Begin typing your search above and press return to search.

సోషల్‌ మీడియా ప్రొఫైల్‌ మార్చేసిన మోడీ... ఇంట్రస్టింగ్ ట్వీట్!

సోషల్ మీడియాలో భారతదేశ ప్రధాని మోడీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

By:  Tupaki Desk   |   9 Aug 2024 8:16 AM GMT
సోషల్‌  మీడియా ప్రొఫైల్‌  మార్చేసిన మోడీ... ఇంట్రస్టింగ్  ట్వీట్!
X

సోషల్ మీడియాలో భారతదేశ ప్రధాని మోడీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ట్విట్టర్ లో ఆయన ఫాలోవర్స్ సంఖ్య 100 మిలియన్లు పైబడే ఉందంటే ఆ ఫాలోయింగ్ గురించి అర్ధం చేసుకోవచ్చు. ఆ సంగతి అలా ఉంటే తన ఎక్స్ ఖాతా ప్రొఫైల్ మార్చారు మోడీ. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

అవును... స్వాతంత్ర దినోత్సవం సమీపిస్తున్న వేళ దేశ ప్రజలకు మోడీ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా అందరూ "హర్ ఘర్ తిరంగా అభియాన్"లో పాల్గొనాలని తెలిపారు. ఈ సమయంలో తన సోషల్ మీడియా ప్రొఫైల్ కూడా మార్చిన మోడీ.. ఎక్స్ ఖాతా ప్రొఫైల్ లో త్రివర్ణ పతాకాన్ని ఉంచారు. ఈ నేపథ్యలోనే హర్ ఘర్ తిరంగా ప్రచారంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఇదే క్రమంలో... ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి హర్ ఘర్ తిరంగా అభియాన్ ను ఓ చిరస్మరణీయ ప్రజా ఉద్యమంగా మారుద్దామని... ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని గౌరవించేందుకు దేశప్రజలంతా తనతో చేతులు కలపాలని ప్రధాని మోడీ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఆగస్టు 9 నుంచి దేశవ్యాప్తంగా ప్రతీ ఇంటిలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలన్నే నినాదాన్ని ప్రారంభించారు.

ఇక ఇది ఆగస్టు 15తో ముగుస్తుండగా.. ఈ ప్రచారాన్ని విజయవంతం చేసేందుకు దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని అధికార బీజేపీ పార్టీ కార్యకర్తలను కోరింది. మరోపక్క క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రధాని మోడీ ఈ రోజు నివాళులర్పించారు. స్వతంత్ర పోరాటంలో ఇదొక చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన మోడీ... మహాత్మ గాంధీ నాయకత్వంలో దేశంలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైందని.. ఈ ఉద్యమం బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం సాధించడంలో ముఖ్యపాత్ర పోషించిందని అన్నారు. ఈ ఉద్యమం ప్రారంభమైన ఐదేళ్ల తర్వాత మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తుచేశారు.

ఏమిటీ హర్ ఘర్ తిరంగా ప్రచారం?

త్రివర్ణ పతాకాన్ని తమ తమ ఇళ్ల వద్ద ఎగరేయాలనే ప్రచారాన్ని ప్రధాని మోడీ స్వయంగా చేపట్టారు. 2022 జూలై 22 నుంచి మోడీ సర్కార్ స్వాతంత్ర్య అమృత మహోత్సవ అభియాన్ కింద ఈ ప్రచారం ప్రారంభించారు. నాటి నుంచి ప్రతీ సంవత్సరం ఈ ప్రచారం నిర్వహిస్తున్నారు. జూలై 22 - 1947న త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండగా ఆమొదించిన రోజని మోడీ తెలిపారు.