Begin typing your search above and press return to search.

రేణుకా స్వామి హత్య కేసులో 5 అప్డేట్స్

యావత్ కర్ణాటకను మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా అందరి చూపు బెంగళూరు మీద పడేలా చేసిన షాకింగ్ క్రైం సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   16 Jun 2024 8:53 AM GMT
రేణుకా స్వామి హత్య కేసులో 5 అప్డేట్స్
X

యావత్ కర్ణాటకను మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా అందరి చూపు బెంగళూరు మీద పడేలా చేసిన షాకింగ్ క్రైం సంగతి తెలిసిందే. తన వీరాభిమాని రేణుకా స్వామిని దారుణంగా హత్య చేసిన కన్నడ స్టార్ హీరో దర్శన్ ఉదంతంలో మరో ఫేమస్ హీరోయిన్ పవిత్రా గౌడ్ కూడా నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న ఈ కేసుకు సంబంధించిన ఐదు ఆసక్తికర అప్డేట్స్ ఉన్నాయి. అవేమంటే..

1. పోలీసు కస్టడీ పొడగింపు

ఈ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ పవిత్రా గౌడ్ తో పాటు.. రేణుకా స్వామి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో తొమ్మిది మందికి పోలీస్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్.. నటి పవిత్రా గౌడ్ లు సహజీవనం చేస్తున్నట్లుగా వార్తలు రావటం తెలిసిందే. పవిత్రా అశ్లీల ఫోటోల్ని దర్శన్ అభిమాని రేణుకా స్వామి సదరు నటి వాట్సాప్ కు పంపటం.. ఈ విషయాన్ని పవిత్రా స్టార్ హీరో దర్శన్ కు చెప్పటంతో తీవ్ర ఆగ్రహానికి గురై చంపేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

సోమవారం బక్రీదు.. మంగళవారం తొలి ఏకాదశి తో కోర్టుకు సెలువులు ఉనన నేపత్యంలో పోలీసు కస్టడీ నుంచి ముందుగా న్యాయస్థానానికి తరలించారు. పోలీసు కస్టడీలో ఎలాంటి ఇబ్బందుల్ని అయినా ఎదుర్కొన్నారా? అంటే లేదన్న వారి మాటలకు ఈ నెల 20 వరకు కస్టడీని పొడిగిస్తూ కోర్డు ఆదేశాల్ని జారీ చేసింది.

2. పవిత్రా గౌడ్ ఇప్పుడెక్కడ?

స్టార్ హీరో దర్శన్ అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పవిత్రా గౌడ్ పోలీసుల కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా కోర్టు ఆమె కస్టడీని పొడిగించిన నేపథ్యంలో విచారణ అనంతరం ఆమెను ఎక్కడకు తీసుకెళుతున్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై పోలీసులు వివరణ ఇస్తూ..కోర్టు నుంచి ఆమెను అన్నపూర్ణేశ్వరినగర పోలీసు స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ కు తరలించారు. కస్టడీ ముగిసే వరకు అక్కడే ఉంటారు.

మరోవైపు ఈ కేసులో కీలక నిందితుడిగా పేరున్న నటుడు దర్శన్ ను కూడా పోలీసులు జైలుకు పంపేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు తగినట్లే పరప్పన అగ్రహాన జైలును ముందస్తుగా సిద్ధం చేస్తున్నారు.

3. హత్యకు ముందు దారుణ హింస

రేణుకా స్వామి హత్యకు ముందు దారుణంగా హింసకు గురి చేసినట్లుగా చెబుతున్నారు. అతడ్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన స్టార్ హీరో దర్శన్ వర్గీయులు.. అతడ్ని తీవ్రంగా హింసించారు. దర్శన్ సైతం అతడ్ని తీవ్రంగా కొట్టారు. తాను శాఖాహారినని చెప్పినప్పటికీ వినకుండా బలవంతంగా నాన్ వెజ్ ఫుడ్ పెట్టారని వెల్లడైంది. బిర్యానీ.. ఎముకలను నోట్లు పెట్టి హింసకు గురి చేశారు.

అయితే.. అతడి నోటికి నాన్ వెజ్ ఫుడ్ పెడితే ఊసేయటంతో.. మళ్లీ కొట్టారని తేలింది. మాంసం తింటే శక్తి వస్తుందని.. బాస్ కొడితే తట్టుకోవచ్చంటూ గేలి చేసినట్లుగా నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. కిడ్నాప్ చేసినప్పటి నుంచి షెడ్ లో దాచి ఉన్నంతవరకు ఆయా ప్రాంతాల సాసీ కెమేరాల ఫుటేజ్ ను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు.

4. నటి పవిత్రా గౌడ్ కు అశ్లీల చిత్రాలు పంపటంతో తాను కోపంతో రేణుకా స్వామిపై చేయి చేసుకున్నట్లుగా స్టార్ హీరో దర్శన్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. తాను రెండు దెబ్బలు కొట్టి.. షెడ్ నుంచి బయటకు వచ్చేసినట్లుగా పేర్కొన్నారు. మిగిలిన వారు అతడ్ని చంపేసి ఆ నేరాన్ని తన తలకు చుడుతున్నట్లుగా పేర్కొన్నారు.

రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి తీసుకువస్తున్న విషయమే తెలీదని.. అతన్ని బెంగళూరుకు తెచ్చిన తర్వాత పవిత్రాకు తాను సారీ చెప్పించాలని మాత్రమే అనుకున్నట్లుగా దర్శన్ చెబుతున్నారు. తనను.. పవిత్రను చూసినంతనే తప్పు అయ్యిందని చేతులు జోడించాడని.. తాను రెండు దెబ్బలు వేసి.. జేబులో నుంచి డబ్బులు తీసిచ్చి.. భోజనం చేసి ఊరికి వెళ్లాలని చెప్పినట్లుగా పోలీసులకు చెప్పారు. ఆ తర్వాత ఇంటికి వచ్చేశానని.. కానీ తాను హత్య చేయలేదని పేర్కొనటం గమనార్హం.

5. దర్శన్ - పవిత్రాల మధ్య ఇదే రిలేషన్

స్టార్ హీరో దర్శన్.. పవిత్రాల మధ్య రిలేషన్ మీద మీడియాలో బోలెడన్ని వార్తలు రావటం తెలిసిందే. వారిద్దరూ సహజీవనం చేస్తున్నారని ఒకరు.. కాదు వారిద్దరూ భార్యభర్తలుగా మరికొందరు పేర్కొనటం తెలిసిందే. అయితే.. వీరిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందన్న విషయంపై తాజాగా దర్శన్ న్యాయవాది స్పందించారు. దర్శన్ - పవిత్రాలు సహ నటులే తప్పించి వారిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్పటం గమనార్హం.

వారిద్దరి పెళ్లి జరిగిందని తప్పుడు రాతలు రాస్తున్నట్లుగా దర్శన్ తరఫు న్యాయవాది అనిల్ బాబు వివరణ ఇచ్చారు. అరెస్టు తర్వాత దర్శన్ ను తాను రెండుసార్లు కలిశానని.. ఆయన భార్య విజయలక్ష్మి.. ఇతర కుటుంబ సభ్యుల తరఫున తాను కేసు వాదిస్తున్నట్లుగా పేర్కొన్నారు. దర్శన్ కు భార్య విజయలక్ష్మినేనని.. వారికి ఒక కుమారుడు ఉన్నాడని.. పవిత్రా గౌడ్ ఒక స్నేహితురాలు మాత్రమేనని.. వారి మధ్య ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.