Begin typing your search above and press return to search.

జగన్ వెళ్ళాల్సిన చోటకు పవన్ వెళ్తున్నారు ?

గత వారం రోజులుగా ఉత్తరాంధ్రను వణికిస్తున్న అతిసారా కేసులు విజయనగరం జిల్లా గుర్ల మండలంలో చోటు చేసుకున్నాయి.

By:  Tupaki Desk   |   20 Oct 2024 11:30 PM GMT
జగన్ వెళ్ళాల్సిన చోటకు పవన్ వెళ్తున్నారు ?
X

గత వారం రోజులుగా ఉత్తరాంధ్రను వణికిస్తున్న అతిసారా కేసులు విజయనగరం జిల్లా గుర్ల మండలంలో చోటు చేసుకున్నాయి. ఇప్పటికి అయితే పన్నెండు మంది దాకా అతిసారాతో మరణించారు అని లెక్కలు చెబుతున్నారు దాదాపుగా వందమందికి పైగా ఆసుపత్రి పాలు అయ్యారు. ఇంకా వీరి నంబర్ అనధికారికంగా ఎక్కువగానే ఉంది.

కలుషితమైన నీటిని తాగి ఈ విధంగా తీవ్ర అనారోగ్య బారిన పడ్డారని అంటున్నారు. ఇదిలా ఉంటే అతిసారా కేసులతో ఏకంగా మరణాలు సంభవించడం అంటే కూడా ఆశ్చర్యమే అంటున్నారు. ఇంతలా వైద్య రంగం అభివృద్ధి చెందింది. అలాగే ప్రజలకు మౌలిక సదుపాయాలు పెరుగుతున్న నేపథ్యం ఉంది.

ఈ పరిస్థితుల్లో కూడా ఎక్కడా మారు మూల కాదు విజయనగరం జిల్లా కేంద్రానికి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి కూడా రక్షిత మంచినీరు అందించడం జరగడం లేదా అన్న చర్చ కూడా సాగుతోంది. ఒక విధంగా చెప్పాలీ అంటే ఇది పాలకుల ఉదాశీనత అలాగే అధికారుల నిర్లక్ష్యం అని చెబుతున్నారు.

ప్రజలకు కనీస అవసరం అయిన రక్షిత మంచినీటిని అందించలేకపోవడం కంటే దారుణం వేరొకటి ఉండదు, ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో మారుమూలాల్లో అయితే ఏమో అనుకోవచ్చు కానీ పట్టణానికి దగ్గరలోనే ఈ విధంగా జరగడం అంటే బాధాకరమే.

ఇక గుర్లలో అతిసారా కేసుల విషయంలో ప్రభుత్వమే కాదు ప్రతిపక్షమూ ఆలస్యంగానే స్పందించింది అని అంటున్నారు. అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ఏకంగా మరణాలు పెరుగుతున్న వేళ విశాఖలో ప్రెస్ మీట్ పెట్టి ఈ మరణాలకు సర్కార్ వైఫల్యమే కారణం అని విమర్శించారు.

మరో వైపు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గుర్ల మండలానికి వెళ్ళి అతిసారా మరణాలకు గత ప్రభుత్వం వైఖరే కారణం అన్నారు. వ్యవస్థలను మొత్తం పాడు చేయడం వల్లనే ఈ పరిస్థితి అని ఆయన అంటున్నారు ఈ విధంగా ఆరొపణలు ప్రత్యారోపణలు జరుగుతున్న వేళ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లా గుర్ల మండలానికి సోమవారం వెళ్తున్నారు. ఆయన అతిసారా బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు అని అంటున్నారు. అంతే కాదు ఆయన అక్కడ పరిస్థితులు తెలుసుకుని అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేస్తారు అని అంటున్నారు

మామూలుగా అయితే అక్కడికి ప్రతిపక్షం వెళ్ళి వాలాలి. అయితే విపక్ష నేత జగన్ ఎందుకో ట్వీట్ మాత్రమే చేసి వదిలిపెట్టారు. దాంతో జగన్ వెళ్లాల్సిన చోటకు పవన్ వెళ్తున్నారు అని అంటున్నారు. ఆలస్యంగా రియాక్ట్ అయినా ప్రభుత్వం ఈ ఇష్యూని సీరియస్ గానే తీసుకుంది అని అంటున్నారు.

ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో ప్రభుత్వం బాగా ప్రబలిన అతిసారా కేసుల మూలాలను దానికి గల కారణాలను అధ్యయనం చేసి నివేదిక కోరనుంది. మొత్తానికి ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత తొలిసారిగా ఉత్తరాంధ్ర కు వస్తున్నారు. అది కూడా ఆయన బాధితులను పరామర్శించడానికి వస్తున్నారు. మరి పవన్ ఏమి మాట్లాడుతారు ఆయన ఏ విధంగా ప్రభుత్వ యంత్రాంగానికి డైరెక్షన్లు ఇస్తారు అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు. మరి పవన్ వచ్చి వెళ్ళిన తరువాత అయినా జగన్ గుర్ల టూర్ ఉంటుందా అన్నది కూడా ఆసక్తిని రేపుతోంది.