Begin typing your search above and press return to search.

మోడీ సభలో ఆవేశంతో ఊగిన పవన్...!

మైక్ దగ్గరకు వస్తే ఎదురుగా జనాలు ఉంటే జనసేన అధినేత పవన్ ఒక్క లెక్కన ఊగిపోతారు.

By:  Tupaki Desk   |   17 March 2024 2:40 PM GMT
మోడీ సభలో  ఆవేశంతో  ఊగిన పవన్...!
X

మైక్ దగ్గరకు వస్తే ఎదురుగా జనాలు ఉంటే జనసేన అధినేత పవన్ ఒక్క లెక్కన ఊగిపోతారు. నిండా ఆవేశం నింపుకుని ఫైర్ బ్రాండ్ అవతారం ఎత్తేస్తారు. చిలకలూరిపేటలో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ సభలోనూ పవన్ మరోసారి ఆవేశంతో ఊగిపోయారు. ఆయన జగన్ మీద నిప్పులు చెరిగారు.

సొంత చిన్నాన్నను చంపేశారు అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన అవినీతి రాజ్యం స్థాపించారు అని మండిపడ్డారు. జగన్ దగ్గర డబ్బు ఉందని దాన్ని చూసుకుని ఆయన దూకుడు చేస్తున్నారు అని నిందించారు. రావణాసురుడు బంగారు లంకను కట్టుకున్నా నార వస్త్రాలు కట్టిన రాముడి చేతిలో పతనం చెందారని, చిటికెన వేలంత ఉన్న జగన్ లాంటి రావణాసురుడు తమకు ఎంత అని ఆయన ప్రశ్నించారు.

జగన్ ప్రభుత్వం గంజాయ్ రాజ్యాన్ని స్థాపించిందని ఆయన ఆరోపించారు. ఏపీలో వేలాది మంది మహిళలు కనిపించకుండా పోయినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. జగన్ ఒక సారా వ్యాపారిగా మారి మద్యం వ్యాపారం చేస్తున్నారని అన్నారు. ఈ ఐదేళ్లలో రూ.1,13,580 కోట్ల మేర మద్యం అమ్మకాల సాగితే దాన్ని రూ.84,050 కోట్లుగా మాత్రమే చూపిస్తున్నారు. అలా రూ.10 వేల కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టారని పవన్ ఆరోపించారు.

అదే విధంగా జేపీ వెంచర్స్ పేరు మీద రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరిగిందని, దీని వెనక ఉన్న ఐదుగురు బినామీలు ఎవరో అందరికీ తెలుసు అని పవన్ అన్నారు. ఇలా దాదాపు రూ.40 వేల కోట్ల మేర ఇసుక కుంభకోణం చేశారని విమర్శించారు. దీనిని ప్రశ్నించిన కిషన్ అనే రిపోర్టర్ ను చిత్తూరు చంపేశారని సంచలన ఆరోపణలు చేశారు.

ఏపీ నుంచి ఎన్నో సంస్థలు జగన్ ప్రభుత్వం దాష్టికం చూసి పారిపోయాయని పవన్ అన్నారు. మోడీ అండగా ఉన్న కూటమిదే ఏపీలో విజయం అని ధర్మం గెలుస్తుందని పవన్ అన్నారు. ఇక కూటమి విజయాన్ని ఏపీలో ఎవరూ అడ్డుకోలేరని అన్నారు.

ఏపీలో జరిగే కురుక్షేత్ర యుద్ధంలో మోడీ పాంచజన్యం పూరిస్తారు అని ఎవరూ ఏపీలో కూటమిని అసలు ఆపలేరని అన్నారు. ఏపీలో అయిదు కోట్ల ప్రజలు మోడీ కోసం ఎదురుచూస్తున్నారని పవన్ అన్నారు. ఏపీలో అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నదే ప్రజల కోరిక అని పవన్ చెప్పారు. ఈ సందర్భంగా ఆవేశంతో ఊగిపోతూ చేసిన ప్రసంగాన్ని మోడీ సైతం ఆసక్తిగా విన్నారు.