Begin typing your search above and press return to search.

'సేవింగ్స్' అకౌంట్ల‌పైనా నిర్మ‌ల‌మ్మ బాదుడు!

ఇది సేవింగ్స్ అకౌంట్ల దారుల‌కు.. కంటిపై కునుకులేకుండా చేస్తుంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   20 Oct 2024 3:30 AM GMT
సేవింగ్స్ అకౌంట్ల‌పైనా నిర్మ‌ల‌మ్మ బాదుడు!
X

బ్యాంకుల్లో మ‌ధ్య‌త‌ర‌గ‌తి, దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి, సాధార‌ణ ప్ర‌జ‌లు ఎక్కువగా ఓపెన్ చేసే అకౌంట్.. సేవింగ్స్ అకౌంట్‌. ఎప్పుడు కావాలంటే అప్పుడు సొమ్ములు వేసుకునేందుకు . ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేందుకు.. ఈ అకౌంట్ ప్ర‌జ‌లకు సౌల‌భ్యంగా ఉంటుంది. పైగా.. ఎవ‌రికీ స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం కూడా లేదు. అయితే..ఇ ప్పుడు మాత్రం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కొత్త రూల్ తెచ్చారు. ఇది సేవింగ్స్ అకౌంట్ల దారుల‌కు.. కంటిపై కునుకులేకుండా చేస్తుంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

సాధార‌ణంగా సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత న‌గ‌దు జ‌మ చేసుకున్నా.. అభ్యంత‌రం లేదు. ఎవ‌రూ అడ‌గ‌రు కూడా. దీనికి కార‌ణం.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి, దిగువ మ‌ధ్య‌త‌ర‌గతి ఉద్యోగులు, వ్యాపారులే వీటిని వినియోగిస్తారు కాబ‌ట్టి. ఇక‌, ప్ర‌ముఖ వ్యాపారాలు చేసేవారు.. జీఎస్టీ ప‌రిధిలోకి వ‌చ్చేవారు.. ఎలానూ కరెంట్ అకౌంట్లు తీసుకుంటారు. వీరు ఏటా ఐటీ స‌ర్టిఫికెట్‌ను ఇస్తారు. ఇవ్వాలి కూడా. పైగా.. వీరి లావాదేవీల‌పై ఐటీనిఘా ఎప్పుడూ ఉంటుంది.

కానీ, ఇప్పుడు నిర్మ‌లా సీతారామ‌న్ తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం.. ఇక నుంచి సేవింగ్స్ అకౌంట్స్‌పైనా.. ఐటీ నిఘా ఉండ‌నుంది. ఏడాదికి రూ.10 ల‌క్ష‌ల‌కు మించి ఎవ‌రైనా సొమ్మును సేవింగ్స్‌లో జ‌మ చేస్తే.. (అది ఎప్పుడైనా కావొచ్చు.) వాటిపై జీఎస్టీ క‌ట్టాలి.(వాస్త‌వానికి వ‌డ్దీపై ఇప్ప‌టికే జీఎస్టీ ఉంది) అదేవిధంగా రూ.10 ల‌క్ష‌లు ఎలా వ‌చ్చాయో.. స‌మ‌గ్రంగా ఐటీకి వివ‌రించాలి. దీనిపై ఆదాయ ప‌న్ను కూడా చెల్లించాలి. ఈ రెండు విష‌యాల్లో ఏ చిన్న తేడా వ‌చ్చినా.. ఐటీ విధించే భారీ జ‌రిమానాలు క‌ట్టాల్సి వ‌స్తుంది.

వాస్త‌వానికి మ‌ధ్య త‌ర‌గ‌తినే తీసుకుంటే.. వారి ఇళ్ల‌లో జ‌రిగే శుభ‌కార్యాల‌యాల‌కు క‌నీసంలో క‌నీసం 15-20 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టాల‌ని అనుకునప్పుడు.. ఆ సొమ్మును ఇళ్ల‌లో పెట్టుకోరు. అప్పు చేసి తెచ్చిన సొమ్మును కూడా బ్యాంకులోనే పెట్టుకుంటారు. కానీ, వారు దీనిపై జీఎస్టీ తోపాటు ఆదాయ‌పన్ను శాఖ‌కు కూడా చెల్లింపులు చేయాలి. మ‌రి దీనివ‌ల్ల మ‌ద్య‌త‌ర‌గ‌తి వారు న‌ష్ట‌పోరా? అంటే.. పోతేపోనీ.. అక్ర‌మార్కుల‌ను క‌ట్ట‌డి చేసేందుకు ఇవి తెచ్చామ‌ని నిర్మ‌ల‌మ్మ గారు సెల‌విస్తున్నారు.

ఈ లాజిక్కులు కుద‌ర‌వు!

కొంద‌రు ఒక అకౌంట్‌లోనే క‌దా.. రూ.10 ల‌క్ష‌లు ఉంటే ప‌న్నులు, జీఎస్టీలు ప‌డేవి.. స‌మాధానం చెప్పాల్సి వ‌చ్చేద‌ని భావించ‌వ‌చ్చు. దీనికి కూడా నిర్మ‌ల‌మ్మ త‌గు స‌మాధాన‌మే చెప్పారు. ఒకే స‌మ‌యంలో ఒక వ్య‌క్తికి ఎన్ని బ్యాంకు అకౌంట్లు ఉన్నాయో.. అన్ని బ్యాంకు అకౌంట్ల‌లోనూ క‌లిపి రూ.10 ల‌క్ష‌లు ఉంటే.. వాట‌న్న‌టినీ ఒకే అకౌంటుగా గుర్తిస్తామ‌ని చెప్పుకొచ్చారు. అంటే.. ఉదాహ‌ర‌ణ‌కు ఎక్స్ అనే వ్య‌క్తికి నాలుగు బ్యాంకు అకౌంట్లు ఉన్నాయ‌ని అనుకుంటే.. ఒక్కొక్కొ దానిలో రెండున్న‌ర ల‌క్ష‌ల చొప్పున సేవింగ్స్ చేశాడ‌ని అనుకున్నా.. అన్నింటినీ క‌లిపి.. ఒకే అకౌంటుగా.. ఒకే సొమ్ముగా ప‌రిగ‌ణిస్తార‌ట‌. దీంతో స‌ద‌రు వ్య‌క్తి ప‌న్నుల బాదుడు నుంచి త‌ప్పించుకునే ప్ర‌శ్నే ఉండ‌ద‌న్న‌ది కేంద్ర మంత్రి ఉవాచ‌. ఇక‌, ప‌న్నులు క‌ట్టేందుకు రెడీ కావాల్సిందే!!