Begin typing your search above and press return to search.

పాదనమస్కారం ఎఫెక్ట్.. నితీష్ ని తగులుకున్న పీకే!

గతంలో ఎవరెవరి వద్ద పని చేశారో.. తిరిగి వారినే గట్టిగా తగులుకుంటుంటారు ప్రశాంత్ కిశోర్ అనే వ్యాఖ్యానం రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంటుంది.

By:  Tupaki Desk   |   15 Jun 2024 12:30 PM GMT
పాదనమస్కారం ఎఫెక్ట్.. నితీష్  ని తగులుకున్న పీకే!
X

గతంలో ఎవరెవరి వద్ద పని చేశారో.. తిరిగి వారినే గట్టిగా తగులుకుంటుంటారు ప్రశాంత్ కిశోర్ అనే వ్యాఖ్యానం రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంటుంది. ఇందులో భాగంగానే గతంలో జగన్ వద్ద పనిచేసి తర్వాత చేసిన వ్యాఖ్యలు ఇటీవల చూసినవే! ఇదే క్రమంలో గతంలో నితీష్ కుమార్ తో కలిసి పనిచేసిన నేపథ్యంలో తాజాగా ఆయననూ గట్టిగా తగులుకున్నారు పీకే!

అవును... ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంలో ఏపీలో టీడీపీతో పాటు బీహార్ నుంచి జేడీయూ కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... బీహార్ ప్రజల ప్రయోజనాల కోసం పని చేయకుండా.. నితీష్ కుమార్ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం పనిచేస్తున్నారంటూ ప్రశాంత్ కిశోర్ ఫైర్ అయ్యారు.

తాజాగా జన సురాజ్ ప్రచారంలో భాగంగా జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రశాంత్ కిశోర్... ప్రధాని మోడీ తిరిగి అధికారంలోకి రావడంలో నితిష్ కీలక పాత్ర పోషించారు కానీ.. ఆ పాత్రను బీహార్ రాష్ట్ర ప్రయోజనలా కోసం తన పలుకుబడిన వాడకుండా మోడీ కాళ్లు మొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. ఇదంతా 2025 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా బీహార్ సీఎంగా కొనసాగాలనే ప్రయత్నంలో భాగమని అన్నారు.

ఈ క్రమంలో... గతంలో ఆయనతో కలిసి పనిచేసిన తాను ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నానై పలువురు ప్రశ్నిస్తున్నారని చెప్పిన పీకే.. అప్పుడు నితీష్ వేరే వ్యక్తి అని.. ఇప్పుడు మాత్రం తన మనస్సాక్షిని బీజేపీకి అమ్మకానికి పెట్టారని అన్నారు. ఒక రాష్ట్రానికి నాయకుడిగా ఉండేవ్యక్తి ఆ రాష్ట్ర ప్రజలు గర్వపడేలా నడుచుకోవాలి కానీ... నితీష్ మాత్రం బీహార్ కు అవమానాన్ని మిగిల్చారని ఆరోపించారు.

కాగా... గతంలో నితీష్ తో కలిసి పనిచేసిన పీకే 2015లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రెండేళ్ల తర్వాత అధికారికంగా ఆ పార్టీలో చేరారు. అనంతరం నితీష్ తో విభేదించి జేడీయూ నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే మోడీతో పాటు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, వైఎస్ జగన్ తో సహా పలువురు నాయకుల కోసం పనిచేశారు!