జగన్ కు కౌంటర్లు వేస్తున్న వైసీపీ మాజీలు... ఇప్పుడు మోపిదేవి వంతు!
తాడేపల్లిలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్.. తన పార్టీని విడిచి వెళ్లినవారి గురించి స్పందించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 7 Feb 2025 10:22 AM GMTతాడేపల్లిలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్.. తన పార్టీని విడిచి వెళ్లినవారి గురించి స్పందించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీని వీడి వెళ్లి రాజ్యసభ సభ్యులు ప్రస్థావన ఎత్తారు. ఈ సమయంలో వారంతా వరుసగా జగన్ కు కౌంటర్లు వేసేస్తున్నారు.
గురువారం నాడు మీడియా ముందు స్పందించిన జగన్... తమ రాజ్యసభ సభ్యుల్లో సాయిరెడ్డితో కలిపితే పోయింది నలుగురు అని చెబుతూ... రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయతకు అర్థం తెలిసి ఉండాలి.. మనంతట మనమె ప్రలోభాలకు లొంగో, భయపడో, రాజీపడో అటువైపు పోతే ఇక మన క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఏమిటి? అని ప్రశ్నించారు.
ఇదే సమయంలో... సాయిరెడ్డికైనా, పోయిన ముగ్గురు ఎంపీలకైనా, ఇంకా ఒకరో ఇద్దరో పోతే వాళ్లకైనా అంతే అని అన్నారు. అనంతరం.. నేడూ వైసీపీ ఉంది అంటే అది వారి వల్ల కాదని.. దానికి కారణం దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతోనే అని జగన్ తెలిపారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ మోపిదేవి వెంకట రమణ స్పందించారు.
అవును... వైసీపీని వీడి బయటకు వెళ్లినవారిపై జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ స్పందించారు. ఇందులో భాగంగా.. తాను ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగే వ్యక్తినైతే కాదని.. అలాంటి వ్యక్తినైతే జగన్ అక్రమాస్తుల కేసులో ఇరుక్కునేవాడిని కాదని.. తాను ఎలాంటి వ్యక్తినో జగన్ అంతరాత్మకే తెలుసని అన్నారు.
ఇదే క్రమంలో.. ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన మరో నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా జగన్ వ్యాఖ్యలపై స్పందించారు. ఈ సందర్భంగా... జగన్ నైజం, అహంకారం నచ్చకే ఎంతో మంది వైసీపీని వీడుతున్నారని చెప్పుకొచ్చారు. విశ్వసనీయత, విలువల గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదని అన్నారు.
కాగా... జగన్ వ్యాఖ్యలపై ఇప్పటికే స్పందించిన విజయసాయిరెడ్డి... "వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే.. ఎవరికి, ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే.. రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, రాజకీయాలనే వదులుకున్నా" అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.