ఓవర్ టూ పిఠాపురం : .పవన్ వైపే అందరి చూపు !
పవన్ కళ్యాణ్ మౌనాన్ని ఎక్కువగా ఆశ్రయిస్తారు. అపుడు అది కూడా ఎంతో భయంకరంగా ఉంటుంది.
By: Tupaki Desk | 13 March 2025 4:10 PM ISTపవన్ కళ్యాణ్ మౌనాన్ని ఎక్కువగా ఆశ్రయిస్తారు. అపుడు అది కూడా ఎంతో భయంకరంగా ఉంటుంది. ఆయన మౌనం వెనక ఏమి దాగి ఉంది అన్నది తెలియక అంతా కలవరపడతారు. మరో సమయంలో పవన్ అలా మాట్లాడేస్తూనే ఉంటారు. ఆయన మాటలలో నిప్పులు రాలుతూనే ఉంటాయి. అవి ఎవరికి తగాలలో వారికి తగిలి మంటను పుట్టిస్తాయి.
ఇలా పవన్ లోనే ద్వైదీభావం ఉందా అనిపించేలా ఆయన వ్యవహార శైలి సాగుతుంది. ఆయన రెండు వైపులా పదునైన కత్తి అని కూడా అన్న వారు ఉన్నారు. తన మౌనంతోనూ మాట్లాడగలరు. అదే సమయంలో తన మాటలతో తూటాలు పేల్చగలరు. అటువంటి పవన్ మరి కొద్ది గంటలలో తన మౌనాన్ని చేదించబోతున్నారు.
ఆయన లక్షలాది మందితో సాగే జనసేన ఆవిర్భావ సభలో పవన్ తనదైన శైలిలో ప్రసంగం చేయనున్నారు. ఈ ప్రసంగం రాజకీయ ప్రసంగంగా ఉంటుంది. అదే సమయంలో జనసైనికులకు దిశా నిర్దేశం చేసేదిగా ఉంటుంది. అంతే కాదు ఏపీ రాజకీయాలను నిర్దేశించేలా ఉంటుంది అని అంటున్నారు.
ఇక పవన్ చాలా కాలంగా అనేక విషయాల్లో మౌనంగా ఉంటున్నారు. మరి ఆయన మౌనం వెనక కారణాలు ఏమున్నాయన్నది ఎవరికీ తెలియదు. ఆయన అసెంబ్లీలో ఇటీవల మాట్లాడుతూ 15 ఏళ్ళ పాటు కూటమి ప్రభుత్వం ఉండాలని కోరుకున్నారు. ఆ వెంటనే నాదెండ్ల మనోహర్ పవన్ లేకపోతే కూటమి ప్రభుత్వమే లేదని సంచలన కామెంట్స్ చేశారు.
కూటమి ఈ రోజున అధికారంలో ఉంది అంటే దానికి పవన్ కారణం అని అన్నారు. ఇలా పవన్ ఒక వైపు కూటమి ఉండాలని అంటూంటే ఆయనకు ఆత్మ లాంటి ఆంతరంగీకుడు నాదెండ్ల ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇపుడు పవన్ ఏమి మాట్లాడబోతున్నారు అన్నదే చర్చగా ఉంది. కూటమి పదిహేనేళ్ళ పాటు అధికారంలో ఉండాలీ అంటే కనుక అది వైసీపీకి ధీటుగా ఇచ్చిన జవాబు.
మరి నాదెండ్ల ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే అది కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న పెద్దలకు నేరుగా తాకే డైలాగ్ అని అంటున్నారు. ఈ క్రమంలో చూస్తే కనుక పవన్ స్పీచ్ జనసేన సభలో ఎలా ఉండబోతోంది అన్నది చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది అని చెప్పేఅల్సిందే.
ఇక అసెంబ్లీలో పవన్ మాట్లాడుతూ తామే అధికార ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పారు. ఎటూ వైసీపీ సభకు హాజరు కావడం లేదు కాబట్టి తమదే విపక్ష పాత్ర కూడా అని ఆయన అనడం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఏ మాటకు ఆ మాటే చెప్పుకుంటే ఏపీలో లా అండ్ ఆర్డర్ విషయంలో తమ ప్రభుత్వం మీద పవన్ విమర్శలు చేసినా కాకినాడలో బియ్యం అక్రమంగా తరలిపోతుందన్న దాని మీద ఏకంగా సముద్రం మధ్యలోకి వెళ్ళి తనిఖీలు చేసినా పవన్ కే చెల్లింది.
అంటే ఆయన అధికారంలో ఉన్నాం కదా అని దేనినీ ఉపేక్షించరు అని అంటున్నారు. తప్పు జరిగితే ప్రభుత్వం తరఫున తాను క్షమాపణలు చెప్పడమే కాదు అవతల వారి చేత చెప్పించడానికి ఆయన సిద్ధంగా ఉండారు. అలా పవన్ తన అధికార రాజకీయానికి ప్రతిపక్ష పూతను పూస్తూ అన్ని వైపులా పదును ఉందని నిరూపించుకునే క్రమంలో వచ్చిన ఈ ఆవిర్భావ సభలో ఆయన ఏమి మాట్లాడుతారు అన్నది మాత్రం సర్వత్రా ఉత్కంఠను పెంచేదిగానే ఉంది అని అంటున్నారు.
పవన్ ఈ సభలో చేసే ప్రసంగంతో ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేగుతాయా అన్నది కూడా అంతా అనుకుంటున్న మాటగా ఉంది. మొత్తానికి జనసేన ఆవిర్భావ సభకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. పవన్ వైపే అందరి చూపూ ఉంది. ఆయన మీదనే అందరి ఆలోచనలూ ఉన్నాయి. సో ఓవర్ టూ పిఠాపురం..ఏమి జరుగుతుందో చూద్దాం.