Begin typing your search above and press return to search.

అన్ని పధకాల కంటే అన్న క్యాంటీన్ పధకమే మిన్న !

అన్ని దానాలలో అన్న దానం గొప్ప అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. దానిని ఆచరించి చూపిస్తోంది టీడీపీ కూటమి ప్రభుత్వం

By:  Tupaki Desk   |   17 Aug 2024 12:30 AM GMT
అన్ని పధకాల కంటే అన్న క్యాంటీన్ పధకమే మిన్న !
X

అన్ని దానాలలో అన్న దానం గొప్ప అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. దానిని ఆచరించి చూపిస్తోంది టీడీపీ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు చాలా తెలివైన వారు అని కూడా అంటున్నారు. ఆయన అపర చాణక్యుడు. ఆయన రాజకీయం వేరే లెవెల్ అని కూడా చెప్పాలి.

చంద్రబాబు మీద విమర్శలు ఏంటి అంటే ఎన్నికల ముందు కూటములు కడతారు. ఒక పార్టీని వదిలేసి వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటారు అని. రాజకీయం అంటేనే అది. చంద్రబాబు ట్రూ పొలిటీషియన్. అలా చేయడంలో తప్పేముంది అన్నది జనం నుంచి కూడా వస్తోంది కాబట్టే ఆయన ఎవరితో పొత్తు పెట్టుకున్నా గెలిపిస్తున్నారు.

ఇక హామీలు ఇచ్చి గెలిచిన తరువాత వదిలేస్తారు అని కూడా ప్రత్యర్ధులు అంటారు. కానీ అన్నప్రాసన నాడే ఆవకాయ ఎవరైనా పెడతారా. అదే చంద్రబాబు ఆలోచన కూడా. ఆయన గద్దెనెక్కాక అన్నీ చూసుకుని రాజకీయ ఆర్థిక స్థిరత్వం వచ్చాకనే పధకాలు ఏమైనా అమలు చేస్తారు. పధకాలు ఫలానా టైం లో అమలు చేస్తామని ఆయన చెప్పలేదు కదా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

ప్రజలు అయిదేళ్ల పాటు అంటే అరవై నెలల అధికారం చంద్రబాబుకు అప్పగించారు. ఆయన చివరి ఆరు నెలలలో పధకాలు అమలు చేసినా చేసినట్లే. హామీని నిలబెట్టుకున్నట్లే. ప్రజలు కూడా ఆ చివరి ఆరు నెలలే ఏమైనా చేశారా లేదా అని గుర్తు పెట్టుకుంటారు. సో ఇక్కడ కూడా చంద్రబాబు పాలిటిక్స్ తప్పు అని ఎవరూ అనలేరు.

ఇక ఏపీ ఆర్ధికంగా సంక్షోభంలో ఉంది. అయినా చంద్రబాబు తాను చెప్పినట్లుగా నాలుగు వేల పెన్షన్ అరవై ఆరు లక్షల మంది సామాజిక లబ్దిదారులకు ఇస్తున్నారు. అది మాత్రం ఆయన గద్దెనెక్కిన మరుక్షణం అమలు చేశారు. ఎందుకంటే ఇది అదిరిపోయే స్కీమ్. అరవై ఆరు లక్షలు అంటే వారి ఫ్యామిలీ కలిపి చూస్తే పెద్ద ఓటు బ్యాంకే ఉంటుంది. పైగా వృద్ధులకు ఏదైనా చేస్తే అది సెంటిమెంట్ గా కూడా ఉండి పార్టీకి శ్రీరామ రక్ష అవుతుంది.

ఇక చంద్రబాబు మరో పధకం అమలు చేశారు. అదే అన్నా క్యాంటీన్లు. ఏపీలో అన్ని మున్సిపాలిటీలు ముఖ్యమైన మండల కేంద్రాలలో దాదాపుగా 250 దాకా అన్న క్యాంటీన్లు దశల వారీగా ఏర్పాటు చేయాలన్నది బాబు ప్రభుత్వం ప్లాన్. ఇలా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి రెండు పూట్ల భోజనం ఉదయం టిఫిన్ అన్నీ కేవలం అయిదు రూపాయలకే ఇవ్వడం ఒక రికార్డు.

అంటే ఒక పేదవాడు కేవలం పదిహేను రూపాయలతో పొట్ట నింపుకుంటాడు అన్న మాట. ఒక విధంగా ఇది అన్న దానమే. ఎందుకంటే రోజుకు ఒక ప్లేట్ కి పధినేను రూపాయలు ఈ పధకం కింద ఖర్చు అయితే ఖర్చు అయితే మిగిలిన 75 రూపాయలు ఖర్చు ప్రభుత్వం భరిస్తోంది. అలా చూస్తే ఏడాదికి ఈ పథకం కింద 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది.

అంటే చాలా తక్కువ మొత్తమే. ఈ పధకం ద్వారా వచ్చే పేరు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అన్నం పెట్టిన వారిని సాధారణంగా ఎవరూ మర్చిపోరు. అందుకే అన్న క్యాంటీన్ల పధకాన్ని ముందు పెట్టి టీడీపీ కూటమి అమలు చేస్తోంది. మరో వైపు చూస్తే ఏపీలో మరే సంక్షేమ పధకం ముట్టుకున్నా వేలల్లోనే ఏడాదికి ఖర్చు అవుతుంది. కొన్ని పధకాలు అయితే ఏటా ముప్పయి నుంచి నలభై వేల కోట్లకు కూడా ఖర్చు అయితే పరిస్థితి ఉంది.

దాంతో అన్ని పధకాల కంటే అన్న క్యాంటీన్ పధకమే మిన్న అని టీడీపీ పెద్దలు భావిస్తున్నారు అని అంటున్నారు. ఎవరు కాదన్నా ఈ పధకం వల్ల టీడీపీ కూటమికి వచ్చే మంచి పేరు కానీ లేదా దాని ద్వారా వచ్చే పొలిటికల్ మైలేజ్ కానీ ఎక్కువగానే ఉంటుంది. పేదలకు పట్టెడు అన్నం అంటూ టీడీపీ కూటమి పెద్దలు చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది.

మరి ఇప్పటికే పెన్షన్లు అమలు చేశారు, అన్న క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి మిగిలిన సంక్షేమ పధకాలు కూడా నెమ్మదిగా అమలు చేస్తామని చెప్పినా కూడా జనాలు నమ్మేలాగానే ఉంది. ఆ మాత్రం టైం ఇవ్వలేరా అన్న చర్చ కూడా వస్తుంది.

ఇక అన్న క్యాంటీన్లను అట్టహాసంగా ప్రతీ నియోజకవర్గంలో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈ విధంగా కూటమి ప్రభుత్వం ప్రజా ప్రతినిధులను ముందున పెట్టి మరీ ప్రజలకు తాము ఏమి చేశారో చెప్పుకుంటోంది. మొత్తానికి సంక్షేమ పథకాలు అమలు చేయడంలేదు అన్న వైసీపీ విమర్శలకు ఒకే ఒక జవాబుగా అన్న క్యాంటీన్లతో చెక్ పెట్టినట్లు అవుతోందా అన్న చర్చ అయితే ఉంది.