Begin typing your search above and press return to search.

నాగబాబు.. ఈసారి జగన్‌ వంతు!

ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ముఖ్య నేత, మెగా బ్రదర్‌ నాగబాబు.. వైఎస్‌ జగన్‌ పై మండిపడ్డారు.

By:  Tupaki Desk   |   3 Sep 2024 10:46 AM GMT
నాగబాబు.. ఈసారి జగన్‌ వంతు!
X

కృష్ణా నది, బుడమేరు వరదలకు తోడు భారీ వర్షాలతో విజయవాడతోపాటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో దాదాపు 40 గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జాతీయ విపత్తు దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌) నుంచి పెద్ద ఎత్తున బోట్లు, సహాయక సామగ్రి, సిబ్బంది ఇప్పటికే చేరుకున్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలతోపాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వరద బాధిత ప్రభావిత ప్రాంతాల్లోనే మకాం వేసింది.

ఈ నేపథ్యంలో తాజాగా విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సంగతి తెలిసిందే. దీన్ని మానవ వైఫల్యంగా ఆయన పేర్కొన్నారు. మానవ తప్పిదాల వల్లే వరద నియంత్రణ చర్యల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.

ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ముఖ్య నేత, మెగా బ్రదర్‌ నాగబాబు.. వైఎస్‌ జగన్‌ పై మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ లో ఒక సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఈ వరదలు మానవ వైఫల్యమని జగన్‌ చెప్పడంపై ధ్వజమెత్తారు.

''మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్‌ రెడ్డి గారు కృష్ణా నది వరదల విజిట్‌ కి వచ్చి, వరదల్ని Man Made Disaster అని సెలవిచ్చారు. ఒకసారి క్రింద పేర్కొన్నది చదవండి 👇

"మూడేళ్ల క్రితం (2021) అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి 44 మంది మృత్యువాత పడ్డారు. 15 మంది జాడ తెలియలేదు. ఐదు ఊర్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. వందలాది పశువులు చనిపోయాయి. ఎటుచూసినా కూలిన ఇళ్లు. ఇంకా గూడారాల మధ్యనే అనేకమంది నివాసం.

చెయ్యేరులో పెద్ద ఎత్తున ఇసుక తవ్వుతారు. అందుకోసం నదిలో లారీలు దిగుతాయి. డ్యాం గేట్లు ఎత్తితే అవి వరదలో చిక్కుకుపోతాయి కాబట్టి, వాటిని పైకి తరలించే వరకూ డ్యాం గేట్లు ఎత్తనివ్వకుండా ఆపారనేది ప్రధాన ఆరోపణ.

రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్వహణ లోపం వలనే అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిందని, ఇది దేశంలో ఒక కేస్‌ స్టడీ అని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ పార్లమెంటులో అన్నారు'' అని నాగబాబు తన పోస్టులో పేర్కొన్నారు.

''దీన్ని అంటారు సార్‌... Man Made Disaster అని. ఒకసారి మీరు first class student కాబట్టి Natural Disaster కి Man made Disaster కి తేడా తెల్సుకోవాల్సిందిగా కోరుతున్నాను....

మీరు డ్యాం గేటు సకాలంలో రిపేరు చేయకపోవడం వలన, మీ బృందం ఇసుక అక్రమంగా మితిమీరి రవాణా చేయడం వలన జరిగిన అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడాన్ని Man made Disaster అంటారు అని గమనించగలరు'' అంటూ నాగబాబు తన పోస్టులో మండిపడ్డారు.

''వీలైతే ముంపు ప్రాంతాల్ని పర్యటించి వరదల ద్వారా ఆస్తులు నష్టపోయిన బాధితుల్ని ఆర్ధికంగా ఆదుకుంటే బాగుంటుంది. విమర్శలే కాదు విపత్తు సమయంలో వీలైన సాయం కూడా చేస్తే బావుంటుంది అని విన్నవిస్తున్నాను...

మీ నాగబాబు'' అంటూ జగన్‌ పై ఆయన మండిపడ్డారు.