Begin typing your search above and press return to search.

సహానా విషాద ఉదంతంలో నిందితుడు నవీన్ తల్లి మాటల్ని విన్నారా?

సంచలనంగా మారిన తెనాలి సహానా విషాద ఉదంతం ఇప్పుడు రాజకీయంగా మారింది.

By:  Tupaki Desk   |   24 Oct 2024 4:53 AM GMT
సహానా విషాద ఉదంతంలో నిందితుడు నవీన్ తల్లి మాటల్ని విన్నారా?
X

సంచలనంగా మారిన తెనాలి సహానా విషాద ఉదంతం ఇప్పుడు రాజకీయంగా మారింది. ఎప్పుడైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ ఇచ్చి.. మాట్లాడారో అప్పటి నుంచి ఈ ఇష్యూ పొలిటికల్ గా టర్న్ తీసుకుంది. సహానాను చంపినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు నవీన్ తెలుగుదేశం పార్టీకి చెందిన వాడని.. అతడి మెడలో పార్టీ కండువా కప్పుతున్న చంద్రబాబు ఫోటోలు ఉన్నాయని.. ఇలాంటి నేరస్తుల పార్టీగా తెలుగుదేశం పార్టీని అభివర్ణించారు. సహానా కుటుంబ సభ్యులను పక్కన పెట్టుకొని మీడియాతో మాట్లాడారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. నిందితుడు నవీన్ తల్లి ఈ ఉదంతంలో మీడియా మందుకు వచ్చారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తమ కుటుంబాన్ని స్వార్థరాజకీయాలకు బలి చేయొద్దన్నారు. వైసీపీ వారితో తిరగటం వల్లే తన కొడుకు రౌడీ షీటర్ గా మారాడని ఆరోపించారు. సహానా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నవీన్ గురించి అతడి తల్లి సంచలన విషయాల్నివెల్లడించారు.

తాజా పరిణామాల నేపథ్యంలో ఆమె ఒక వీడియో విడుదల చేశారు. అందులో ఆమె మాట్లాడుతూ.. ‘‘వైసీపీ వారితో తిరుగుతూ వారి పనులకు వెళ్లేవాడు. గతంలో నా కొడుకునుకారు నడపటానికి తీసుకెళ్లి రౌడీ షీటర్ గా మార్చారు. సహాన కుటుంబీకులు మా బంధువులే. నవీన్ కు.. ఆమెకు పెళ్లి చేయాలనుకున్నాం. ఈ క్రమంలో ఇలా జరిగింది. అమ్మాయి చనిపోయి వాళ్లు.. అబ్బాయికి ఇలా కావటంతో మేం ఎంతో బాధ పడుతున్నాం. మా కుటుంబాలు ఏదో ఒకటి మాట్లాడుకుంటాయి. ఇప్పటికైనా మమ్మల్ని వదిలేయండి’’ అని వేడుకున్నారు.

నవీన్ తల్లి వాదన ఇలా ఉంటే.. గుంటూరు జీజీహెచ్ వద్దహడావుడి చేసిన జన్.. సహాన మరణానికి కారణమైన నవీన్ అనే వ్యక్తి చంద్రబాబుతో దిగిన ఫోటోలు ఉన్నాయని.. స్థానిక ఎంపీతోనూ సన్నిహితంగా ఉంటారని ఆరోపించటం తెలిసిందే. టీడీపీకి చెందిన వ్యక్తిని ఇంత దారుణ ఉదంతంలోనూ నిస్సిగ్గుగా రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విచిత్రమైన విషయం ఏమంటే.. హత్య ఘటన వెలుగు చూసిన గంటల్లోనే నిందితుడు నవీన్ ను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినప్పటికీ.. వైసీపీ అధినేత మాత్రం అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేయటం గమనార్హం.