Begin typing your search above and press return to search.

వైసీపీ మీద ఒకేసారి నందమూరి అక్క చెల్లెళ్ళ ఎటాక్...!

కాలం అందుకే చిత్రమైనది. ఎవరైనా ఎపుడైనా ఇలా జరుగుతుంది అని అనుకున్నారా. అంతా కాల మహిమ అనే చెప్పాలి

By:  Tupaki Desk   |   25 Oct 2023 3:30 PM GMT
వైసీపీ మీద ఒకేసారి నందమూరి అక్క చెల్లెళ్ళ ఎటాక్...!
X

కాలం అందుకే చిత్రమైనది. ఎవరైనా ఎపుడైనా ఇలా జరుగుతుంది అని అనుకున్నారా. అంతా కాల మహిమ అనే చెప్పాలి. ఎన్టీయార్ సీఎం గా ఉండగా కొడుకులే రాజకీయాల్లోకి రాలేదు. ఇక అల్లుళ్ళు మాత్రం కుడి ఎడమలుగా ఉండేవారు. వారి సతులు అయిన దగ్గుబాటి పురంధేశ్వరి కానీ నారా భువనేశ్వరి కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎపుడూ రాలేదు. ఎన్టీయార్ చనిపోయిన ఎనిమిదేళ్ల తరువాత పురంధేశ్వరి రాజకీయాల్లోకి వచ్చారు.

ఆమె టీడీపీ నుంచి కాకుండా కాంగ్రెస్ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. రెండు సార్లు ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రి పదవిని కూడా చేపట్టారు. ఇక చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మాత్రం తెర చాటునే ఉండిపోయారు. 2004లో పురంధేశ్వరి రాజకీయ అరంగేట్రం చేస్తే సరిగ్గా రెండు దశాబ్దాల తరువాత 2023లో పొలిటికల్ గా భువనేశ్వరి అనివార్యంగా రావాల్సి వచ్చింది.

చంద్రబాబు అరెస్ట్ అయి జైలు గోడల మధ్యన నెలకు మించి ఉన్న వేళ పార్టీని నడిపించే బాధ్యతను భువనేశ్వరి తీసుకున్నారు. ఆమె చంద్రబాబు సొంత జిల్లా సొంత నియోజకవర్గం అయిన చంద్రగిరి నుంచి వైసీపీ మీద విమర్శల దాడి చేస్తున్నారు. వైసీపీ సర్కార్ అక్రమంగా తన భర్తను అరెస్ట్ చేసింది అని అంటున్నారు. వైసీపీ పాలన మీద కూడా ఆమె నిప్పులు కురిపిస్తున్నారు.

ఇక దగ్గుబాటి పురందేశ్వరి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా తనదైన శైలిలో వైసీపీ ప్రభుత్వం మీద ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఏపీ అప్పుల పాలు అయిందని ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని ఆమె కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కి లేఖ రాసి అందులో డిమాండ్ చేశారు. ఇపుడు చూస్తే ఆమె మద్యం కుంభకోణం ఏపీలో సాగుతోందని, దాని మీద విచారణ అవసరం అని అంటున్నారు. కేంద్రం దర్యాప్తు చేయాలని కోరుతున్నారు.

ఇలా ఒకేసారి అక్కాచెల్లెళ్ళు ఇద్దరూ వైసీపీ మీద నారీ సమర భేరీ మోగించారు. దానికి వైసీపీలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. న్యాయ స్థానాల మీద ఎవరికైనా గౌరవం ఉండాలని అన్నారు. నిజం గెలవాలి అంటూ భువనేశ్వరి చేస్తున్న పోరాటం ఎవరి మీద అని ఆయన ప్రశ్నించారు. న్యాయ స్థానాలకు తప్పు ఆపాదించే దుస్సాహసం చేస్తున్నారు అని భువనేశ్వరి మీద మండిపడ్డారు.

న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు సాక్ష్యాలు అన్నీ చూసే ఉంటాయని అలాంటిది టీడీపీ చేస్తున్న నిరసనలు పోరాటాలు చూస్తూంటే ఎవరి మీద అనిపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దగ్గుబాటి పురంధేశ్వరి చేసిన కామెంట్స్ మీద ఆయన రియాక్ట్ అయ్యారు. ఏపీలో మద్యం అమ్మకాల మీద కేంద్రం తో దర్యాప్తు జరిపించుకోవచ్చు అని అన్నారు. దానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని బొత్స క్లారిటీగా చెప్పేశారు.

ఏపీలో విపక్షాలకు జనం బలం లేదని ఊరికే హడావుడి చేస్తున్నాయని బొత్స అంటున్నారు. ఏపీలో టీడీపీ ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. పూర్తిగా 2019లోనే తుడిచి పెట్టుకుని పోయిందని ఆయన అన్నారు. జనసేనకు ఏమి బలముందని ఎద్దేవా చేశారు ఈ రెండు పార్టీలు కలసి పొత్తు పెట్టుకుని వస్తే ఏదో జరిగిపోతుందని ఎక్కువగా ఊహించుకుంటున్నాయని బొత్స సెటైర్లు వేశారు.

ఏపీలో వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఉందని, సామాజిక పునాది తమ పార్టీది పటిష్టంగా ఉందని, అందుకే ఏపీ వై నీడ్స్ జగన్ అని తాము జనంలోకి వెళ్తున్నామని అన్నారు. తాము ఏమి తప్పు చేశామో విపక్షాలు చెప్పలేకపోతున్నాయని బొత్స అంటున్నారు. తాము ప్రజల సంక్షేమం చూడడం అభివృద్ధి చేయడమే తప్పు అన్నట్లుగా విపక్షాలు చెబితే ఏమీ చేయలేమని అన్నారు.