Begin typing your search above and press return to search.

ట్యాపింగ్ మిస్టరీ వీడేనా? ఇవాళ సిట్ ఎదుట శ్రవణ్‌రావు విచారణ!

తెలంగాణలో గత కొన్నాళ్లుగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది.

By:  Tupaki Desk   |   2 April 2025 6:13 AM
ట్యాపింగ్ మిస్టరీ వీడేనా? ఇవాళ సిట్ ఎదుట శ్రవణ్‌రావు విచారణ!
X

తెలంగాణలో గత కొన్నాళ్లుగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో కీలక అనుమానితుడిగా ఉన్న మాజీ ఐటీ గ్రిడ్స్ సీఈవో శ్రవణ్‌రావును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరోసారి విచారణకు పిలిచింది. ఇవాళ (ఏప్రిల్ 2, బుధవారం) సిట్ కార్యాలయంలో హాజరుకావాలని అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.

మూడు రోజుల క్రితం (మార్చి 30న) కూడా శ్రవణ్‌రావు సిట్ విచారణకు హాజరయ్యారు. అయితే, ఆయన ఇచ్చిన సమాధానాలు అసంపూర్తిగా ఉండటంతో పాటు, కొన్ని ప్రశ్నలకు సరైన వివరణ ఇవ్వలేదని సిట్ అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ కేసులో మరింత స్పష్టత కోసం శ్రవణ్‌రావును మరోసారి విచారించాలని నిర్ణయించారు.

గత విచారణలో శ్రవణ్‌రావును ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన ఆదేశాలు ఎవరు ఇచ్చారు? ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారు? ట్యాప్ చేసిన డేటాను ఎక్కడ నిల్వ చేశారు? ఈ వ్యవహారంలో ఇతర వ్యక్తుల ప్రమేయం ఉందా? వంటి కీలక ప్రశ్నలను సిట్ అధికారులు అడిగినట్లు సమాచారం. అయితే, శ్రవణ్‌రావు ఇచ్చిన సమాధానాలు సిట్‌ను సంతృప్తి పరచలేకపోయాయని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో, ఇవాళ జరిగే విచారణలో సిట్ అధికారులు మరింత లోతుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. శ్రవణ్‌రావు నుండి పూర్తి స్థాయి సమాధానాలు రాబట్టేందుకు సిట్ ప్రత్యేక వ్యూహంతో సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. శ్రవణ్‌రావు తిరిగి విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.