Begin typing your search above and press return to search.

టార్గెట్ పురందేశ్వరి... వీడియోలు చూపిస్తూ రెచ్చిపోయిన పోసాని!

ఈ నేపథ్యంలో ఆ లోటును భర్తీచేయడానికన్నట్లుగా పోసాని కృష్ణమురళి మైకులముందుకు వచ్చారు.

By:  Tupaki Desk   |   23 Sep 2023 10:31 AM GMT
టార్గెట్  పురందేశ్వరి... వీడియోలు చూపిస్తూ రెచ్చిపోయిన పోసాని!
X

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ ఆయన వెంటనే “ఆయన అరెస్ట్‌ ను బీజేపీ ఖండిస్తుంది” అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఏపీ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందంటూ విమర్శలు చేస్తున్నారు. దీంతో... టీడీపీకి మనోధైర్యం ప్రదర్శించే పనికి పూనుకుంటున్నారనే కామెంట్లు వినిపించాయి.

ఈ సమయంలో వైసీపీ నుంచి పురందేశ్వరికి సరైన సమాధానాలు రావడంలేదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ లోటును భర్తీచేయడానికన్నట్లుగా పోసాని కృష్ణమురళి మైకులముందుకు వచ్చారు. ఇందులో భాగంగా ఏపీ బీజేపీ చీఫ్ ని టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. జగన్ ని విమర్శించే స్థాయిలేదని దుయ్యబట్టారు.

అవును... ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళి తాజాగా మైకుల ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా చంద్రబాబు అవినీతిపరుడనే విషయం పురంధేశ్వరి భర్తతో పాటు ఆమె తండ్రి ఎన్టీఆర్‌, ఆమె పార్టీ ప్రధానమంత్రి మోడీ చెప్పారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ముగ్గురూ మాట్లాడిన వీడియోలు ప్రదర్శించారు. పురందేశ్వరికి "ఏపీ సీఐడీ మీద అనుమానం ఉంది తప్ప... కేడీ మీద మాత్రం డౌంట్ ఉండదు" అంటూ ఎద్దేవా చేశారు!

ఇదే సందర్భంగా "ఎప్పుడూ అవినీతి పరులనే ఎందుకు సపోర్ట్ చేస్తారు పురందేశ్వరి గారూ అంటూ ప్రశ్నించిన పోసాని... క్రైం చేసేవారిని సపోర్ట్ చేస్తారు" అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెబుతాన్నని మొదలుపెట్టిన ఆయన... "అసెంబ్లీలో మీసాలు తీపూతు, తొడగొట్టిన బాలకృష్ణ.. గతంలో తన రివాల్వర్ తీసుకుని ఇద్దరిని పిట్టలను కాల్చేసినట్లు కాల్చేశాడు" అని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

"బాలకృష్ణ క్రైం చేశాడు, అటెంప్ట్ టు మర్డర్ చేశాడు, వాళ్లను హాస్పటల్ లో జాయిన్ చేశారు.. వారిలో ఒకతని పేరు సత్యనారాయణ, ఇంకొకతని పేరు సురేష్. ఆ సమయంలో వారిద్దరూ చావుబ్రతుకుల్లో ఉన్నారని తెలిసి, బాలకృష్ణ బయపడి పరుగెత్తుకుంటూ ఈమె దగ్గరకు వచ్చాడు" అని తెలిపారు పోసాని.

ఆ సమయంలో బాలయ్యకు ధైర్యం చెప్పిన పురందేశ్వరి... తన భర్తను తీసుకుని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇంటికి వచ్చిందని పోసాని చెప్పారు. అనంతరం కన్నీళ్లు పెట్టుకుంటూ జరిగిన విషయాన్ని వైఎస్సార్ కి చెప్పుకుందని అన్నారు. తమ్ముడు తప్పు చేసిన మాట వాస్తవమే అయినా కుటుంబం పరువు దృష్ట్యా తమ్ముడు బాలయ్యను కాపాడంటూ కాళ్ల మీద పడిందని పోసాని తెలిపారు.

ఆ సమయంలో కరిగిపోయిన వైఎస్సార్... బాలకృష్ణ పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా, జైలుకి వెళ్లకుండా, కోర్టుకు వెళ్లకుండా ఇంటికి పంపించేశారని అన్నారు. అనంతరం... అవినీతిపరుడైన చంద్రబాబుని, తుపాకితో కాల్చిన బాలకృష్ణను ఎందుకు సపోర్ట్ చేశావు అని పురందేశ్వరిని ప్రశ్నించారు పోసాని. ఈ సందర్భంగా "ఎన్ని సార్లు పార్టీలు మారతారు" అన్ని సూటిగా ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యపాన నిషేధం విదిస్తే... అనంతరం ఆయనను చంపేసి, బాబు అధికారంలోకి వచ్చి మద్యాన్ని ఏరులై పారించారని అన్నారు. ఆ సమయంలో మీరు ఎక్కడికి వెళ్లారు అని పురందేశ్వరిని ప్రశ్నించారు పోసాని. అసలు ఎన్టీఆర్ వ్యతిరేకించిన కాంగ్రెస్ మీరు ఎలా చేరారు అని ప్రశ్నించిన పోసాని.. పదవి కోసం అని సమాధానం చెప్పారు.

నాడు ఎన్టీఆర్ కూతురి కోటాలో మంత్రిపదవి పొంది, సోనియా గాంధీని తెగ పొగిడిన పురందేశ్వరి... అనంతరం బీజేపీలో చేరారని, ఇప్పుడు మోడీని పొగుడుతున్నారని అన్నారు. ఫలితంగా ఏపీ చీఫ్ పదవి పొందారని అన్నారు. పొరపాటున రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే... వెంటనే సోనియా జిందాబాద్ అంటారని ఎద్దేవా చేశారు.

అసలు రెండు దిక్కులుగా, రైలు పట్టాలుగా ఎప్పటికీ కలవని రెండు విరుద్ధ భావాలు కలిగిన అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ... రెండింటిలోనూ తమరు ఇమడగలరని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి క్యారెక్టర్ ఉన్న మీరు వైఎస్సార్ గురించి మాట్లాడతారా అని పోసాని ప్రశ్నించారు.

ఇదే సమయంలో... జగన్ మోహన్ రెడ్డికి - పురందేశ్వరి కి క్యారెక్టర్ లో, సిన్సియార్టీలో, మానవత్వంలో 100 కిలో మీటర్ల దూరం ఉందని పోసాని వివరించారు.