Begin typing your search above and press return to search.

సుచిర్ బాలాజీ మరణానికి ముందు ఏం జరిగింది? వెలుగులోకి సీసీటీవీ దృశ్యాలు

అతడి మరణం ఇప్పటికీ అనేక అనుమానాలకు తావిస్తోంది. తాజాగా చనిపోయే ముందు సుచిర్ లిఫ్ట్‌లోకి వెళ్లే సీసీటీవీ ఫొటోను అతని తల్లి పూర్ణిమారావు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

By:  Tupaki Desk   |   13 March 2025 6:00 PM IST
సుచిర్ బాలాజీ మరణానికి ముందు ఏం జరిగింది? వెలుగులోకి సీసీటీవీ దృశ్యాలు
X

ఓపెన్‌ఏఐలో నాలుగేళ్లు పరిశోధకుడిగా పనిచేసిన భారతీయ సంతతికి చెందిన విజిల్ బ్లోయర్ సుచిర్ బాలాజీ (26) గత ఏడాది అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. అతడి మరణం ఇప్పటికీ అనేక అనుమానాలకు తావిస్తోంది. తాజాగా చనిపోయే ముందు సుచిర్ లిఫ్ట్‌లోకి వెళ్లే సీసీటీవీ ఫొటోను అతని తల్లి పూర్ణిమారావు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

- సీసీటీవీ ఫుటేజ్‌పై పూర్ణిమారావు వ్యాఖ్యలు

‘సుచిర్ చనిపోయిన రోజు రాత్రి 7:30కి తీసిన ఫొటో ఇది. అతడు ఆ సమయంలో ఫుడ్ పార్శిల్ పట్టుకొని లిఫ్ట్ ఎక్కుతున్నాడు. చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం (OCME) ఈ వీడియోను పరిశీలించినప్పటికీ అతడు నిరాశతో ఆత్మహత్య చేసుకున్నాడని తేల్చేశారు. అంతేకాదు మృతికి మూడు రోజుల తర్వాత నిర్వహించిన శవపరీక్షలో అతని శరీరంలో అధిక మోతాదులో డ్రగ్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, మేము చేయించిన మరో నివేదికలో ఈ వివరాలు తప్పని తేలింది. ప్రస్తుతం టాక్సికాలజీ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నాం’ అని పూర్ణిమారావు తెలిపారు.

- హత్యకు పథకం?: తల్లి సంచలన ఆరోపణలు

అతడి మరణం అనుకోకుండా జరిగినదానికాదు, దీర్ఘకాలంగా ప్రణాళికాబద్ధంగా జరిగిన హత్యగా పూర్ణిమారావు ఆరోపించారు. సుచిర్ నివసించే అపార్ట్‌మెంట్ గ్యారేజీలో, ఎలివేటర్ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని ఆమె పేర్కొన్నారు.

- మరణం & విచారణ

2023 నవంబర్ 26న సుచిర్ బాలాజీ శాన్‌ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్‌మెంట్‌లో మరణించాడు. అయితే ఈ సమాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ప్రాథమికంగా దీన్ని ఆత్మహత్యగా నిర్ధారించారు. అయితే, తన కుమారుడి మరణంపై అనుమానంతో పూర్ణిమారావు న్యాయపోరాటం ప్రారంభించారు. ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌ను నియమించి మరొకసారి శవపరీక్ష చేయించగా, పోలీసుల నివేదికతో విభిన్నమైన ఫలితాలు వచ్చాయని తెలిపారు.

-OpenAI స్పందన

ఈ ఘటనపై ప్రముఖ టెక్ సంస్థ ఓపెన్‌ఏఐ కూడా స్పందించింది. సుచిర్ మరణం తమను తీవ్రంగా కలిచివేసిందని, అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ పోస్ట్ ద్వారా పేర్కొంది.