Begin typing your search above and press return to search.

'షర్మిలవి పచ్చి అబద్ధాలు'!... మెడపై తల ఉన్న ఎవరికైనా అర్ధమైపోతుందా?

ఈ సమయంలో.. తనపై వస్తోన్న ఆరోపణలపై షర్మిల స్పందించారు. వైఎస్సార్ అభిమానులకు 3 పేజీల బహిరంగ లేఖ రాశారు.

By:  Tupaki Desk   |   26 Oct 2024 5:04 AM GMT
షర్మిలవి పచ్చి అబద్ధాలు!... మెడపై తల ఉన్న ఎవరికైనా అర్ధమైపోతుందా?
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత రెండు మూడు రోజులుగా వైఎస్ జగన్ - షర్మిల మధ్య జరుగుతున్న ఆస్తుల తగాదాలకు సంబంధించిన విషయాలు తీవ్ర చర్చనీయాంశంగా ఉంటున్నాయి. అయితే... ఇవి కొంతమందికి ఇంపుగా ఉన్నట్లు అనిపిస్తుంటే.. మరి కొంతమందికి మాత్రం చికాకు తెప్పిస్తున్నాయని, ఫ్యామిలీ విషయాలు బజారులో చర్చకు అవసరమా అని అంటున్నారని తెలుస్తోంది.

ఈ సమయంలో.. తనపై వస్తోన్న ఆరోపణలపై షర్మిల స్పందించారు. వైఎస్సార్ అభిమానులకు 3 పేజీల బహిరంగ లేఖ రాశారు. వైఎస్ అభిమానులకు వాస్తవాలు (ఆమె దృష్టిలో) తెలియజేసే ప్రయత్నంలో భాగంగానే ఈ లేఖ రాసినట్లు చెప్పుకొచ్చారు. ఆస్తులు కావాలనే కోరిక తనకు లేదని.. తన బిడ్డలకు ఆస్తులు చెందాలన్న వైఎస్సార్ అభిమతం మేరకే ఈ ప్రయత్నమన్నట్లుగా చెప్పుకొచ్చారు.

దీంతో... ఈ ఒక్క విషయంలోనే వైఎస్సార్ ఆశయాలు, అభిమాతాలు గుర్తుకు వచ్చాయా.. మరే విషయంలోనూ అవి గుర్తుకు రాలేదా.. అంటూ వైసీపీ నుంచి ఎదురు ప్రశ్నలు వస్తున్నాయి! ఆ సంగతి అలా ఉంటే... జగన్ కు రాసిన లేఖ.. టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్ లో పోస్ట్ అవ్వడంపై ఆమె ఓ వివరణ విత్ ప్రామిస్ ఇచ్చారు షర్మిల. ప్రస్తుతం ఇప్పుడు దీనిపై నిప్పుల వర్షాలు కురుస్తున్నాయని తెలుస్తోంది.

అవును... "జగన్ కు నేను లేఖ రాస్తే.. అది తెలుగుదేశానికి చెందిన హ్యాండిల్ లో పోస్ట్ అయితే.. నాకు ఏమి సంబంధం? నేనైతే బైబిల్ మీద ప్రమాణం చేయగలను. నా వరకూ నేను గానీ, నా మనుషులు గానీ బయటపెట్టలేదని ప్రమాణం చేయగలం" అని అని రాసుకొచ్చారు షర్మిల. దీంతో ఆమెపై వైఎస్ అభిమానుల నుంచీ, బైబిల్ ని నమ్మేవారి నుంచీ, సామాన్యుల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయని తెలుస్తోంది.

ఈ సందర్భంగా.. చాలా మంది జనాలు.. తాము మాత్రమే తెలివైన వాళ్లము, తాము ఏమి చెప్పినా జనాలు నమ్ముతారు, తాము దేనినైనా సమర్ధించగలము, ఎలాగైన బొంకగలము అనే ఓవర్ కాన్ ఫిడెన్స్ తో ఉంటుంటారు! అయితే వాళ్లు చూడని లోకం, వాళ్లకు తెలియని ప్రపంచం చాలా ఉందని.. వాళ్ల కంటే చాలా తెలివైన వాళ్లు చాలా మందే ఉంటారని గ్రహించలేకపోతుంటారు అనే చర్చ తెరపైకి వచ్చింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... జగన్ - షర్మిల - విజయమ్మ మధ్య మాత్రమే జరిగిన లేఖల గురించి (పరోక్షంగానో, ప్రత్యక్షంగానో) ఒక రోజు ముందే టీడీపీ సోషల్ మీడియాలో పోస్టర్లు వేసి మరీ చెప్పారంటే... వారికి ఈ ముగ్గురిలోనే ఒకరు హింట్ ఇచ్చినట్లే కాదా!? అనంతరం నేరుగా లేఖే అందించినట్లు కదా!? అంతకు మించి మరో ఆప్షన్ లేదు కదా!?

ఈ లేఖను టీడీపీకి ఇస్తే.. జగన్ ఇవ్వాలి! ఇస్తారా..? ఇంతకు మించిన అజ్ఞానంతో కూడిన ప్రశ్న మరోకటి ఉండదు! మరి తన కొడుకూ కూతురి మధ్య ఆస్తుల తగాదాలు జరుగుతున్నాయి.. వాటిని మీరు రాజకీయంగా ఉపయోగించుకోండి బాబు అని విజయమ్మే టీడీపీకి ఇచ్చారా? ఇంతకంటే పనికిమాలిన ప్రశ్న మరొకటి ఉండకపోవచ్చు! టీడీపీ వాళ్లు స్పై చేశారా? వారికి అంత అవసరం లేదు! మరి ఎవరు ఇచ్చి ఉండోచ్చు..? ఈ సమయంలో అన్ని వెళ్లూ ఒకవైపే చూపిస్తున్నాయని అంటున్నారు!

గత కొంతకాలంగా షర్మిళ వ్యవహార శైలి.. ఆమె చేస్తున్న రాజకీయాలు.. ఆమె చేస్తోన్న విమర్శలు.. రాష్ట్రంలో సమస్యల విషయంలో ఒకరిని తలుపు చెక్కతో, మరొకరిని తమలపాకుతో కొడుతున్న విధానాలూ అన్నీ గమనిస్తూ.. కాస్త చదువుకున్న ఎవరికైనా.. కాస్త అవగాహన ఉన్న ఎవరికైనా ఇది ఎవరి పని అనేది ఇట్టే అర్ధమైపోతుంటుంది అని అంటున్నారు నెటిజన్లు, పరిశీలకులు.

ఇక.. ఈ విషయంపై ఏకంగా బైబిల్ పైనే ప్రమాణం చేస్తానంటూ ఆమె చెప్పిన మాటలపైనా పలువురు మండిపడుతున్నారు. రాజకీయాల కోసమో, ఆస్తుల కోసమో, కక్షల కోసమో... కారణం ఏమైనా కానీ.. ఇలా బైబిల్ పై ప్రమాణాలు అని అనడంపైనా విమర్శలు చేస్తున్నారు. జగన్ కు రాసిన లేఖ టీడీపీ చేతికి ఎలా చేరిందనేది మెడపై తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతుందని.. దాన్ని కవర్ చేయడం కోసం బైబిల్ ని అడ్డుపెట్టుకోవడం క్షమించరాని చర్య అని పలువురు ఫైరవుతున్నారు.

దీంతో... వైఎస్ జగన్ ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా జరుగుతున్న ఎత్తుగడల్లో షర్మిల పూర్తిగా కూరుకుపోయారని.. జగన్ వ్యతిరేక శక్తులన్నింటితోనూ చేతులు కలిపి అసత్యారోపణలు చేస్తున్నారని.. ఇప్పటికే గత ఎన్నికల్లో ఈ మేరకు సక్సెస్ అయారని.. ఇప్పుడు మరింత దిగజారిపోతున్నారని.. వైఎస్సార్ శత్రువుల చేతిలో ఆమె పావుగా మారారని అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు!

మరి ఇప్పటికైనా షర్మిల.. ఏది మంచి, ఏది చెడు.. ఏది శాస్వతం, మరేది అశాస్వతం.. ఎవరు సొంతవారు, ఇంకెవరు పరాయి వారు అనే విషయాలను గ్రహించాలని.. అన్నను అభాసుపాలు చేస్తున్నాననే ఆనందంలో తనను తాను పాతాళానికి తొక్కేసుకుంటున్న విషయాలను అర్ధం చేసుకోవాలని.. వైఎస్ కుటుంబ గౌరవాన్ని కాపాడలేకపోయినా పర్లేదు కానీ నాశనం చేయకూడదనే ఆలోచన ఆమెకు కలగాలని అభిమానులు కోరుకుంటున్నారు!

- Raja Ch