Begin typing your search above and press return to search.

అప్పులిస్తాం.. తీసుకోండి: రాష్ట్రాల‌కు నిర్మ‌ల‌మ్మ ఉచిత స‌ల‌హా!

తాజాగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రుల‌తో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశం నిర్వ‌హించారు.

By:  Tupaki Desk   |   23 Jun 2024 4:46 AM GMT
అప్పులిస్తాం.. తీసుకోండి:  రాష్ట్రాల‌కు నిర్మ‌ల‌మ్మ ఉచిత స‌ల‌హా!
X

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తీరు మార‌లేదు. రాష్ట్రాల‌ను అప్పుల మ‌యం చేయ‌డంలో ఆయ‌న‌కున్న జిజ్ఞాస మ‌రే ప్ర‌ధాన మంత్రికీ లేద‌ని అనిపిస్తోం ది. గ‌తంలో రాష్ట్రాలు అప్పులు పాల‌వుతుంటే.. వాజ‌పేయి వంటి వారు గుండెలు బాదుకున్నారు. నా దేశం అప్పుల కుప్ప‌లా మారుతోందంటూ.. క‌వితల రూపంలో పార్ల‌మెంటులోనే ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అంతేకాదు.. ''అప్పులు చేయ‌కుండా మిమ్మ ల్ని మీరు నియంత్రించుకోండి'' అని ఆయ‌న అప్ప‌ట్లో మేలైన స‌ల‌హా కూడా ఇచ్చారు. కానీ, ఈ ప‌రంప‌రలోనే అధికారంలోకి వ‌చ్చిన మోడీ మాత్రం... సాధ్య‌మైన‌న్ని అప్పులు చేసుకోండి.. మీ అప్పుల‌కు మేం గ్యారెంటీ! అంటూ రాష్ట్రాల‌ను అప్పులు మ‌యం చేస్తున్నారు.

తాజాగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రుల‌తో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో ఆమె ఉచితంగా మేలైన సూచ‌న చేశారు. ''అప్పులు చేసుకోండి. వ‌డ్డీకూడాలేదు. 50 ఏళ్ల త‌ర్వాత క‌ట్టండి. అప్ప‌టి వ‌ర‌కు మిమ్మ‌ల్ని వ‌డ్డీ అడిగే ప్ర‌సక్తే లేదు'' అని స‌ల‌హాల‌పై స‌ల‌హాలు గుప్పించారు. దీంతో స‌మావేశానికి వ‌చ్చిన ఆర్థిక మంత్రుల నోట మాట రాలేదు. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపో యాయి. అంతేకాదు.. ఈ అప్పులు చేసేందుకు కేంద్రం తీసుకువ‌చ్చిన సంస్క‌ర‌ణ‌లు అమలు చేసిన ఒడిసా ప్ర‌భుత్వం, ఏపీ ప్ర‌భుత్వం(చెత్త‌పై ప‌న్ను, పెట్రో ధ‌ర‌ల పెంపు, భూముల ధ‌ర‌ల పెంపు, ఉద్యోగాల‌కోత‌, పాఠ‌శాల‌ల విలీనం, టీచ‌ర్ ఉద్యోగాల నియామ‌కాలు ఆపేయ‌డం) కుప్ప‌కూలిపోయాయి.

దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్పులు చేయాలంటేనే భ‌య‌ప‌డిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. పోనీ.. అప్పులు ఇస్తున్నారు క‌దా.. తీసుకుందామంటే.. దీనికి కూడా ష‌ర‌తులు పెడుతున్నారు మోడీ. తాజాగా 50 ఏళ్ల త‌ర్వాత తీర్చే వ‌డ్డీలేని అప్పుల‌కు కూడా.. నిర్మ‌ల‌మ్మ ష‌ర‌తులు విధించారు. ఆ నిధుల‌ను కూడా.. తాము చెప్పిన ప‌థ‌కాల‌కే కేటాయించాల‌ని.. వాటిలోనే ఖ‌ర్చు చేయాల‌న్నారు. అప్పుగా తీసుకునే మొత్తాన్ని పౌర కేంద్రీకృత ప్రాజెక్టుల కోసం వినియోగించాల్సి ఉంటుందని, ఆయా షరతులకు కట్టుబడి రాష్ట్రాలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని నిర్మ‌ల స‌ల‌హా ఇచ్చారు.

దీనికి మోడీ స‌ర్కారు పెట్టిన పేరు.. ‘స్పెషల్‌ అసిస్టెన్స్‌ టు స్టేట్స్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌’ . అంటే.. మూల ధ‌న వ్య‌యం. నిజానికి ఒక‌ప్పుడు మూల ధ‌న వ్య‌యంలో కేంద్రం స‌హ‌క‌రించేది. 40:60 ప్రాతిపదిక‌న నిధులు ఇచ్చేది . ఇప్పుడు దీని నుంచి త‌ప్పించుకుని.. రాష్ట్రాల‌పై అప్పుల రూపంలో భారం మోపేస్తోంది. ఇక‌, ఈ అప్పుల‌ను కూడా(50 ఏళ్ల త‌ర్వాత వ‌డ్డీ లేకుండా చెల్లించే అప్పు) విద్య, వైద్యం, నీటి పారుదల, మంచినీటి సరఫరా, విద్యుత్‌, రహదారులు వంటి వాటి కోసం మాత్ర‌మే వినియోగించాలి. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. ఈ అప్పులు తీసుకున్న రాష్ట్రాల‌కు ఆయా విభాగాల్లో కేంద్రం ఇక‌పై రూపాయి కూడా ఇవ్వ‌దు. మొత్తానికి మోడీ ఈ దేశాన్ని ఏం చేయాల‌ని అనుకుంటున్నారో.. ఈ అప్పులు ఏంటో.. అని ఆర్థిక నిపుణులు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.