Begin typing your search above and press return to search.

అంగళ్లు అల్లర్ల కేసు... జోక్యానికి సుప్రీం నిరాకరణ!

ఈ కేసులో నిందితులకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసిన నేపథ్యంలో

By:  Tupaki Desk   |   3 Oct 2023 9:25 AM GMT
అంగళ్లు అల్లర్ల కేసు... జోక్యానికి  సుప్రీం  నిరాకరణ!
X

సుప్రీంకోర్టులో అంగళ్లు అల్లర్ల కేసు ఈ రోజు విచారణకు వచ్చింది. ఈ కేసులో నిందితులకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసిన నేపథ్యంలో... ఈ రోజు జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

అవును... అంగళ్లు కేసులో నిందితులకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఏపీ ప్రభుత్వం సవాల్ చేసిన పిటిషన్ ఈ రోజు బెంచ్ ముందుకు వచ్చింది. చంద్రబాబు స్కిల్ స్కాం కేసు పిటిషన్ కూడా ఇదే బెంచ్ మీదకు వచ్చింది! ఆ సంగతి అలా ఉంటే... ఈ ఘటనలో టీడీపీ నేతలకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు సుప్రీం నిరాకరించింది.

ఇదే సమయంలో భద్రత కల్పించే పోలీసులే ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేసి.. వారే సాక్షులుగా ఉంటారా అని ప్రశ్నించింది. అనంతరం... హైకోర్టు బెయిల్‌ ఇచ్చినందున దీనిలో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. కాగా... ఈ కేసులో బాధితులు కూడా పోలీసులే కావడం గమనార్హం!

కాగా... అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలోని అంగళ్ళ వద్ద ముందుగా అనుమతి తీసుకున్న మార్గంలో కాకుండా... అకస్మాత్తుగా చంద్రబాబు రూట్ మ్యాప్ ను పార్టీ వర్గాలు మార్చారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముందుగా అనుమతి తీసుకున్నట్లు ఊరి బయటనుంచి కాకుండా ఊరి లోపల నుంచి వెళ్లడంతో పక్కా ప్లాన్ ప్రకారం అల్లర్లు జరిగాయని జిల్లా ఎస్పీ గంగాధర్ రావు తెలిపారు.

ఈ ఘటనలో టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీకి చెందిన మొత్తం 179 మంది నేతలపై ముదివేడు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో పలువురు టీడీపీ నేతలను అరెస్ట్‌ చేశారు. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించగా.. కొందరికి బెయిల్‌ లభించింది.