ఎన్డీయేలో కీలక పరిణామం.. నితీశ్ కుమారుడి కొత్త మెలిక!
కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో నితీశ్ కుమార్ ప్రస్తుతం కీలక భూమిక పోషిస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 26 Feb 2025 11:55 AM GMTకేంద్రంలోని ఎన్డీయే కూటమిలో నితీశ్ కుమార్ ప్రస్తుతం కీలక భూమిక పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజా కేంద్ర బడ్జెట్ లోనూ బీహార్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది మోడీ ప్రభుత్వం. మరోపక్క ఈ ఏడాది చివర్లో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో ఓ ఆసక్తికర డిమాండ్ తెరపైకి వచ్చింది.
అవును... బీహార్ కేంద్రంగా రాజకీయం ఆసక్తిగా మారుతోంది. ఈ ఏడాది చివర్లో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో ఓ ఆసక్తికర ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... రాబోయే ఎన్నికలకు ఎన్డీయే సీఎం అభ్యర్థిగా నితీశ్ పేరు ప్రకటించాలని ఆయన కుమారుడు నిశాంత్ డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో ఎన్నికలకు ముందే ఈ ప్రకటన చేయాలని కోరారు. ఫలితంగా.. బీహార్ లో కూటమి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో... ఇప్పటికే రికార్డ్ స్థాయిలో తొమ్మిదిసార్లు బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ పేరు మరోసారి ప్రకటించాలనే కోరికపై బీజేపీ రియాక్షన్ ఇప్పుడు ఆసక్తిగా మారింది.
మరోపక్క ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్.. తన మంత్రివర్గ విస్తరణకు సిద్ధం అయ్యారు. ఈ సాయంత్రం తన మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించారు. దీంతో.. కొత్తగా నలుగురు బీజేపీ, ఇద్దరు జేడీయూ ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం దక్కనుందని తెలుస్తోంది.
తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కడంతో రెవెన్యూ మంత్రి దిలీప్ జైస్వాల్.. తన మంత్రి పదవిని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. ఇప్పుడు ఖాళీగా ఉన్న మంత్రుల స్థానాలను భర్తీ చేయాలని నితీశ్ నిర్ణయించారు.
కాగా.. ప్రస్తుతం నితీశ్ మంత్రివర్గంలో 15 మంది బీజేపీ, 13 మంది జేడీ (యూ), హెచ్.ఏ.ఎం. నుంచి ఒకరు, మరో స్వతంత్ర అభ్యర్థి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడున్న మంత్రులు చాలా మంది ఒకటికంటే ఎక్కువ పోర్టు పోలియోలు నిర్వహిస్తున్నారు.