Begin typing your search above and press return to search.

సీఎం రేవంత్ మీద నుంచి కొండంత భారం తగ్గటం పక్కానట

ఉదయం ఏడున్నర గంటలకు పోస్టల్ ఓట్ల లెక్కింపు.. 8గంటలకు ఓట్ల లెక్కింపు మొదలు కానుంది.

By:  Tupaki Desk   |   8 Oct 2024 8:30 AM GMT
సీఎం రేవంత్ మీద నుంచి కొండంత భారం తగ్గటం పక్కానట
X

అవును.. మరికాసేపట్లో రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇటీవల ముగిసిన రెండు రాష్ట్రాల (జమ్ముకశ్మీర్, హర్యానా) అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు (మంగళవారం, అక్టోబరు8)న షురూ కానుంది. ఉదయం ఏడున్నర గంటలకు పోస్టల్ ఓట్ల లెక్కింపు.. 8గంటలకు ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. ఇప్పటివరకు వెలువడుతున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం.. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి అనుకూలంగా పలితాలు వచ్చే వీల్లేదు. ఒకవేళ వస్తే మాత్రం అద్భుతంగానే చెప్పాలి.

జమ్ముకశ్మీర్ లో అయితే కాంగ్రెస్ కూటమి లేదంటే హంగ్ ఏర్పడే పరిస్థితి. హర్యానా విషయానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గడిచిన రెండు దఫాలుగా హర్యానాలో బీజేపీ ప్రభుత్వమే కొలువు తీరింది. తాజా ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ చేతికి పగ్గాలు రావటం ఖాయమంటున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు కొత్త శక్తిని సొంతం చేసుకోవటంతో పాటు తెలంగాణకు కొంత భారం తీరేలా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇప్పటివరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్థికంగా బలమైన రాష్ట్రాలుగా కర్ణాటక.. తెలంగాణలు మాత్రమే ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలే.. కాంగ్రెస్ కు అన్ని విధాలుగా అండగా ఉన్నాయి. దీంతో.. పార్టీకి అవసరమైన అన్ని సర్దుబాట్లు ఈ రెండు రాష్ట్రాల నుంచే జరగాల్సి ఉంది. ఇలాంటి వేళ.. మరో ధనిక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న కాంగ్రెస్ కు.. తమను అన్ని విధాలుగా ఆదుకునే మూడో రాష్ట్రంగా హర్యానా మారుతుందన్న మాట వినిపిస్తోంది.

అదే జరిగితే.. ఇప్పటివరకు తెలంగాణ మీద ఉన్న భారం కొంత మేర తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే జరిగితే.. సీఎం రేవంత్ కు కొండంత రిలీఫ్ గా చెప్పక తప్పదు. 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. గడిచిన రెండు దఫాలుగా ఎన్నికైన బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు అనుకూలంగా ఫలితాలు రావటంఖాయమన్న విషయాన్ని అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి.