Begin typing your search above and press return to search.

ప్రీతి జింటాకు రూ.18 కోట్ల రుణమాఫీ.. కాంగ్రెస్ పై ఫైర్ అయిన నటి

బాలీవుడ్ నటి, ఐపీఎల్‌లో పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింటా తాజాగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   25 Feb 2025 10:51 AM GMT
ప్రీతి జింటాకు రూ.18 కోట్ల రుణమాఫీ.. కాంగ్రెస్ పై ఫైర్ అయిన నటి
X

బాలీవుడ్ నటి, ఐపీఎల్‌లో పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింటా తాజాగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ నుండి తీసుకున్న రూ.18 కోట్ల రుణం ఆమెకు మాఫీ చేయబడిందని కేరళ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఆరోపణలు చేస్తూ పోస్ట్ పెట్టింది. ఈ ఆరోపణలు చూసి ప్రీతి జింటా స్పందిస్తూ, తనపై తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని, తాను తన సామాజిక మాధ్యమ ఖాతాలను ఎవరికీ అప్పగించలేదని స్పష్టం చేశారు.

- కాంగ్రెస్ ఆరోపణలు ఏమిటి?

గత వారం న్యూఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ మూసేయబడిన నేపథ్యంలో డిపాజిటర్లు తీవ్రంగా నష్టపోయారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ లో ‘ప్రీతి జింటా భాజపాకు తన సామాజిక మాధ్యమ ఖాతాలను అప్పగించినందుకు ఆమె రుణాన్ని మాఫీ చేశారని ఆరోపించింది. బ్యాంకు మూసివేతతో చాలా మంది డిపాజిటర్లు రోడ్డునపడ్డారని కాంగ్రెస్ ఆరోపించింది.

- ప్రీతి జింటా స్పందన

ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన ప్రీతి జింటా, తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించారు. "కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ఆరోపణలు చూసి నేను ఆశ్చర్యపోయాను. నా కోసం ఎవరు రుణం మాఫీ చేయలేదు. పదేళ్ల క్రితం ఓ బ్యాంకు నుంచి రుణం తీసుకొని దాన్ని పూర్తిగా చెల్లించాను. తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటు" అని ఆమె తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి అపార్థాలు రాకుండా ఉండేందుకు ఈ ఆరోపణలపై స్పష్టమైన వివరణ ఇస్తున్నానని ఆమె పేర్కొన్నారు.

- న్యూఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ కుంభకోణం

ముంబయిలోని న్యూఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ జనరల్ మేనేజర్, అకౌంట్స్ హెడ్ హితేష్ మెహతా, బ్యాంకు నుండి రూ.122 కోట్లను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతానికి ఈ కేసులో ఆయన ముంబయి పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ, బాలీవుడ్ నటి ప్రీతి జింటాపై రుణమాఫీ ఆరోపణలు చేయడం గమనార్హం.

ప్రస్తుతం ప్రీతి జింటా తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ స్పష్టమైన వివరణ ఇచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత వ్యక్తిత్వాన్ని దూషించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. రుణాన్ని పూర్తి చేశానని, తనపై అనవసరమైన ఆరోపణలు చేయడం తప్పుడు ప్రచారానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. ఈ వివాదం ఇంకా ఎలా మలుపుతిప్పుకుంటుందో వేచి చూడాల్సిందే.