Begin typing your search above and press return to search.

గురువు శిష్యుడు కలసి ఏమీ తేల్చలేదా ?

దాంతో ఈ ఇద్దరూ కలిస్తే రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయని అంతా ఆశించారు.

By:  Tupaki Desk   |   6 July 2024 4:48 PM GMT
గురువు  శిష్యుడు కలసి ఏమీ తేల్చలేదా ?
X

ఏపీ తెలంగాణాల మధ్య దశాబ్దం పైగా విభజన సమస్యలు పెండింగులో ఉన్నాయి. ఈ సమస్యలకు మోక్షం కలిగితే రెండు రాష్ట్రాలూ బాగుంటాయి. కానీ ఆ తరహా ప్రయత్నం అయితే పెద్దగా జరగలేదు ఇపుడు చూస్తే ఏపీకి గురువు చంద్రబాబు సీఎం తెలంగాణాకు శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎం. దాంతో ఈ ఇద్దరూ కలిస్తే రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయని అంతా ఆశించారు.

అయితే గంటా నలభై అయిదు నిముషాల పాటు సాగిన ఈ భేటీలో తేల్చిందేంటి అన్న చర్చ సాగుతోంది. ఇక చంద్రబాబు రేవంత్ రెడ్డి గురు శిష్యులు అని బయట నానుతున్నా రేవంత్ రెడ్డి మాత్రం దానిని ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు. అయితే అదే నిజం అని చాలా మంది నమ్ముతున్నారు.

ఇక చూస్తే రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే సీఎంలు అయ్యారు. పైగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది. రేవంత్ రెడ్డిని టీడీపీలో పెంచి పోషించిన నాయకుడే చంద్రబాబు. ఆ విధంగా చూస్తే ఇద్దరూ కలసి కూర్చుంటే సమస్యలు సాకారం అవుతాయని కూడా అంతా అనుకుంటున్నారు.

కాస్తా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే గతంలో కేసీఅర్ జగన్ చాలా సార్లు భేటీలు వేశారు. ఏపీ తెలంగాణాల మధ్య సమస్యల పంచాయతీని వారు ఏమీ తేల్చలేక అధికారులతోనే మీటింగులు పెట్టారు. చివరికి ఏమీ తేల్చలేకపోయారు ముఖ్యంగా చూస్తే విద్యుతు బకాయిల వద్దనే వివాదం వస్తోంది. అవి వేల కోట్లు ఉన్నాయి ఏపీ అంత మొత్తం ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి అక్కడే పీట ముడి బిగుసుకొని పోతోంది. అదే ఎడతెగని పంచాయతీ గా మారుతోంది.

ఇపుడు రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ కలసినా ఏమీ తేల్చేది ఉండదని అంటున్నారు. ఈ భేటీలు రాజకీయంగా మైలేజ్ ఇవ్వవచ్చేమో కానీ రాష్ట్రాలకు మాత్రం పెద్దగా ఉపయోగం లేకుండానే ఉంటాయని అంటున్నారు. ఇక కేంద్రమే తేల్చాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయని అంటున్నారు. కేంద్రం పెద్దన్నగా ఉంటూ రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలి కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు కలిస్తే ఏమి జరుగుతుంది అని అంటున్నారు. ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వారికి ముఖ్యం. అందువల్ల బహుమతులు అంటూ ఇటూ ఇచ్చుకోవడం పుచ్చుకోవడం తప్పించి ఏమీ సాధించగలరని అంటున్నారు.

అందుకే గంటా నలభై అయిదు నిముషాల పాటు మీటింగు పెట్టినా చివరికి ఏమీ తేల్చలేక మంత్రులతో కమిటీ అని చెప్పి డిన్నర్ చేసి వెళ్ళిపోయారు అని అంటున్నారు. ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డికి కత్తి మీద సాము లాంటి వ్యవహారం. తెలంగాణాలో భావోద్వేగాలు చాలా ఎక్కువ. పైగా రగిలించేందుకు సిద్ధంగా బీఆర్ఎస్ కాచుకుని కూర్చుంది. దాంతో పాటుగా రేవంత్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం. ఆయన ఏమి చేసినా స్వతంత్రించి చేయలేని విషయంగా ఉంటుంది.

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణాలో రాజకీయ అస్తిత్వం ఇపుడు చాలా ముఖ్యం. ఈ విధంగా ఆలోచిస్తే చంద్రబాబే కాస్తా చొవర ప్రదర్శించే పరిస్థితిలో ఉన్నారు. ఏపీకి ఆయన సర్వాధికారి, పైగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి. అయితే బీజేపీకి తెలంగాణా ప్రయోజనాలు కావాలి. అందుకే ఇది రాజకీయాన్నే ముందు పెట్టి సాగదీస్తూ పోతున్న వ్యవహారం అయింది.

మొత్తం మీద చూస్తే చంద్రబాబు రేవంత్ రెడ్డి భేటీలో ఏదో జరుగుతుందని అంతా అనుకున్నా కమిటీలతోనే పని అంటూ ముగించేశారు. మంత్రుల కమిటీలు అధికారుల కమిటీలు ఏమిటి తేలుస్తాయని అంతా పెదవి విరుస్తున్న పరిస్థితి ఉంది.