Begin typing your search above and press return to search.

ఆర్నెల్లలో కోటి స్కూటర్లు.. ఏసీ కొనుగోళ్లు భారీగా!

ఈ ఆర్థిక సంవత్సరంలో 1.2 కోట్ల నుంచి 1.25 కోట్ల వరకు ఏసీలు అమ్ముడయ్యే వీలుందని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   20 Oct 2024 2:30 PM GMT
ఆర్నెల్లలో కోటి స్కూటర్లు.. ఏసీ కొనుగోళ్లు భారీగా!
X

దేశీయ వాహన రంగం దూసుకెళుతోంది. తాజాగా వెలువడుతున్న గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 01 - మార్చి 31)లో మొదటి అర్థభాగం (ఏప్రిల్ - సెప్టెంబరు)లో భారత టూవీలర్ మార్కెట్ కు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. బైకులు.. స్కూటర్లు.. మోపెడ్లు కలిసి మొత్తంగా కోటికి పైనే అమ్ముడు కావటం ఆసక్తికరంగా మారింది. గత ఏడాది ఇదే సమయంలో అమ్మిన వాహనాలతో పోలిస్తే ఈ ఏడాది 16 శాతం ఎక్కువగా ఉండటం విశేషం.

గత ఏడాది ఇదే కాలంలో (2023 ఏప్రిల్ సెప్టెంబరు)లో 87,39,406 వాహనాల్ని అమ్మితే.. ఈ ఏడాది ఇదే సమయంలో 1,01,64,980 టూవీలర్లను అమ్మడు కావటం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో అమ్ముడైన 1.79 కోట్ల వాహనాల్లో ఈ ఆర్థిక ఏడాది మొదటి ఆర్నెల్ల లోనే 64 శాతం అమ్ముడు కావటం చూసినప్పుడు భారత టూవీలర్ల మార్కెట్ జోరు ఏ రీతిలో ఉందన్న విషయం అర్థమవుతుంది.

కరోనాకు ముందు 2018-19 మొదటిఆర్నెల్లలో 1.15 కోట్ల టూవీలర్లు అమ్ముడయ్యాయి. అంటే.. ఆరేళ్ల తర్వాత మళ్లీ కరోనాకు ముందు టూవీలర్ల అమ్మకాల్లో కనిపించిన దూకుడు మళ్లీ రిపీట్ అవుతుందని చెప్పాలి. మూడు విభాగాల్లో (బైక్ లు.. స్కూటర్లు..మోపడ్లలో రెండు అంకెల వ్రద్ధి చూపటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. బైక్ ల మార్కెట్ లో 16.31 శాతం.. స్కూటర్ల విభాగంలో 22 శాతం.. మోపెడ్లలో 16.55 శాతం చొప్పున అధికంగా అమ్ముడైనట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

టూవీలర్ల మార్కెట్ ఇలా ఉంటే.. ఏసీల అమ్మకాల జోరు కూడా ఎక్కువగా ఉన్నట్లు ఇక్రా చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.2 కోట్ల నుంచి 1.25 కోట్ల వరకు ఏసీలు అమ్ముడయ్యే వీలుందని చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే ఏసీల అమ్మకాలు దాదాపు 20 నుంచి 25 శాతం ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. వాతావరణ పరిస్థితుల్లో చోటు చేసుకుంటునన మార్పులు.. ఒక్కో కుటుంబంలో బహుళ ఆర్ఎసీలకు పెరుగుతున్న గిరాకీ.. పట్టణీకరణ.. వినియోగదారుల ఆదాయాలు పెరగటం లాంటి వాటి కారణంగా కొన్నేళ్లలో రూమ్ ఏసీల పరిశ్రమ వేగంగా డెవలప్ అవుతుందని ఇక్రా రిపోర్టు చెబుతోంది.