Begin typing your search above and press return to search.

జీఎస్టీలోకి పెట్రోల్, డీజిల్... ఆప్షన్ ఇటు వదిలిన ఆర్థిక మంత్రి!

అవును... తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్యక్షతన జరిగిన 53వ జీఎస్టీ పాలకమండలి సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   23 Jun 2024 4:11 AM GMT
జీఎస్టీలోకి పెట్రోల్, డీజిల్... ఆప్షన్  ఇటు వదిలిన ఆర్థిక మంత్రి!
X

కేంద్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్యక్షతన 53వ జీఎస్టీ పాలక మండలి సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో మండలి సభ్యులతో పాటు ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎస్టీ ఆధారంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో పెట్రోల్, డీజిల్ లను జీఎస్టీలోకి తీసుకు వచ్చే విషయం కూడా ఒకటి!

అవును... తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్యక్షతన జరిగిన 53వ జీఎస్టీ పాలకమండలి సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ విషయాలను నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇందులో భాగంగా నెలకు రు.20,000 కంటే తక్కువ ఛార్జీలు వసూలు చేసే అన్ని ప్రైవేటు హాస్టళ్లకు జీఎస్టీ మినహాయింపు ఇచ్చారు.

రైల్వేల విషయానికొస్తే... ఫ్లాట్ ఫాం టిక్కెట్లు, విశ్రాంతి గదులు, వెయిటింగ్ హాళ్లు, బ్యాటరీ వాహనాలు, సామాన్యులు భద్రపరిచే గదులు, రైల్వే శాఖలో అంతర్గత లావాదేవీలపై జీఎస్టీ మినహాయింపుకు ఆమొదం తెలిపింది జీఎస్టీ పాలకమండలి. మరోపక్క విమానాల విడిభాగాలు, టెస్టింగ్ సామాగ్రి దుగుమతిపై 5శాతం జీఎస్టీ వర్తిస్తుందని వెల్లడించింది.

మిల్క్‌ క్యాన్లపై జీఎస్టీని 12శాతానికి పరిమితం చేసిన మండలి.. కార్టన్ బాక్సులపై పన్నును 18 నుంచి 12 శాతానికి తగ్గించింది. ఇదే సమయంలో కోళ్ల ఫారాల యంత్రాలపై 12శాతం జీఎస్టీ ఉంటుందని తెలిపింది. ఇదే సమయంలో పెట్రో ఉత్పత్తులపైనా జీఎస్టీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలను కీలకం చేసింది.

ఇందులో భాగంగా... పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో కేంద్రం సానుకూలంగానే ఉందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే పన్నురేటుపై మాత్రం రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆమె తెలిపారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలు కలిసి ఏకతాటిపైకి రావాలని ఆమె సూచించారు.