Begin typing your search above and press return to search.

విజయనగరం వ్యాపారి కిడ్నాప్.. అసలు విషయాలు తెలిస్తే అవాక్కే!

విజయనగరానికి చెందిన ఒక వ్యాపారి కిడ్నాప్ ఉదంతం సంచలనంగా మారింది.

By:  Tupaki Desk   |   26 Jun 2024 4:11 AM GMT
విజయనగరం వ్యాపారి కిడ్నాప్.. అసలు విషయాలు తెలిస్తే అవాక్కే!
X

విజయనగరానికి చెందిన ఒక వ్యాపారి కిడ్నాప్ ఉదంతం సంచలనంగా మారింది. మహిళలకు అసభ్యకర మెసేజ్ లు పంపుతున్న వ్యాపారికి బుద్ధి చెప్పే క్రమంలో అతి తెలివితో వ్యవహరించిన వైనం మొదటికే మోసం రావటమే కాదు.. జైలుకు వెళ్లేలా చేసింది. దీనికికారణం కిడ్నాప్ వేళ.. సదరు వ్యాపారిని హింసించిన తీరే. అసలేం జరిగిందంటే..

రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక వ్యాపారి విజయనగరం పట్టణంలో స్టీల్.. స్టౌ మెటల్ వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారం చేసుకుంటే బాగుండేది. అలా కాకుండా అతను కొందరు మహిళలకు అసభ్యకర మెసేజ్ లు పంపుతున్నాడు. దీంతో.. రాజస్థాన్ లోని అతడి స్వగ్రామానికి చెందిన కొందరు ఈ నెల పద్నాలుగున విజయనగరం వచ్చారు. సదరు వ్యాపారితో మాట్లాడి.. అతడ్ని కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు.

అక్కడ కాసేపు మాట్లాడుకున్న తర్వాత మద్యం తాగించి.. ఆ తర్వాత అసలు విషయంలోకి వెళ్లారు. తమ ఆడవాళ్లకు అసభ్యకర మెసేజ్ లు ఎందుకు పంపుతున్నావంటూ ప్రశ్నించి.. అతడిపై దాడికి పాల్పడ్డారు. అతడ్ని బెంగళూరుకు తీసుకెళ్లే క్రమంలో.. మధ్యలో ఆపి ఒక బాటిల్ లో మూత్రంతో నింపి.. దాన్ని అతడి చేత బలవంతంగా తాగించారు. దీన్ని వీడియో తీశారు.

అతడి స్నేహితుడికి ఫోన్ చేసి బలవంతంగా రూ.35 వేలు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే బాగోదంటూ వార్నింగ్ ఇచ్చారు. తేడా చేస్తే చంపేస్తామని చెప్పి వెళ్లిపోయారు. తనకు ఎదురైన పరిణామాలతో సదరు వ్యాపారి కామ్ గా ఉండిపోయాడు. ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు. కాకుంటే.. సదరు వ్యాపారి చేత మూత్రం తాగించిన వీడియో సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోకి రావటంతో అతను పోలీసులకు కంప్లైంట్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మరో ఇద్దరు నిందితుల్ని త్వరలో పట్టుకుంటామని చెప్పారు. మొత్తంగా ఈ వ్యవహారం విజయనగరం పట్టణంలో సంచలనంగా మారింది.