Begin typing your search above and press return to search.

పగటిపూటనే దొంగతనాలు.. ఈ వెరైటీ దొంగ క్రైం కథ ఇదీ

దొంగతనాలంటే సాధారణంగా రాత్రి వేళల్లోనే జరుగుతాయనుకుంటాం. చీకట్లో, ఎవరూ గమనించని సమయంలో దొంగలు తమ పని తీరుస్తారు.

By:  Tupaki Desk   |   23 Feb 2025 6:00 PM IST
పగటిపూటనే దొంగతనాలు.. ఈ వెరైటీ దొంగ క్రైం కథ ఇదీ
X

దొంగతనాలంటే సాధారణంగా రాత్రి వేళల్లోనే జరుగుతాయనుకుంటాం. చీకట్లో, ఎవరూ గమనించని సమయంలో దొంగలు తమ పని తీరుస్తారు. కానీ బెంగళూరుకు చెందిన ఓ దొంగ మాత్రం అందరి కంటే భిన్నం. "నా రూటే సపరేటు!" అంటూ దొంగతనాలను రాత్రి కాకుండా పగటి పూటలోనే చేసే వెరైటీ దొంగ సుహాన్ ఖాన్ చివరకు పోలీసుల చేతిలో చిక్కాడు.

-పక్కా ప్లాన్ తో దొంగతనాలు

సుహాన్ ఖాన్ తన దొంగతనాలకు ముందుగా పూర్తిగా పరిశీలన జరిపి, ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఖచ్చితంగా అంచనా వేసేవాడు. ఈ తరహాలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా పలు దొంగతనాలు చేశాడు. అతడు కేవలం నగలు, డబ్బును దొంగిలించడం మాత్రమే కాకుండా, తన దొంగతనానికి మరొక మెరుగులు దిద్దాడు. దొంగిలించిన బంగారాన్ని కరిగించి, బంగారు బిస్కెట్లుగా మార్చి విక్రయించే పద్ధతిని అవలంబించాడు.

-పెనుకొండ దొంగతనంతో అసలు మర్మం బయటకు..

ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని నారాయణమ్మ కాలనీలో జనవరిలో జరిగిన ఓ భారీ దొంగతనం కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. ఆ దొంగతనంలో దాదాపు 470 గ్రాముల బంగారం మాయం కాగా, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుడిని వెతుకుతుండగా, ఫిబ్రవరి 13న కర్ణాటక రాష్ట్రం తుమ్మకూరు వద్ద సుహాన్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

-రేచీకటి సమస్యతో వెరైటీ దొంగతనం!

పోలీసులు సుహాన్ ఖాన్‌ను విచారించగా, తనకు రేచీకటి సమస్య ఉందని తెలిపాడు. అందుకే రాత్రివేళ దొంగతనాలు చేయడం తనకు కుదరదని, అందుకే పగటి పూటల్లోనే తన పని ముగించేస్తాడని ఒప్పుకున్నాడు. తాను దొంగతనానికి పాల్పడిన బంగారాన్ని కరిగించడానికి ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో మెటీరియల్స్ కొనుగోలు చేసినట్లు కూడా పోలీసుల విచారణలో వెల్లడయ్యింది.

- 29 లక్షలకు బంగారం విక్రయం

పెనుకొండలో దొంగిలించిన 470 గ్రాముల బంగారాన్ని బిస్కెట్లుగా మార్చి దాదాపు రూ.29 లక్షలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఫిబ్రవరి 3న చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో కూడా మరో ఇంట్లో బంగారం దొంగిలించినట్లు అంగీకరించాడు. పోలీసులు నిందితుడి వద్ద నుండి 350 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

సుహాన్ ఖాన్‌పై పలు కేసులు నమోదయ్యాయి. అతని మోసాలకు సంబంధించి మరిన్ని వివరాలు పోలీసులు తవ్వుకుంటున్నారు. ఇంత పక్కా ప్లాన్ తో దొంగతనాలు చేసే దొంగ పోలీసులకు చిక్కడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఈ వెరైటీ దొంగ కథనం చూస్తే, దొంగతనం చేసే వాళ్లలో కూడా ఎంత వెరైటీ ఉండొచ్చో అర్థమవుతుంది! అయితే, ఎంత ప్లాన్ చేసినా నేరం నేరమే. చివరికి చట్టం చేతికి చిక్కాల్సిందే!