Begin typing your search above and press return to search.

ప్రియమైన మోడీ అంటూనే అంకెలతో ఉతికేసిన రేవంత్

అంతేకాదు.. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు త్వరలోనే రుణమాఫీని అమలు చేయనున్నట్లుగా పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   7 Oct 2024 6:39 AM GMT
ప్రియమైన మోడీ అంటూనే అంకెలతో ఉతికేసిన రేవంత్
X

తెలంగాణ రాష్ట్రంలో తాము అమలు చేస్తున్న రైతురుణ మాఫీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ స్పందించారు. డియర్ మోడీ అంటూనే.. రైతుల రుణమాఫీపై తమ ప్రభుత్వ కమిట్ మెంట్ ను.. గణాంకాల్ని ప్రస్తావించిన ఆయన.. పనిలో పనిగా రుణమాఫీపై తెలంగాణ విపక్షాలు విరుచుకుపడుతున్న వేళ.. వారి ప్రచారంలోని అంశాల్ని పేర్కొంటూ.. అవన్నీ ఎంత అబద్ధాల్లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇందుకోసం అధికారిక గణాంకాల్ని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. తాము అధికార పగ్గాలు చేపట్టిన మొదటి ఏడాదిలోనే రూ.2 లక్షల వరకు పంట రుణాన్ని మాఫీను విజయవంతంగా అమలుచేసినట్లుగా పేర్కొన్నారు. దీనికి సంబంధించి వివరాల్ని వెల్లడించారు.

అంతేకాదు.. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు త్వరలోనే రుణమాఫీని అమలు చేయనున్నట్లుగా పేర్కొన్నారు. మహారాష్ట్రలో శనివారం జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ అమలు చేస్తామని హామీ ఇచ్చిందని.. దాని అమలు కోసం రైతులు ఎదురుచూస్తున్నట్లుగా పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు.

దీనికి బదులు అన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. తాము అమలు చేసిన రుణమాఫీ వివరాల్ని గణాంకాల రూపంలో చెప్పుకొచ్చారు. ఆ వివరాల్ని చూస్తే..

- మొదటి విడత కింద జులై 18న 11.34 లక్షల మందికి లక్ష రూపాయిల వరకు రూ.6034.97 కోట్ల మేర మాఫీ చేశాం.

- రెండో విడతగా జులై 30న 6.40 లక్షల రైతులకు రూ.1.50 లక్షలు చొప్పున మొత్తం రూ.6190 కోట్లు

- మూడో విడతలో భాగంగా ఆగస్టు 15న 4.46 లక్షల మందికి రూ.2 లక్షలు చొప్పున రూ.5644.24 కోట్ల మొత్తాన్ని రుణమాఫీ చేశాం.

- మొత్తం 22.22 లక్షల మందికి రూ.17,869 కోట్ల భారీ మొత్తాన్ని రుణమాఫీ కింద రైతులకు అందజేశాం.

రైతుల సంక్షేమంపై తమ ప్రభుత్వానికి ఉన్న కమిట్ మెంట్ ను తెలిసేలా చేస్తుందన్న ముఖ్యమంత్రి రేవంత్.. తామిప్పుడు రూ.2 లక్షలకు పైగా అప్పున్న రైతులు రూ.2 లక్షలపైన అదనంగా ఉన్న అప్పును బ్యాంకులకు చెల్లిస్తే మిగిలిన రూ.2 లక్షల మొత్తాన్ని ప్రభుత్వం రుణమాఫీ కింద రైటాఫ్ చేస్తుందన్నారు. రైతులకు తమ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిర్ణీత కాలపరిమితతో పూర్తి చేసే విషయంలో తాము కట్టుబడి ఉన్నట్లుగా చెప్పారు.

ఇప్పటికే తమ ప్రభుత్వం బడ్జెట్ లో రైతులకు రుణమాఫీ అమలు కోసం రూ.26 వేల కోట్లను కేటాయించిందని.. అర్హత కలిగిన ప్రతి రైతును ఆదుకోవటానికి రూ.31 వేల కోట్లను వెచ్చించేందుకు సిద్ధమయ్యామని చెప్పిన సీఎం రేవంత్.. ‘‘రైతుల రుణమాఫీ విషయంలో మా ప్రభుత్వ పారదర్శకతను తెలిపేందుకు మా ప్రభుత్వ వెబ్ సైట్లో ఉన్న సమాచారాన్ని మీకు పంపుతున్నాం. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వటంలో మా కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని భావిస్తున్నాం. తెలంగాణలో రైతుల సంక్షేమాన్ని పెంపొందించేందుకు మీ సహకారం.. మార్గదర్శకత్వం కావాలి’’ అంటూ లేఖను ముగించిన వైనం ఆసక్తికరంగా మారింది.