శరీరం చుట్టూ క్రేప్ బ్యాండేజీలు...కోర్టులో జడ్జి ముందు ఏడ్చేసిన రన్యా రావు!
కన్నడ నటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయి విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 March 2025 9:31 AM ISTకన్నడ నటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయి విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) బంగారం స్మగ్లింగ్ దర్యాప్తులో వడివడిగా అడుగులు వేస్తోంది. విమానాశ్రయంలో వీఐపీ లకు సాధారణంగా వర్తించే ప్రోటోకాల్లను దుర్వినియోగం చేయడం ద్వారా బంగారాన్ని అక్రమంగా రవాణా చేసే ఒక సిండికేట్ను ఏజెన్సీ దర్యాప్తులో బయటపెట్టింది. రన్యా రావు ఈ సిండికేట్లో అంతర్భాగమని డిఆర్ఐ అధికారులు కోర్టుకు విన్నవించారు.
అయితే రన్యారావు శరీరం, ముఖంపైనా, కళ్ల కింద దెబ్బలు కనిపిస్తున్నాయి. దీనిని బట్టి రన్యారావు వేధింపులకు గురైందని ఏజెన్సీ గుర్తించింది. దుబాయ్కు వెళ్లడానికి చాలా కాలం ముందు ఈ గాయాలు అయ్యాయని నటి రన్యారావు ఏజెన్సీకి తెలియజేసింది. అవసరమైన వైద్య సహాయం అందించాలని కోర్టు కూడా జైలు అధికారులను ఆదేశించింది. రన్యా రావు న్యాయవాది శారీరక వేధింపులను హైలైట్ చేసి, కస్టడీ సమయంలో ఆమె న్యాయవాది సమక్షంలో కేవలం వినికిడి దూరంలోనే కాకుండా కనిపించేంత దూరంలో మరింత దర్యాప్తుకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. అయితే కోర్టు ఈ అభ్యర్థనను అంగీకరించలేదు.
ఇక విచారణ సమయంలో నిందితురాలు దర్యాప్తుదారులకు పూర్తిగా సహకరించడం లేదని, అనుక్షణం మానసికంగా ఆవేదన చెందుతోందని డిఆర్ఐ కోర్టుకు తెలియజేసింది. శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు రన్యారావు న్యాయమూర్తి ముందు ఏడ్చింది. కస్టడీ సమయంలో నిందితురాలి నుంచి సమాధానాలు అడగడానికి ఫోరెన్సిక్ విశ్లేషణ నుండి ఆధారాలను ఉపయోగిస్తామని డిఆర్ఐ పేర్కొంది. భారతదేశంలోకి బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి నిందితురాలి శరీరం చుట్టూ క్రేప్ బ్యాండేజీలు, టిష్యూలను ఉపయోగించి బంగారు కడ్డీలను శరీరానికి చుట్టారని అధికారులు వివరించారు. దర్యాప్తు అధికారులు ఇప్పుడు మొత్తం సిండికేట్ గుట్టును వెలికితీయడంపై దృష్టి సారించడంతో కోర్టు రన్యా రావును మూడు రోజుల పాటు డిఆర్ఐ కస్టడీకి పంపింది. అలాగే కొన్ని షరతులను కూడా కోర్టు విధించింది. కస్టడీ సమయంలో సాయంత్రం 6 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల మధ్య, ఏజెన్సీ అధికారుల సమక్షంలో నిందితురాలి న్యాయవాది ఆమెను సందర్శించడానికి అనుమతి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కుటుంబ సభ్యులను లేదా ఇతర వ్యక్తులను కలవడానికి అనుమతి లేదు.
కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 03.03.2025/04.03.2025 తేదీన నా వద్ద నుండి 17 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారని రన్యారావు తన వాంగ్లూలంలో వెల్లడించారు. యూరప్, అమెరికా, మధ్యప్రాచ్యానికి, ముఖ్యంగా దుబాయ్, సౌదీ అరేబియాకు ప్రయాణించానని రన్యా తెలిపారు. నాకు తగినంత విశ్రాంతి లభించనందున ప్రస్తుతం అలసిపోయాను అని కూడా వెల్లడించారు. దర్యాప్తునకు తనవంతు పూర్తి సహకారం అందిస్తానని రన్యారావు అంగీకరించారు.