Begin typing your search above and press return to search.

డ్ర‌గ్స్ కేసులో న‌టి పేరు.. డ్ర‌గ్ డాన్ ఎవ‌రో తెలీదు!

గ్యాంగ్‌స్టర్‌ ఓంప్రకాష్‌ ఎవరో తెలుసుకోవడానికి గూగుల్‌లో వెళ్లాల్సి వచ్చిందని మ‌ల‌యాళ న‌టి ప్రయాగ మార్టిన్‌ చెప్పింది.

By:  Tupaki Desk   |   11 Oct 2024 2:30 PM GMT
డ్ర‌గ్స్ కేసులో న‌టి పేరు.. డ్ర‌గ్ డాన్ ఎవ‌రో తెలీదు!
X

గ్యాంగ్‌స్టర్‌ ఓంప్రకాష్‌ ఎవరో తెలుసుకోవడానికి గూగుల్‌లో వెళ్లాల్సి వచ్చిందని మ‌ల‌యాళ న‌టి ప్రయాగ మార్టిన్‌ చెప్పింది. కొచ్చిలో డ్రగ్స్ కేసులో పోలీసులు ప్రశ్నించిన అనంతరం మీడియా ప్రతినిధులతో న‌టి ప్ర‌యాగ మార్టిన్ స్పందించారు. గత వారం కొచ్చిలో అలాన్ వాకర్ మ్యూజిక్ షోకు సంబంధించి ఓంప్రకాష్ ఉపయోగించిన హోటల్ గదిని సందర్శించిన నటీన‌టుల్లో ప్రయాగ, శ్రీనాథ్ భాసి(మంజుమ్మ‌ల్ బోయ్స్ న‌టుడు)లను పోలీసులు గురువారం విచారించారు. హోటల్ గదిలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో డ్ర‌గ్ డీల‌ర్ తో మాట్లాడిన ఆ ఇద్ద‌రిపైనా పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే ప్ర‌యాగ మార్టిన్ తాజా మీడియా విచార‌ణ‌లో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. ``ఈ జీవితంలో సాంఘికంగా జీవించడం ఒక భాగం.. మేము చాలా మందిని కలుస్తాము. వారు నేరస్థులా కాదా అనేది తెలుసుకోవడం సాధ్యం కాదు. మేము చేయగలిగేది సరిగ్గా ప్రవర్తించడమే`` అని పోలీసులు ప్రశ్నించిన తర్వాత ప్రయాగ విలేకరులతో అన్నారు.

ఒక‌రికి పోలీస్ క్లీన్ చిట్:

గ్యాంగ్‌స్టర్ ఓం ప్రకాష్‌తో సంబంధం ఉన్న రేవ్ పార్టీ కేసులో నటి ప్రయాగ మార్టిన్, నటుడు శ్రీనాథ్ భాసీల వాంగ్మూలాల వివరాలు బయటకు వచ్చాయి. ఇద్దరికీ ఓం ప్రకాష్‌ ప్రత్యక్షంగా తెలియదని పోలీసులు తెలిపిన‌ట్టు కేర‌ళ కౌముది వెబ్ సైట్ పేర్కొంది. ఘటన జరిగిన రోజు తెల్లవారుజామున 4 గంటలకు ప్రయాగ లగ్జరీ హోటల్‌కు వచ్చింది. ఆమె ఉదయం 7 గంటలకు బయలుదేరింది. ఆ రోజు జరిగిన పార్టీలో ప్రయాగ మార్టిన్, శ్రీనాథ్ భాసీ డ్రగ్స్ వాడినట్లు ఆచూకీ లభించలేదు. రక్త పరీక్షకు సిద్ధంగా ఉన్నామని నటీనటులు నిన్న విచారణ అధికారులకు తెలియజేశారు. ఇద్దరి వాంగ్మూలాలను దర్యాప్తు బృందం కూలంకషంగా పరిశీలిస్తోంది.

న‌టి ప్ర‌యాగ మార్టిన్ నిన్న సాయంత్రం ఎర్నాకులం సౌత్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ప్రయాగ తన స్నేహితులను కలిసేందుకు హోటల్‌కు వెళ్లినట్లు విచారణ అధికారులకు తెలిపింది. రేవ్ పార్టీ గురించి తెలియదు .. ఓం ప్రకాష్ ఎవ‌రో తెలియదు అని తెలిపింది. ఆ వార్త వచ్చిన తర్వాత గూగుల్ ద్వారా ఓం ప్రకాష్ ఎవరో తెలుసుకున్నానని ప్రయాగ తెలిపింది. ప్రయాగ వాంగ్మూలం సంతృప్తికరంగా ఉన్నందున, ఆమెకు మళ్లీ సమన్లు ఇవ్వాల్సిన అవసరం లేదని దర్యాప్తు అధికారులు అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే ఈ కేసులో ప్రమేయం ఉన్న బిను జోసెఫ్, శ్రీనాథ్ బసి ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు బృందానికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. దీంతో శ్రీనాథ్ భాసిని మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. వీరి మధ్య డ్రగ్స్‌ లావాదేవీలు ఏమైనా ఉన్నాయా అనే విషయం కూడా పరిశీలిస్తారు.