది. ఆ తరువాత తెలంగాణాలో నాలుగు దక్కాయి. తమిళనాడులో ఒకటి వచ్చింది.అంటే టోటల్ గా ముప్పయి ఎంపీ సీట్లు వచ్చాయి.

ఈసారి అదే నంబర్ తో ఎంపీ సీట్లు తెచ్చుకోవాలన్నది బీజేపీ ఆలోచన. అయితే కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాబట్టి మెజారిటీ సీట్లు ఆ పార్టీకి దక్కుతాయని అంటున్నారు. మరి అక్కడ కొరత పడిన సీట్లను ఎక్కడ భర్తీ చేసుకోవాలి అంటే తెలంగాణాయే బీజేపీకి ఆశగా ఉంది. అయితే తెలంగాణా చిన్న రాష్ట్రం. అక్కడ 17 ఎంపీ సీట్లు మాత్రమే ఉన్నాయి. పైగా అక్కడ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

వచ్చే ఎన్నికల్లో అదే ఊపు కాంగ్రెస్ కంటిన్యూ చేతే బీజేపీకి కేంద్రంలో పోటీగా కాంగ్రెస్ మారుతుంది. దాంతో బీజేపీ కాంగ్రెస్ ని కట్టడి చేయడానికి ఒక కొత్త వ్యూహం రూపొందిసోంది. ఈసారి ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణా నుంచి పోటీ చేయడమే ఆ వ్యూహం. దాని కోసం తెలంగాణా బీజేపీ ఒక ప్రతిపాదనను ప్రధాని ముందు పెట్టిందని అంటున్నారు. తెలంగాణాలో మల్కాజ్ గిరి సీటు నుంచి లోక్ సభకు ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేయాలని బీజేపీ నేతలు కోరుతున్నారు.

ఇక చూస్తే మొత్తం 17 ఎంపీ సీట్లలో కనీసంగా పది అయినా గెలవాలని బీజేపీ చూస్తోంది. దాంతో ప్రధాని మోడీ మల్కజ్ గిరిలో పోటీ చేస్తే ఆ ప్రభావం కచ్చితంగా మొత్తం తెలంగాణా మీద పడుతుందని భావిస్తున్నారు. పైగా మల్కజ్ గిరిని మినీ ఇండియాగా భావిస్తారు. అక్కడ దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు. అది బీజేపీకి బాగా ఉపయోగపడుతుంది అని అంటున్నారు.

ఈ నేపధ్యంలో మోడీ మల్కజ్ గిరిలో పోటీకి ఓకే అంటారా అన్నది ఒక చర్చగా ఉంది. ప్రధాని అంతటి సాహసం చేస్తారా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్న విషయం. ఎందుకంటే బీజేపీకి తెలంగాణాలో బలం ఉన్నా అది పరిమితం. పైగా ప్రధాని వంటి వారు పోటీ చేస్తే సేఫ్ జోన్ చూసుకుంటారు. మోడీని తెచ్చి పోటీకి పెడితే అక్కడ బీజేపీ గట్టిగా లేకపోతే లేనిపోని ఇబ్బందులు వస్తాయి అంటున్నారు.

అయితే శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ తెప్పించలేకపోయిన లోకల్ లీడర్స్ ఇపుడు ప్రధాని మోడీ చరిష్మా అంటూ ఆయన మీద భారం మోపి ఆ విధంగా గెలవాలని చూస్తున్నారు అని అంటున్నారు. వ్యూహం మంచిదే కానీ బెడిసి కొడితేనే చిక్కులు అంటున్నారు. ఇక కాంగ్రెస్ గ్రౌండ్ లెవెల్ లో స్ట్రాంగ్ గా ఉంది. బీఆర్ ఎస్ కూడా సిటీలలో పటిష్టంగా ఉంది. మరి ఆ రెండు పార్టీలను కొట్టాలంటే మోడీ రావాలని బీజేపీ అంటోంది కానీ ఆ విధంగా చేయడం వల్ల ప్లస్ ఎంతవరకూ అన్నదే చూడాల్సి ఉంది.