Begin typing your search above and press return to search.

ప్రాయశ్చిత్త దీక్షను లాగుతున్న డిప్యూటీ సీఎం పవన్

పదకొండురోజుల పాటు చేసే ఈ దీక్షను చేపట్టిన పవన్ కల్యాణ్ తాజాగా మరో ఆసక్తికర ప్రకటన చేశారు.

By:  Tupaki Desk   |   30 Sep 2024 4:27 AM GMT
ప్రాయశ్చిత్త దీక్షను లాగుతున్న డిప్యూటీ సీఎం పవన్
X

ఏపీ ముఖ్యమంత్రి మరో సంచలనానికి తెర తీశారు. తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వుతో తయారు చేసిన ఆవునెయ్యిని ఉపయోగించిన వైనంపై పెను వివాదం నడుస్తోంది. దీనిపై గత ప్రభుత్వం తప్పు చేసినట్లుగా కూటమి సర్కారు మండిపడుతోంది. ఇదోవైపు సాగుతున్న వేళలోనే జనసేనాని.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నట్లుగా ప్రకటించిన సంచలనంగా మారారు.

పదకొండురోజుల పాటు చేసే ఈ దీక్షను చేపట్టిన పవన్ కల్యాణ్ తాజాగా మరో ఆసక్తికర ప్రకటన చేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి జరిగిన ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన ఒక ప్రకటనను సోషల్ మీడియాలో షేర్ చేయటం ఆసక్తికరంగా మారింది. లడ్డూ ప్రసాద తయారీలో జంతు అవశేషాలతో కల్తీ జరిగిన వైనంపై ఇప్పటికే ఆయన తీవ్రంగా రియాక్టుకావటం తెలిసిందే.

ఎక్స్ లో పోస్టు చేసిన ప్రకటనను చూస్తే.. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన లడ్డూ మహాప్రసాదం జంతు అవశేషాలతో కల్తీ జరిగి మహా అపచారానికి గురైంది. దీన్ని నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఈ డిజైన్ లో మీ ఫోటో పెట్టుకొని ఓం నమో నారాయణాయ మహా మంత్రాన్నిజపించాలి. జరిగిన అపవిత్రానికి ప్రాయశ్చిత్తంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని క్షమాపణ వేడుకోవాలి. మన ఆలయ సంప్రదాయాలు.. సనాతన ధర్మం పవిత్రను కాపాడుకోవాలని పిలుపునిస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విషయానికి వస్తే.. ఈ నెల 22న గుంటూరు శివారులోని నంబూరులో శ్రీదశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో దీక్ష చేపట్టారు. పదకొండు రోజుల పాటు దీక్ష కొనసాగించిన అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోన్నారు. మరి.. పవన్ పిలుపు ఏ మేరకు స్పందన వస్తుందో చూడాలి.