Begin typing your search above and press return to search.

ఏపీకి మంచి రోజులు వ‌చ్చాయి: రేణుకా చౌద‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అయితే.. ఎగ్జిట్ పోల్స్‌ను కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ తోసిపుచ్చార‌ని చెప్ప‌గా.. ఆమె ఆ విష‌యాన్ని కూడా.. తోసిపుచ్చారు

By:  Tupaki Desk   |   3 Jun 2024 1:46 PM GMT
ఏపీకి మంచి రోజులు వ‌చ్చాయి:  రేణుకా చౌద‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు... తెలంగాణ‌కు చెందిన కాంగ్రెస్ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యురాలు.. రేణుకా చౌద‌రి ఏపీ ఎన్నిక‌ల‌కు సంబంధించి.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీకి మంచి రోజులు వ‌చ్చాయ‌ని తెలిపారు. సోమ‌వారం ఆమె.. తిరుమ‌ల‌శ్రీవారిని కుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్నారు. అనంత‌రం.. మీడియాతో మాట్లాడుతూ... ఏపీ ప్ర‌జ‌లు మంచి నిర్ణ‌యం తీసుకున్నార‌ని తాను భావిస్తున్న ట్టు చెప్పారు. ఎగ్జిట్ పోల్స్‌లో బ‌ల‌మైన సంకేతాలు వ‌చ్చాయ‌ని తెలిపారు.

అయితే.. ఎగ్జిట్ పోల్స్‌ను కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ తోసిపుచ్చార‌ని చెప్ప‌గా.. ఆమె ఆ విష‌యాన్ని కూడా.. తోసిపుచ్చారు. జాతీయ‌స్థాయిలో రాహుల్ గాందీ చెప్పింది నిజ‌మేన‌ని అన్నారు. కానీ, ప్రాంతీయ పార్టీల విష‌యంలో ఎగ్జిట్ పోల్స్ న‌మ్మ‌ద‌గిన‌విగానే ఉన్నాయ‌ని అన్నారు. ముఖ్యంగా ఏపీలో ప్ర‌జ‌ల న‌రకం చూసిన త‌ర్వాత‌.. ఎవ‌రైనా.. ఇక్క‌డ మ‌ళ్లీ వైసీపీ వ‌స్తుందని అనుకుంటారా? అని ఎదురు ప్ర‌శ్నించారు. ఏపీ ప్ర‌జ‌ల‌కు ఇప్పుడు రాజ‌ధాని కూడా లేద‌ని చెప్పారు.

ఉన్న ఉమ్మ‌డి హైద‌రాబాద్ కూడా పోయింద‌ని.. ఇప్పుడు రాజ‌ధాని నిర్మాణం చేప‌ట్టే దూర‌దృష్టి ఉన్న నాయ‌కుడు రాష్ట్రానికి అవ‌స‌ర‌మ‌ని.. అందుకే..తాను ఏపీకి మంచి రోజులు వ‌స్తున్నాయ‌ని భావిస్తున్నాన‌ని చెప్పారు. ఏపీలో జ‌రిగిన పోలింగ్ స‌ర‌ళిపై మాట్లాడుతూ.. ఒక మార్పును కోరుకుంటున్న స‌మ‌యంలోనే ఇలాంటి పోలింగ్ జ‌రుగుతుంద‌న్నారు. ఇంత భారీ పోలింగ్ వెనుక అధికార మార్పు రీజ‌న్ ఎందుకు ఉండ‌కూడ‌ద‌ని ప్ర‌శ్నించారు. మంగ‌ళ‌వారం వ‌చ్చే ఫ‌లితాలు.. ఎగ్జిట్ పోల్స్‌ను నిజం చేస్తాయ‌ని రేణుకా చౌద‌రి వ్యాఖ్యానించారు.

తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు కూడా.. మంచి సీట్లు వ‌స్తాయ‌న్నారు. త‌న అంచ‌నా ప్ర‌కారం.. 10 నుంచి 12 స్థానాల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధిస్తుంద‌ని తెలిపారు. అయితే.. ఏమైనా జర‌గొచ్చ‌ని.. మొత్తం 17 స్థానాల్లోనూ గెలిచినా ఆశ్చ‌ర్యం లేద‌న్నారు. దేశం మొత్తంకాంగ్రెస్ వైపు చూస్తోంద‌ని.. ఒక నిరంకుశ పాల‌న‌ను ఎన్నాళ్లు భ‌రిస్తార‌ని ఆమె ప్ర‌శ్నించారు. ఈ మార్పు ఖాయ‌మ‌ని.. ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలుజాతీయ‌స్థాయిలో త‌ప్పుతాయ‌ని రేణుకా చౌద‌రి వ్యాఖ్యానించారు.