Begin typing your search above and press return to search.

స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!

ఈ నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఇదే అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ పలు అంశాలను ప్రస్తావించారు. పలు రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారని వెల్లడించారు.

By:  Tupaki Desk   |   15 Aug 2024 8:13 AM GMT
స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!
X

78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేసి వందనం ఘటించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌ లో హిందువులపై దాడులను ప్రస్తావించిన ఆయన వారి భద్రత గురించి 140 కోట్ల భారతీయులు కలత చెందుతున్నారని తెలిపారు. అలాగే బంగ్లాదేశ్‌ లో మైనారిటీల భద్రత గురించి కూడా ఆందోళన నెలకొందన్నారు.

బంగ్లాదేశ్‌ కు ఎప్పుడూ భారత్‌ సన్నిహిత మిత్రదేశంగా కొనసాగుతుందని మోదీ తెలిపారు. ఆ దేశ పురోగతికి శ్రేయోభిలాషిగా ఉంటామన్నారు. బంగ్లాదేశ్‌ లో నెలకొన్న ప్రస్తుత రాజకీయ అస్థిరత పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నామని వెల్లడించారు. హిందువులు, ఇతర మైనారిటీల భద్రతకు బంగ్లా సర్కారు ప్రాధాన్యమివ్వాలని కోరారు.

రిజర్వేషన్ల సందర్భంగా ఏర్పడిన అల్లర్లు శ్రుతి మించడంతో ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేసి దేశం వదిలి వెళ్లిపోయారు. దీంతో తాత్కాలిక ప్రభుత్వాన్ని సైన్యం ఏర్పాటు చేసింది. దీంతో 15 ఏళ్ల షేక్‌ హసీనా సర్కారు పాలన అర్థాంతరంగా ముగిసింది. అప్పటి నుంచి ఆ దేశంలో హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఇదే అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ పలు అంశాలను ప్రస్తావించారు. పలు రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారని వెల్లడించారు. నాయకత్వ స్థానాల్లోనూ ఉన్నారని గుర్తు చేశారు. అయితే మహిళలపై జరుగుతున్న దాడులతో దేశ ప్రజలతోపాటు తనను ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు. వీటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు సమాజం తీవ్రంగా పరిగణించాలని కోరారు.

మహిళలపై దాడుల కేసులను వేగంగా దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో నిందితులకు కఠిన శిక్షలు విధించాలన్నారు. ఇలా చేస్తేనే సమాజంలో నమ్మకం కుదురుతుందన్నారు.

అదేవిధంగా మనదేశంలో ప్రజలు పిల్లల చదువులకు లక్షల రూపాయల ఖర్చు చేస్తున్నారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా దేశంలోనే విద్యా సంస్థలను అత్యుత్తమంగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రాచీన కాలంలో దేశంలో విలసిల్లిన నలంద విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించామని గుర్తు చేశారు. నలందకు ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు వచ్చి చదువుకునేవారని గుర్తు చేశారు. ఇప్పుడు నలంద స్ఫూర్తిని నిలబెట్టాల్సిన అసవరం ఉందన్నారు.

"ఓకల్‌ ఫర్‌ లోకల్‌" ఆత్మనిర్భర్‌ కు కీలక మంత్రంగా నిలుస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న సివిల్‌ కోడ్‌ మతపరమైందని, వివక్ష చూపుతోందని.. అందుకే దీని స్థానంలో యూనిఫామ్‌ కోడ్‌ ను తీసుకువచ్చామన్నారు. ప్రజలు కులతత్వాన్ని వదిలించుకోవాలని కోరారు.