Begin typing your search above and press return to search.

వాడ్ని ఉరి తీయండి.. కోల్ కతా నిందితుడి అత్త ఆగ్రహం

రెండేళ్ల క్రితం అతడితో తన కుమార్తెకు పెళ్లందని.. తన కుమార్తెతో అతడిది రెండో పెళ్లిగా ఆమె వెల్లడించారు

By:  Tupaki Desk   |   20 Aug 2024 4:25 AM GMT
వాడ్ని ఉరి తీయండి.. కోల్ కతా నిందితుడి అత్త ఆగ్రహం
X

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన కోల్ కతా హత్యాచార ఉదంతంలో కీలక నిందితుడైన సంజయ్ రాయ్ జీవితానికి సంబంధించిన మరో కొత్త విషయం వెలుగు చూసింది. అతడ్ని ఉరి తీయాలంటూ నిందితుడి అత్త దుర్గాదేవి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. అతడి తీరు ఏ మాత్రం సరిగా ఉండదని.. తన కుమార్తె అనారోగ్యానికి అతడి తీరే కారణంగా ఆమె చెబుతోంది. అతడికి.. తన కుమార్తెకు సంబంధాలు సరిగా లేవన్న ఆమె.. అతడు ఏ మాత్రం మంచోడు కాదని చెబుతోంది. అతడ్ని ఏం చేసినా ఫర్లేదని.. ఉరి తీసిన సరేనని చెప్పటం గమనార్హం.

రెండేళ్ల క్రితం అతడితో తన కుమార్తెకు పెళ్లందని.. తన కుమార్తెతో అతడిది రెండో పెళ్లిగా ఆమె వెల్లడించారు. పెళ్లైన మొదటి ఆర్నెల్లు అంతా బాగానే ఉందని.. భార్య గర్భవతి అన్న విషయం తేలిన తర్వాత నుంచి గొడవలు మొదలైనట్లుగా పేర్కొన్నారు. మూడు నెలలు గర్భంతో ఉన్నప్పుడు తన కుమార్తెపై చేయి చేసుకున్నాడని.. దీంతో ఆమెకు అబార్షన్ అయి చనిపోయినట్లుగా దుర్గాదేవి పేర్కొన్నారు.

దీనికి సంబంధించి అతడిపై కేసు నమోదు చేశామని.. అప్పటి నుంచి తన కుమార్తె అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు ఆమె చెప్పారు. ఆమెకు అయ్యే వైద్య ఖర్చులన్ని తానే భరిస్తున్నట్లు చెప్పిన ఆమె.. ‘‘వైద్యురాలిపై అతడు చేసిన నేరం గురించి నేను మాట్లాడలేను. అలాంటి నేరానికి పాల్పడే శక్తి అతడొక్కడికే ఉండకపోవచ్చు. మరికొంత మంది కూడా ఉండొచ్చు. తను మంచివాడు కాదు. అతడ్ని ఏం చేసినా ఫర్లేదు. ఉరి తీసినా మాకు సమ్మతమే’’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. నిందితుడి తీరు ఎంత దారుణంగా ఉంటుందన్న దానికి అతడి అత్త మాటలే నిదర్శనంగా చెబుతున్నారు.