Begin typing your search above and press return to search.

భారత్, ఏపీ ఆర్థిక రాజధానులకు షాకింగ్ న్యూస్!

ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం రోజు రోజుకీ పెరిగిపోతుందని.. ఫలితంగా వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయని

By:  Tupaki Desk   |   1 Aug 2024 6:21 AM GMT
భారత్, ఏపీ ఆర్థిక రాజధానులకు షాకింగ్  న్యూస్!
X

ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం రోజు రోజుకీ పెరిగిపోతుందని.. ఫలితంగా వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయని.. దీనివల్ల దృవాల వద్ద మంచు కరగడం.. ఫైనల్ గా సముద్రమట్టాల స్థాయి పెరగడం వంటివి సంభవిస్తాయని.. అందువల్ల సముద్ర తీరాన్ని కలిగి ఉన్న ప్రాంతాలు కొంచెం కొంచెంగా కనుమరుగైపోతాయని శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలూ నిత్యం వెల్లడిస్తుంటారనేది తెలిసిన విషయమే!

అయితే... పర్యావరణ వేత్తల సూచనలు, శాస్త్రవేత్తల హెచ్చరికలను మెజారిటీ ప్రజలు పరిగణలోకి తీసుకోవడంలేదనే చర్చ నిత్యం జరుగుతూనే ఉంటుంది. ప్రకృతి ప్రకోపాలకు కూడా ఈ కాలుష్యం కారణంగా వాతావరణంలో జరుగుతున్న మార్పులే మూలాలని అంటుంటారు. ఈ సమయంలో... బెంగళూరుకు చెందిన సెంటర్ ఫర్ స్టడీ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ (సీ.ఎస్.టీ.ఈ.పీ) సంస్థ షాకింగ్ విషయాలు వెల్లడించింది.

ఈ సందర్భంగా 1987-2021 మధ్య పెరిగిన సముద్రమట్టాల స్థాయిని లెక్కిస్తూ... ఫ్యూచర్ లో ముంబై, చెన్నై, తిరువనంతపురం, మంగుళూరు, కోచి, హల్దియా, కోజికోట్, కన్యాకుమారి, ఫనాజీ, ఉడిపి, తుత్తుకుడి, పూరి, యానం లలో ఈ సంస్థ అధ్యయనాలు చేపట్టింది. ఈ సందర్భంగా... 2021 వరకూ ఈ నగరాల్లో సముద్రమట్టాలు ఏ స్థాయిలో పెరిగాయనేది సీ.ఎస్.టీ.ఈ.పీ తెలిపింది.

ఇందులో భాగంగా... ముంబై (4.44 సెంటీ మీటర్లు), హల్దియా (2.72 సెం.మీ), విశాఖపట్నం (2.38 సెం.మీ), కొచీ (2.21 సెం.మీ) చొప్పున సముద్రమట్టాల స్థాయి అత్యధికంగా పెరిగిందని తెలిపింది. ఈ లెక్కన చూసుకుంటే... 2040 నాటికి భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై 10 శాతానికి పైగా మునిగిపోనుందని ఈ అధ్యయనం షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.

ఇదే క్రమంలో... భారతదేశ టూరిజం కేపిటల్ గా చెప్పే గోవా రాజధాని పణాజీలో కూడా పెరుగుతున్న సముద్రమట్టం కారణంగా 10% భూభాగం మునిగిపోనుందని వెల్లడించింది. వీటితో పాటు యానం, తుత్తుకూడిలో కూడా 10% భూభాగం కనుమరుగయ్యే అవకాశాలున్నాయని సీ.ఎస్.టీ.ఈ.పీ తన తాజా అధ్యయనంలో పేర్కొంది. ఇదే సమయంలో... ఈ ఎఫెక్ట్ చెన్నైకి 5 - 10% ఉంటుందని తెలిపింది.

ఇలా ఈ ప్రాంతాలు అత్యధికంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉండగా.. ఆ తర్వాత స్థానంలో ఏపీ ఆర్థిక రాజధానిగా చెబుతున్న విశాఖపట్నంతో పాటు మంగుళూరు, కోచి, పూరి, ఉడిపి నగరాలు కూడా 1 నుంచి 5 % వరకూ భూభాగాన్ని కోల్పోనున్నాయని హెచ్చరించింది. ఇక కార్బన్ ఎమిషన్స్ శాత భారీగా పెరిగితే... పైన చెప్పుకున్న ప్రాంతాల్లో సముద్రంలో కలిసిపోయే భూభాగం శాతం చాలా ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది.