Begin typing your search above and press return to search.

తిరుమల వెంకన్న పవర్ ఫుల్ ...తప్పు చేస్తే పుట్టగతులు ఉండవు !

తిరుమల వెంటకేశ్వరస్వామి విషయంలో ఎవరూ తప్పులు చేయరనే అంటారు.

By:  Tupaki Desk   |   20 Sep 2024 5:30 PM GMT
తిరుమల వెంకన్న పవర్ ఫుల్ ...తప్పు చేస్తే పుట్టగతులు ఉండవు  !
X

తిరుమల వెంటకేశ్వరస్వామి విషయంలో ఎవరూ తప్పులు చేయరనే అంటారు. ఒకవేళ పొరపాటున చేసినా దానికి తగిన ప్రాయశ్చిత్తం తీసుకోవాల్సిందే. లేకపోతే ఆ దేవదేవుడు తప్పక శిక్షిస్తాడు అన్నది సగటు జనం నుంచి సంపన్నుల వరకూ ఉంది. వెంకన్న ఆశీస్సులు ఎంత దయగా ఉంటాయో ఆయన ఆగ్రహం అంత కఠినంగా ఉంటుంది అని భక్తులు అంతా నమ్ముతారు.

కలియుగ దైవంగా పూజిస్తారు. ఈ భూమి ఉన్నంతవరకూ ఆయన ఉంటాడని ఆధ్యాత్మిక పరులు పురాణాల నుంచి సేకరించిన విషయాన్ని చెబుతూ ఉంటారు. నిజంగా అదే నిజం కూడా వెంకన్న కరుణ ఎంత చల్లగా ఉంటుందో తెలియచెప్పే పురాణేతిహాసాలు ఉన్నాయి. అలాగే తప్పు కనుక చేశారా అవే కళ్లతో నిప్పులు కురిపించి భస్మీపటలం చేస్తారు అని కూడా పురాణాలలో ఉంది.

అందుకే ఎవరూ కూడా వెంకన్న జోలికి తెలిసి తెలియకా కూడా పోరు. ఎంతో భక్తి ప్రపత్తులతో ఆ స్వామిని కొలుస్తారు. మొక్కులు చెల్లించుకోవడానికి నానా తిప్పలు పడి కూడా కొండలెక్కి వస్తారు. మరి అంతటి మహిమాన్వితుడి పేరు మీద రాజకీయాలు జరుగుతున్నాయి.

ఆ స్వామిని అడ్డం పెట్టుకుని డైలాగ్ వార్ జరుగుతోంది. తప్పు జరిగింది అని ఒక పార్టీ తమ హయాంలో జరగలేదు, జరిగి ఉంటే అది మీ హయాంలోనే అని మరో పార్టీ వాదించుకుంటున్నాయి. నిజంగా తప్పు జరిగిందా లేదా అన్నది ఇపుడు భక్తుల మదిని దొలిచేస్తున్న ప్రశ్న. జరిగితే కనుక ఆ తప్పులు చేసిన వారిని వ్యవస్థలు ఏ విధంగా శిక్షించినా లేకపోయినా వెంకన్న మాత్రం తప్పకుండా శిక్షిస్తారు అని కూడా భక్త జనం నమ్ముతున్నారు.

అంతే కాదు తప్పు జరగకపోయినా జరిగింది అని ప్రచారం చేసి వెంకన్న ప్రతిష్టకు భంగం కలిగించినా ఇబ్బందులు తప్పవని అంటున్నారు. దీని మీద సాధులు ఆధ్యాత్మిక పరులే కాదు రాజకీయ పార్టీల నేతలు ఇదే విధంగా మాట్లాడుతున్నారు. వెంకన్నతో పెట్టుకుంటే ఎవరికైనా అధోగతే అని మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. వెంకన్నతో ఎవరూ సరదాకు అయినా రాజకీయాలు చేయరాదు అని అన్నారు

మరో వైపు టీటీడీ చైర్మన్ గా పనిచేసిన భూమన కరుణాకరరెడ్డి కూడా ఇదే తీరుగా రియాక్ట్ అయ్యారు. శ్రీవారి విషయంలో తప్పు ఎవరు చేసినా నెత్తుకు కక్కుకుని పోతారు అని తీవ్ర వ్యాఖ్యలే చేశారు. పవర్ ఫుల్ గాడ్ అయిన వెంకన్న విషయంలో రాజకీయాలు చేయడం మంచిది కాదని అన్నారు. మనిషి అన్న వారు ఎవరూ వెంకన్న విషయంలో ఇలా మాట్లాడరని అపచారం చేయరని బాబుని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

ఇక వైసీపీకి చెందిన మాజీ మంత్రి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా ఇలాగే మాట్లాడారు, వెంకన్న మీద ఎవరైనా తప్పుడుగా ప్రచారం చేసినా లేక తప్పుడు పని చేసినా ఆ దేవుడు మాత్రం చూస్తూ ఊరుకోరని అన్నారు. ఇది నిజంగా జరిగిందని ఆ సత్యం స్వామి నిరూపించి చూపించారు అని అన్నారు.

ఇక టీడీపీ నేతలు కూడా ఇదే రకంగా మాట్లాడుతున్నారు. వెంకటేశ్వరుని లడ్డూని అపవిత్రం చేయాలని చూసిన వారిని స్వామి క్షమించడు అని అంటున్నారు. ఇక టీటీడీ మాజీ చైర్మన్ అయిన వైవీ సుబ్బారెడ్డి అయితే తప్పు చేస్తే తమ కుటుంబం మొత్తం నాశనం అవుతుందని కానీ తప్పు జరగకపోతే మాత్రం ఆరోపణలు చేసిన వారికి ఇదే రకమైన శిక్ష ఉంటుందని అంటున్నారు.

మొత్తానికి చూస్తే శ్రీవారి తో పెట్టుకుంటూ రాజకీయం చేస్తున్నారు. తప్పు ఒకరు అయినా చేస్తారు. అలాగే నిజం ఒక వైపే ఉంటుంది. మరి తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు అన్న ఆ పవర్ ఫుల్ సెంటిమెంట్ కనుక పనిచేస్తే కనుక ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఏది ఏమైనా వెంకన్న విషయంలో జరుగుతున్న రాజకీయ చర్చ ఒక వైపు అయితే ఆ స్వామి ఆగ్రహానికి తప్పు చేస్తే ఎంతటి వారు అయినా గురి అవుతారు అన్న సెంటిమెంట్ మీద కూడా ఇపుడు చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఇదే ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది.