Begin typing your search above and press return to search.

ఆ సంస్థ ఎగ్జిట్ పోల్ పై సజ్జల ఎటకారం మామూలుగా లేదుగా?

ప్రముఖ మీడియా సంస్థ ఇండియాటుడే తాజాగా ముగిసిన ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ ను యాక్సిస్ మై ఇండియా సంస్థతో కలిసి చేపట్టటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 Jun 2024 4:36 AM GMT
ఆ సంస్థ ఎగ్జిట్ పోల్ పై సజ్జల ఎటకారం మామూలుగా లేదుగా?
X

ప్రముఖ మీడియా సంస్థ ఇండియాటుడే తాజాగా ముగిసిన ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ ను యాక్సిస్ మై ఇండియా సంస్థతో కలిసి చేపట్టటం తెలిసిందే. ఈ ఎగ్జిట్ పోల్ ఇప్పుడు అందరిని ఆకర్షించటంతో పాటు హాట్ టాపిక్ గా మారింది. అయితే.. ఈ సంస్థ అంచనాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు ఇండియా టుడే మీడియా సంస్థకు చెందిన కీలక వ్యక్తి రాజ్దీప్ సర్దేశాయ్ సైతం పెదవి విరవటం.. విస్మయాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ఎగ్జిట్ పోల్ అంచనాపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి స్పందించారు.

ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ ను సింఫుల్ గా తేల్చేసిన ఆయన.. కాసింత ఎటకారాన్ని ఆడేశారు. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ అంచనాల్ని చూశాక ఆశ్చర్యం కాదు.. నవ్వొచ్చిందన్నారు. వారు తమకు రెండు ఎంపీ స్థానాలు ఇచ్చారని.. అది కూడా వారు కాస్తంత దయతో ఇచ్చారేమో అర్థం కావట్లేదంటూ వ్యాఖ్యానించారు. తాము మరీ ఎక్కువ సీట్లు తీసుకుంటే బాగోదన్నట్లుగా వారి అంచనాలు ఉన్నాయంటూ తనదైన ఎటకారాన్ని మాటల్లో రంగరించారు.

అక్కడితో ఆగని ఆయన.. ‘జాతీయస్థాయిలో బీజేపీ టార్గెట్ గా పెట్టుకున్న 400 సీట్ల లక్ష్యం కోసం నంబర్లను సర్దుకుంటూ వెళ్లే క్రమంలో ఏపీలో వైసీపీకి రెండు సీట్లు ఇచ్చారేమో?’’ అంటూ మండిపడ్డారు. మొత్తంగా చూస్తే.. కీలక మీడియా సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్ అనంతరం కూడా సజ్జలతో పాటు.. వైసీపీ అగ్రనాయకత్వం అంతా గెలుపు ధీమాను వ్యక్తం చేస్తుండటం కనిపిస్తోంది. మరి.. తుది ఫలితాలు ఏ రీతిలో ఉంటాయో చూడాలి.