Begin typing your search above and press return to search.

ప్రవాసుల్ని తెలంగాణకు రమ్మన్న సీఎం రేవంత్ ఇంకేం చెప్పారు?

గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ నోటి నుంచి పదే పదే ఫ్యూచర్ సిటీ మాట రావటం తెలిసిందే

By:  Tupaki Desk   |   5 Aug 2024 3:30 PM GMT
ప్రవాసుల్ని తెలంగాణకు రమ్మన్న సీఎం రేవంత్ ఇంకేం చెప్పారు?
X

గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ నోటి నుంచి పదే పదే ఫ్యూచర్ సిటీ మాట రావటం తెలిసిందే. హైదరాబాద్.. సికింద్రాబాద్.. సైబరాబాద్ మాదిరే.. ఫ్యూచర్ సిటీని నెలకొల్పుతామంటూ ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లోనూ పలుమార్లు చెప్పిన సీఎం రేవంత్.. తాజాగా అమెరికాలో పర్యటిస్తున్న సందర్భంలోనూ ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించటం గమనార్హం. అంతేకాదు.. న్యూజెర్సీలోని తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రవాసులతో భేటీ అయిన సందర్భంలో తెలంగాణకు పెట్టుబడులతో రావాలంటూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనేమన్నారంటే..

- రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలి. తెలంగాణ మీ జన్మభూమి. మీ దేశంలో మీరు పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. అంతకు మించిన అత్యుత్తమ ప్రతిఫలం ఉంటుంది. మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకుంటే అంతకు మించిన సంతృప్తి బోనస్ గా లభిస్తుంది.

- హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నాం. ప్రపంచ స్థాయి మాస్టర్‌ ప్లాన్ తో హైదరాబాద్ ను అత్యున్నత స్థాయి నగరంగా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్ ను అభివృద్ధి చేసేందుకు మీరందరూ కలిసి రావాలి.

- గత సంవత్సరం టీపీసీసీ అధ్యక్షుని హోదాలో అమెరికాకు వచ్చాను. పదేండ్ల పాటు సాగిన దుష్పరిపాలనకు, విధ్వంసాలకు విముక్తి పలికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్లీ వస్తానని చెప్పాను. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను.

- మీ నైపుణ్యాలు, మీ ప్రతిభా పాటవాలతో అమెరికాను పటిష్టంగా, సంపన్నంగా మార్చారు.ఇకపై తెలంగాణకు మీ సేవలు అందించాలి. తెలంగాణలో మెట్రో కోర్ అర్బన్ తో పాటు , సెమీ అర్బన్, రూరల్ క్లస్టర్లుగా విభజించి పెట్టుబడులకు ప్రత్యేకమైన వ్యవస్థలను రూపొందిస్తున్నాం.

- ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని మా ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది. ఇప్పటికే రైతులు, మహిళలు, యువకుల సంక్షేమం, అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం.

- రైతులకు ఏకకాలంలో రూ.రెండు లక్షల రుణమాఫీతో పాటు, ఇన్ పుట్ సబ్సిడీగా రైతు భరోసా, నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు వంట గ్యాస్ సిలిండర్, నిరుపేదలకు 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్తు, ఉపాధ్యాయులకు పదోన్నతులు, విద్యార్థులకు నాణ్యమైన విద్య పథకాలను అమలు చేస్తున్నాం.

- ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్తు ప్రణాళికలతో మా ప్రభుత్వం ముందుకు వెళుతుంది. మా పరిపాలనపై ఎలాంటి అపోహలు, ఆందోళనలకు తావు లేదు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమ్మిళిత ఆర్థిక వృద్ధిని వేగంగా సాధించేలా మా ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకు వస్తుంది.

- నిధుల సమీకరణతో పాటు ఎక్కువ మందికి ఉపాధి కల్పన, నైపుణ్యాల వృద్ధికి అందులో సమానమైన ప్రాధాన్యం ఇస్తాం. ఎన్నికల ముందు మాపై ఎంతో విష ప్రచారం జరిగింది. గిట్టని వాళ్లందరూ అసలు కాంగ్రెస్ అధికారంలోకి రాదన్నారు. వచ్చినా అది ఉండనే ఉండదన్నారు.

- ఇప్పుడేమో రాష్ట్రంలో అభివృద్ధి మందగిస్తుందంటూ లేని పోని అపోహలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వాళ్లకు తగిన బుద్ధి చెప్పాం. అబద్ధాలకోరుల మాటలు తప్పని మరోసారి నిరూపిస్తాం. హైదరాబాద్‌ను భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా అభివృద్ధి చేసేందుకు పోటీ పడతాం.