Begin typing your search above and press return to search.

అమ్మాయిల బాత్ రూమ్ లో సీక్రెట్ కెమెరాలు... అసలు ఏమి జరిగింది?

By:  Tupaki Desk   |   30 Aug 2024 6:35 AM GMT
అమ్మాయిల బాత్ రూమ్ లో సీక్రెట్ కెమెరాలు... అసలు ఏమి జరిగింది?
X

ఏపీలో తాజాగా ఓ ఘోర ఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా కృష్ణాజిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలోని అమ్మాయిల హాస్టల్ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టారనే వదంతుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. అమ్మాయిల బాత్ రూమ్ లో కెమెరాలు పెట్టి.. ఆ వీడియోలను పలువురికి షేర్ చేస్తున్నారు అన్న దారుణ వదంతులు ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.

అవును... గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో ఓ దారుణ విషయం వెలుగు చూసింది. ఇందులో భాగంగా.. అమ్మాయిల హాస్టల్ బాత్ రూమ్ లో కెమెరా ఉండటాన్ని విద్యార్థులు గుర్తించారు అనేది ఆరోపణ! ఈ సమయంలో ఈ వ్యవహారంపై హాస్టల్ వార్డెన్ కు ఫిర్యాదు చేయగా... అత్యంత షాకింగ్ విషయాలు బయటపడ్డాయని అంటున్నారు. ఇప్పుడు ఈ విషయం ఆడపిల్లల తల్లితండ్రులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది!

వివరాళ్లోకి వెళ్తే... గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాలు పెట్టారనే విషయాన్ని అమ్మాయిలు గుర్తించారట. అయితే ఈ విషయం కాలేజీ యాజమాన్యానికి తెలిసినా విషయం బయటకు పొక్కకుండా మౌనంగా ఉన్నారనే ఆరోపణలూ సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. దీంతో... గురువారం అర్ధరాత్రి దాటాక విద్యార్థినిలు సెల్ ఫోన్ లైట్స్ చేతపట్టి ఆందోళన చేపట్టారు.

తెల్లవారుజామున మూడున్నర గంటలవరకూ ఈ అందోళన కొనసాగింది. ఈ సమయంలో... ఈ వ్యవహారం అంతా నడిపింది ఓ అమ్మాయే అనే విషయం తెలిసిందని.. దీంతో వారంతా షాక్ కి గురయ్యారని అంటున్నారు. మరో ఘోరమైన విషయం ఏమిటంటే... తన బాయ్ ఫ్రెండ్స్ కోసమే ఇద్దరు అమ్మాయిలు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారని చెబుతున్నారు.

దీంతో... పరిస్థితులు ఇంత దారుణంగా మారిపోయాయా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు ప్రజానికం. ఈ సమయంలో ఈ ఘోరం వెలుగులోకి రావడంతో ఆగ్రహించిన విద్యార్థినులు యాజమాన్యంపై మండిపడుతున్నారు.

మరోపక్క ఇలాంటి తప్పుడు పనిచేసిన విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సద్దుమణించే ప్రయత్నం చేశారని అంటున్నారు. అయితే... కాలేజీ యాజమాన్యం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాకపోవడం గమనార్హం!.

మరోపక్క ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను వైసీపీ షేర్ చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేష్, పవన్ లను ట్యగ్ చేసి విషయంపై దర్యాప్తుకు డిమాండ్ చేస్తుంది! ప్రస్తూతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోపక్క ఈ కాలేజీలో చదువుతున్న అమ్మాయిల పేరెంట్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.

చంద్రబాబు కీలక ఆదేశాలు!:

కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయనే ఆరోపణల వ్యవహారంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఇందులో భాగంగా ఆయన ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు టీడీపీ తన ఎక్స్ ఖాతాలో విషయాన్ని పోస్ట్ చేసింది.