బీజేపీకి పది...గెలిచే దారేదీ...!?
ఇపుడు ఆ ఉత్తరం కూడా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటోంది.
By: Tupaki Desk | 23 March 2024 9:00 AM ISTపొత్తులో భాగంగా బీజేపీకి పది సీట్లు ఇస్తున్నట్లుగా వార్త వచ్చింది. అసలు ఏపీలో అర సున్నా ఓట్ల షేర్ ఉన్న బీజేపీకి ఇన్ని సీట్లు ఇవ్వడమేంటి అన్న చర్చ సాగింది. పది చూస్తే బిగ్ నంబర్ గా ఉంది. కానీ అసలు విషయం చూస్తే అక్కడే డొల్లతనం అంతా ఉంది.
ఈ పది సీట్లలో టీడీపీయే గెలిచి చాలా కాలం అయింది. ఒక్క విశాఖ ఉత్తరం సీటు తప్ప. ఇక బీజేపీకి కూడా పట్టున్న సీట్లు ఏమీ లేవు. అది కూడా ఒక్క విశాఖ ఉత్తరం తప్ప. ఇపుడు ఆ ఉత్తరం కూడా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటోంది. అక్కడ వైసీపీ బలంగా ఉంది.
దాంతో బీజేపీ గొల్లుమంటోంది. ఇక బీజేపీకి ఇచ్చిన సీట్ల జాబితా చూస్తే కోరి మరీ ఈ సీట్లు అన్నీ వైసీపీ పరం అయ్యేట్లు ఉన్నాయని అంటున్నారు. అందులో ఎచ్చెర్ల సీటు ఒకటి ఉంది. ఇది శ్రీకాకుళంలో ఉంది. ఈ సీటులో బీజేపీ అభ్యర్ధిని పెడితే అటు మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు హెల్ప్ చేయరు సొంతంగా బలంలేదు అని అంటున్నారు. ఇక్కడ బీజేపీకి అచ్చంగా వచ్చిన ఓట్లు 2019లో 1022 అన్న మాట.
అలాగే పాడేరు అసెంబ్లీ సీటు టీడీపీకే కొరుకుడు పడనిది. ఆ సీటు ఇస్తే బీజేపీకి ఎలా అన్నదే చర్చ. ఇక్కడ బీజేపీకి 2019లో వచ్చిన ఓట్లు 4,631 మాత్రమే. అనపర్తి సీటు బీజేపీకి ఇస్తున్నారు. ఈ సీటులో బీజేపీకి 2018లో వచ్చిన ఓట్లు అచ్చంగా 627 మాత్రమే. ఇక్కడ టీడీపీ గెలిచి పదేళ్లు అవుతోంది.
ఇక ఇదే వరసలో కైకలూరు సీటుని బీజేపీకి ఇచ్చారు. ఇక్కడ టీడీపీ గెలిచి పదిహేనేళ్ళు అయింది. బీజేపీకి 2019లో వచ్చిన ఓట్లు 1701 మాత్రమే. విజయవాడ వెస్ట్ సీటు. టీడీపీ ఎపుడూ గెలవని సీటు ఇదే. ఈ సీటులో 2019లో బీజేపీకి వచ్చిన ఓట్లు 4206 మాత్రమే.
అలాగే అదోనీ సీటు. ఇక్కడ టీడీపీ గెలిచి పదిహేను ఏళ్ళు అయింది. 2019లో బీజేపీకి వచ్చిన ఓట్లు 3,854 మాత్రమే. ధర్మవరం సీటు కూడా బీజేపీకే ఇస్తున్నారు. ఇక్కడ టీడీపీ గెలిచి పదేళ్ళు అయింది. బీజేపీకి 2019లో వచ్చిన ఓట్లు 622 మాత్రమే.
జమ్మలమడుగులో టీడీపీ గెలిచి పాతికేళ్ళు పై దాటింది. ఈ సీటుని బీజేపీకి అప్పనంగా ఇచ్చేసింది. 2019లో బీజేపీకి వచ్చిన ఓట్లు 536 మాత్రమే. బద్వేల్ సీటు కూడా కమలానికే అంటున్నారు. ఈ సీటులో టీడీపీ గెలిచి పాతికేళ్లు పై దాటింది. 2019లో బీజేపీకి వచ్చిన ఓట్లు 735. మరి
విషయం ఇంత చక్కగా ఉంటే బీజేపీ ఎలా గెలుస్తుంది అని అంటున్నారు. ఈ పదికి పది సీట్లు వైసీపీ ఖాతాలో సునాయాసంగా పడతాయని అంటున్నారు. ఇక్కడ టీడీపీ పోటీ చేసినా అదే జరిగేదని అందుకే ఆ ఓటమి బాధ తప్పించుకోవడంతో పాటు పొత్తు పేరుతో కమలం పార్టీకి భారీ ఆఫర్ ప్రకటించి కేంద్రం లో అధికారంలో ఉన్న పార్టీ మద్దతు పొందే బ్రహ్మాండమైన వ్యూహాన్ని టీడీపీ రచించింది. దాంతో బీజేపీ రగులుతోంది.
ఇంతే కాదు ఎంపీ సీట్లు కూడా బీజేపీకి గెలుపు ఆశలు పెద్దగా లేవు అని అంటున్నారు. రాజంపేట, అనకాపల్లి, తిరుపతి, రాజమండ్రి, నర్సాపురం వంటివి ఉన్నాయి. ఇందులో కచ్చితంగా గెలుస్తామని చెప్పలేనివే ఎక్కువ అంటున్నారు. మొత్తం మీద చూస్తే బీజేపీకి పది గెలుపునకు దారేది అని కమలనాధులు తలలు పట్టుకుంటున్నారు. మరి ఈ విషయంలో కేంద్ర పెద్దలు కూడా చోద్యం చూస్తున్నారుట.