Begin typing your search above and press return to search.

ప్రకాశ్ రాజ్ వన్స్ ఎగైన్... పవన్ వి మూర్ఖత్వ రాజకీయాలు!

అక్కడ నుంచి మొదలు.. “పవన్ కల్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్” అనే వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

By:  Tupaki Desk   |   27 Oct 2024 5:41 AM GMT
ప్రకాశ్ రాజ్ వన్స్ ఎగైన్... పవన్ వి మూర్ఖత్వ రాజకీయాలు!
X

ప్రధానంగా తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారంటు ఒక ప్రచారం మొదలవ్వడం, ఈ విషయంపై పవన్ కల్యాణ్ దీక్షలు చేయడం, అయోధ్యకు కూడా కల్తీ లడ్డూలు పంపారంటూ వ్యాఖ్యానించడం వంటి విషయాలు జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

అంతకముందు ఈ విషయంపై స్పందించిన పవన్ కల్యాణ్... “ప్రధానంగా తిరుపతి బాలాజీ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపినట్లు గుర్తించినందుకు మనందరం తీవ్రంగా కలత చెందము.. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.. సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకొవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది” అన్నారు.

దీంతో.. ఈ పోస్ట్ పై స్పందించిన ప్రకాశ్ రాజ్.. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే ఇది జరిగింది.. దయచేసి దర్యాప్తు చేయండి.. దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోండి.. మీరు ఆందోళనలను ఎందుకు వ్యాపింపజేస్తున్నారు.. సమస్యను జాతీయంగా ఊదరగొడుతున్నారు.. దేశంలో తగినంత మత పరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి” అంటూ పవన్ కు రిప్లై ఇచ్చారు.

అక్కడ నుంచి మొదలు.. “పవన్ కల్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్” అనే వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అప్పటి నుంచి సందర్భం / అవకాశం వచ్చిన ప్రతీసారి పవన్ పై ప్రకాశ్ రాజ్ స్పందిస్తూనే ఉన్నారు.. సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఈ సమయంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై ప్రకాశ్ రాజ్ మరోసారి స్పందించారు. "పవన్ అంటే మీకు ఎందుకు అంత కోపం" అంటూ ఎదురైన ప్రశ్నకు స్పందించిన ప్రకాశ్ రాజ్... "ఆయన కొంచెం మూర్ఖత్వంగా రాజకీయాలు చేస్తున్నాడు.. విధ్వంస రాజకీయం చేస్తున్నాడు.. అది నాకు నచ్చడం లేదు.. అదే చెప్తున్నాను" అని అన్నారు.

అయితే.. "మరి పవన్ ను ఎన్నుకున్న ప్రజల సంగతి?" అంటూ తదనుగుణంగా ఎదురైన మరో ప్రశ్నకు స్పందించిన ప్రకాశ్ రాజ్... "వాళ్లు ఎన్నుకున్నది దీని కోసం కాదుగా.. ఆయన గేరు ఇప్పుడు మారిస్తే అడిగేవాడు ఉండాలికదా?" అని ప్రశ్నిస్తూ సమాధానం చెప్పారు. "సింపుల్ అండీ అక్కడ ఆయోధ్యలో ఓడిపోయారు.. ఇప్పుడు మన ఊరు కొండెక్కడానికి వచ్చారు అంతే..!" అని స్పందించారు!