Begin typing your search above and press return to search.

నమస్తే లారెన్స్.. మీతో మాట్లాడాలనుకుంటున్నా.. నటి పోస్టు

జైలు నుంచి కూడా మీరు జూమ్ కాల్స్ చేస్తారని తెలిసింది.

By:  Tupaki Desk   |   18 Oct 2024 4:11 AM GMT
నమస్తే లారెన్స్.. మీతో మాట్లాడాలనుకుంటున్నా.. నటి పోస్టు
X

అనూహ్యంగా చోటు చేసుకున్న ఒక పరిణామం షాకింగ్ గా మారింది. దీనికి సంబంధించిన పోస్టు ఇప్పుడు వైరల్ అయ్యింది. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన లారెన్స్ బిష్ణోయ్ కు ఆన్ లైన్ వేదికగా బాలీవుడ్ నటి ఒకరు పోస్టు పెట్టటం.. ఆమె కండల వీరుడు.. బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ కు మాజీ ప్రేయసి కావటం గమనార్హం. ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసు నేపథ్యంలో లారెన్స్ బిష్ణోయ్ హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో.. ఆ గ్యాంగ్ స్టర్ పేరును ప్రస్తావిస్తూ పోస్టు పెట్టిన నటి సోమీ ఆలీ తీరు చర్చగా మారింది.

‘నమస్తే లారెన్స్ బిష్ణోయ్. జైలు నుంచి కూడా మీరు జూమ్ కాల్స్ చేస్తారని తెలిసింది. మీతో కొన్ని విషయాలు చర్చించేందుకు మాట్లాడాలనుకుంటున్నా. మిమ్మల్ని ఎలా సంప్రదించాలి. ఈ ప్రపంచంలో రాజస్థాన్ నాకు ఇష్టమైన ప్రదేశం. తొలుత మీతో జూమ్ కాల్ మాట్లాడిన తర్వాత రాజస్థాన్ వెళ్లాలని అనుకుంటున్నా. నన్ను నమ్మండి. ఇదంతా మీ మంచి కోసమే. మీ మొబైల్ నెంబరు ఇస్తే సంతోషిస్తా’ అంటూ ఇన్ స్టా లో పోస్టు పెట్టారు. కన్ఫ్యూజ్ కాకూడదని అనుకున్నారేమో కానీ.. లారెన్స్ బిష్ణోయ్ ఫోటోను జత చేశారు.

ఇంతకూ సోమీ అలీ ఎవరన్న విషయానికి వస్తే ఆమె పాకిస్థాన్ మూలాలు ఉన్న అమెరికన్ నటి. ఆందోళన్.. మాఫియా లాంటి చిత్రాలతో ఆమె గుర్తింపు వచ్చింది. గతంలో సల్మాన్ ఖాన్ - సోమీ అలీ హీరో హీరోయిన్లుగా ఒక సినిమాను ప్రకటించటం.. షూటింగ్ వేళలోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైనట్లు చెబుతారు. అయితే.. సదరు సినిమా ఆగిపోయింది. ఇదే విషయాన్ని ఒక సందర్భంలో సోమీ అలీ వెల్లడిస్తూ.. ‘‘సల్మాన్ అంటే నాకెంతో ఇష్టం. అతనికి నా ప్రేమను తెలియజేశా’ అని పేర్కొన్నారు. తర్వాత ఏమైందో కానీ వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాతి కాలంలో సల్మాన్ మీద ఒక పోస్టు పెట్టిన ఆమె.. సంచలనంగా మారారు.

సూపర్ హిట్ మూవీ ‘మైనే ప్యార్ కియా’ పోస్టర్ ను షేర్ చేసిన ఆమె.. ‘అమ్మాయిల్ని కొట్టేవాడు. కేవలం నన్ను మాత్రమే కాదు ఎంతోమంది మహిళల్ని కొట్టేవాడు. దయచేసి ఇకనైనా అతన్ని అభిమానించటం ఆపండి. అతనో శాడిస్ట్. మానసిక రోగి. ఈ విషయం మీకెవరికీ తెలీదు’ అంటూ పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. ఆ పోస్టు పెద్ద ఎత్తున వైరల్ కావటంతో దాన్ని ఆ తర్వాత డిలీట్ చేశారు. కట్ చేస్తే.. ఇప్పుడు సల్మాన్ ను ద్వేషించే లారెన్స్ బిష్ణోయ్ ను ఎందుకు కలవాటనుకుంటున్నారు? ఏం మాట్లాడాలనుకుంటున్నారు? లాంటివి ప్రశ్నలుగా మారాయి. క్రిష్ణ జింకలను వేటాడిన ఉదంతంపై లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ పై పగబట్టినట్లుగా చెబుతారు. తామెంతో పవిత్రంగా కొలిచే క్రిష్ణ జింకల్ని వేటాడిన సల్మాన్ ను ఊరికే వదిలి పెట్టకూడదన్న భావనతో బిష్ణోయ్ ఉన్నట్లు చెబుతారు.

ఎన్సీపీ నేత సిద్దిఖీకి హత్య కేసులో బిష్ణోయ్ వర్గం బాధ్యత తీసుకోవటం తెలిసిందే. సిద్దిఖీ హత్య తర్వాత సల్మాన్ తో సంబంధాలు ఉన్న వారందరికి ఈ గ్యాంగ్ వార్నింగ్ లు ఇవ్వటం గమనార్హం. ఇదిలా ఉండగా.. లారెన్స్ బిష్ణోయ్ కు ఉన్న అరుదైన అలవాటు గురించి చెబుతారు. ప్రస్తుతం గుజరాత్ లోని జైల్లో ఉన్న అతను ఎన్సీపీ నేత మర్డర్ సమయంలో దాదాపు వారం రోజుల పాటు ఉపవాసం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఎవరి మర్డర్ అయినా ప్లాన్ చేస్తే.. వారం.. పది రోజుల పాటు ఉపవాసం ఉండటం అతని అలవాటుగా చెబుతారు. జైల్లో ఉండి కూడా వీడియో కాల్స్ మాట్లాడే సత్తా బిష్ణోయ్ కు ఉందంటారు. తాజాగా పాకిస్థాన్ కు చెందిన ఒక గ్యాంగ్ స్టర్ తో వీడియో కాల్ లో మాట్లాడిన వైనం వెలుగు చూసి సంచలనంగా మారింది. ఇక.. బాలీవుడ్ నటి బిష్ణోయ్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.