Begin typing your search above and press return to search.

దిమ్మ తిరిగే నిజాన్ని ఓపెన్ చేసిన ప్రసన్న!

నిజానికి ఉండే గొప్పతనం ఏమంటే.. అది ఏ మూల దాగినా ఉత్తినే ఉండదు. ఏదోలా బయటకు వస్తూనే ఉంటుంది

By:  Tupaki Desk   |   23 March 2024 3:39 AM GMT
దిమ్మ తిరిగే నిజాన్ని ఓపెన్ చేసిన ప్రసన్న!
X

నిజానికి ఉండే గొప్పతనం ఏమంటే.. అది ఏ మూల దాగినా ఉత్తినే ఉండదు. ఏదోలా బయటకు వస్తూనే ఉంటుంది. కొంతకాలం నొక్కి పట్టినా.. ఏదో ఒక సందర్భంలో నిజాన్ని బయటకు రాకుండా ఆపలేం. తప్పు చేసినోళ్లే తమ తప్పును ఒప్పుకుంటూ నిజం ఇదంటూ ఓపెన్ అయిపోతుంటారు. కాకుంటే.. కాస్తంత టైం పడుతుంది. తాజాగా అలాంటి అంశమే వెలుగు చూసింది. కీలకమైన ఎన్నికల వేళ కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నోటి నుంచి వచ్చిన మాటలు నిర్ఘాంతపోయేలా చేస్తున్నాయి.

తాజాగా ఆయన మాట్లాడుతూ తన మనసులోని నిజాన్ని బయటకు వెళ్లగక్కేశారు. ఇటీవల కాలంలో తమ పార్టీకి చెందిన పలువురు ద్వితీయశ్రేణి నాయకులు పార్టీని విడిచి పెట్టి వెళ్లిపోయిన నేపథ్యంలో.. తాము వారికి చేసిన మేలు గురించి చెప్పే క్రమంలో నమ్మలేని నిజాన్ని ఓపెన్ చేశారు. తాను ఇంత చేసిన తర్వాత కూడా ఇలా ధమ్కీ ఇచ్చి వెళ్లిపోవటమా? అన్న ఆక్రోశం ఆయన మాటల్లో వినిపించింది.

ఇంతకూ ఆయన చేసిన అంత సానుకూలత ఏమంటే.. ఎన్నికల్లో ఓడిన అభ్యర్థిని గెలిచినట్లుగా అధికారుల చేత ప్రకటించటం. విన్నంతనే నమ్మలేకపోవచ్చు. కానీ.. అదే నిజాన్ని ఆయన ఎంత ఒద్దికగా చెప్పారంటే.. ‘‘మీ ఊరి సర్పంచి ఓడినా.. గెలిచినట్లు ప్రకటించాను. నన్నే మోసం చేసి వెళ్లిపోతారా’ అంటూ ఆయన ప్రదర్శించిన ఆగ్రహం ముక్కున వేలేసుకునేలా చేసింది.

నెల్లూరు జిల్లా విడవలూరులో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలిసి మద్దతు తెలిపిన వేళ.. వారి నిర్ణయంపై మండిపడుతూ ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎంత అధికారం చేతిలో ఉంటే మాత్రం ఇంత బరితెగింపా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.మరి.. ఈ వ్యాఖ్యల్ని ఈసీ పరిశీలనకు తీసుకెళతారా? దీనిపై ఫిర్యాదు చేస్తే.. అధికారులు ఏ తీరులో రియాక్టు అవుతారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.