Begin typing your search above and press return to search.

పవన్ పై ప్రకాశ్ రాజ్ ఫైర్... కామెంట్స్ సెక్షన్ లో వార్

ప్రకాశ్ రాజ్... తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన ఓ ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు.

By:  Tupaki Desk   |   21 Sep 2024 6:10 AM GMT
పవన్  పై ప్రకాశ్  రాజ్  ఫైర్...  కామెంట్స్  సెక్షన్  లో వార్
X

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిన అంశం తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందనే విషయం! తిరుమల లడ్డూ తయారీకోసం వాడే నెయ్యి కల్తీదని.. అందులో జంతువుల కొవ్వుతో చేసిన నూనె వాడారని రకరకాలా ఆరోపణలు తెరపైకి వచ్చాయి. దీంతో... ఈ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

అయితే... అత్యంత సున్నితమైన ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. అధికార ప్రతిపక్ష నేతలు ఈ వ్యవహారంపై ఒకరిపై ఒకరు చేసుకుంటున్న రాజకీయ విమర్శల నడుమ భక్తులు నలిగిపోతున్నారు. అసలు ఏమి జరిగింది.. ఏమి జరుగుతుందనే విషయంపై క్లారిటీ లేక వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు.

అవును... దేశంలో జరిగే సమకాలిన రాజకీయ, సామాజిక, సినీ, క్రీడా రంగ అంశాలపై తనదైన శైలిలో స్పందించే ప్రకాశ్ రాజ్... తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన ఓ ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... ప్రియమైన పవన్ కల్యాణ్ అని మొదలుపెట్టిన ప్రకాశ్ రాజ్... మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే ఈ సంఘటన జరిగింది.. ఇలాంటి ఘటనపై దయచేసి విచారణ జరిపించండి.. దీనికి బాధ్యులైన వారిని కనిపెట్టి, వారిపై కఠిన చర్యలు తీసుకోండి అని అన్నారు. తన రియాక్షన్ ని అక్కడితో ఆపని ప్రకాశ్ రాజ్ అనంతరం పవన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... ఈ ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొనే విషయం పక్కనపెట్టి.. ఎందుకు దేశంలో ఆందోళనలు వ్యాపించేలా చేస్తున్నారు.. ఈ సమస్యను దేశవ్యాప్తంగా ఎందుకు హైలెట్ చేస్తున్నారు.. ఇప్పటికే మన దేశంలో కావాల్సినన్ని మతపరమైన ఘర్షణలు ఉన్నాయి అని అంటూ... "కేంద్రంలో ఉన్న మీ మిత్రులకు ధన్యవాదాలు" అని కొసమెరుపు తగిలించారు.

దీంతో... ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పవిత్రమైన తిరుమల క్షేత్రంలోని ప్రసాదంలో కల్తీ జరిగిందని.. పైగా, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు తిరుమల లడ్డూలో కలిపారనే ఆరోపణలు వినిపిస్తున్న వేళ స్పందించడం మతపరమైన ఘర్షణలు వ్యాప్తి చేయడం కాదంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

దీనిపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని పవన్ చెప్పిన విషయాన్ని మరిచిపోతే ఎలా అని ప్రశ్నిస్తునారు.

కాగా... పవిత్రమైన తిరుమల లడ్డూ తయారీలో నాణ్యమైన నెయ్యి వాడలేదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఇటీవల పవన్ స్పందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తిరుమల బాలాజీ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపినట్లు బయటపడిందని.. ఈ విషయంలో అందరం తీవ్రంగా కలత చెందామని.. దీనిపై వైసీపీ ప్రభుత్వ ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు.

ఇదే సమయంలో.. దేశంలోని అన్ని ఆలయాలకు సంబంధించిన సమస్యలను పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పవన్ స్పందించారు. ఈ ట్వీట్ పై రియాక్ట్ అయిన ప్రకాశ్ రాజ్... పై కామెంట్లు చేశారు!