అయోధ్య, కుంభమేళ.. భారీ ఉగ్రదాడి కుట్ర భగ్నం!
పాకిస్థాన్ నిఘా సంస్థ (ISI) మద్దతుతో ఈ దాడిని అమలు చేయాలని ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ ప్రణాళిక రూపొందించాడు.
By: Tupaki Desk | 4 March 2025 8:36 PM ISTఅయోధ్య రామమందిరంపై ఉగ్రదాడి చేసేందుకు చేసిన కుట్రను భారత భద్రతా దళాలు భగ్నం చేశాయి. పాకిస్థాన్ నిఘా సంస్థ (ISI) మద్దతుతో ఈ దాడిని అమలు చేయాలని ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ ప్రణాళిక రూపొందించాడు. అయితే, గుజరాత్ , హర్యానా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) జాయింట్ ఆపరేషన్ ద్వారా అతడిని అదుపులోకి తీసుకుని ఈ కుట్రను నిలువరించగలిగారు.
- రహస్యంగా పనిచేసిన ఉగ్రవాది!
హర్యానాలోని ఫరీదాబాద్ పట్టణంలో ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ గుట్టుచప్పుడు కాకుండా ఉంటూ తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నాడు. భారత భద్రతా సంస్థల విశ్వసనీయ సమాచారం మేరకు అతడు అయోధ్య రామమందిరంపై దాడి కోసం ఐఎస్ఐ నిఘా సంస్థకు సహకరిస్తున్నట్లు వెల్లడైంది.
- ఉగ్రదాడికి సూత్రధారి
అబ్దుల్ రెహ్మాన్ ఇప్పటికే రామమందిరంపై రెక్కీ నిర్వహించి, అవసరమైన సమాచారాన్ని ఐఎస్ఐకి అందజేశాడు. తదుపరి, అతడు ఫైజాబాద్ నుంచి ఫరీదాబాద్ చేరుకుని అక్కడి నుంచి హ్యాండ్ గ్రనేడ్లను సేకరించాడు. ఆ ఆయుధాలను తీసుకుని తిరిగి అయోధ్య చేరుకుని, రామమందిరంపై ఉగ్రదాడికి పాల్పడాలని అతడి ప్రణాళిక. అయితే ఈ కుట్రను భారత భద్రతా దళాలు ముందుగానే గుర్తించి అబ్దుల్ రెహ్మాన్ను అరెస్ట్ చేశాయి.
-కుంభమేళా లక్ష్యంగా మరో కుట్ర?
భద్రతా అధికారులు నిర్వహించిన దర్యాప్తులో అబ్దుల్ రెహ్మాన్తో పాటు ఇతర ఉగ్రవాదులు కూడా కుంభమేళాను లక్ష్యంగా చేసుకుని దాడికి సిద్ధమవుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా అప్రమత్తతను పెంచింది. భద్రతా వ్యవస్థ మరింత కట్టుదిట్టం చేయాలని అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.
- భద్రతా బలగాల విజయంతో ఊపిరిపీల్చుకున్న దేశం
భారత భద్రతా సంస్థల అప్రమత్తత వల్ల, అయోధ్య రామమందిరంపై ఉగ్రదాడిని సమయానికి అడ్డుకోగలిగారు. గుజరాత్- హర్యానా ఏటీఎస్ సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్ దేశ భద్రత పరంగా అత్యంత కీలకంగా మారింది.
భద్రతా బలగాలు దేశ ప్రజలకు మరింత రక్షణ కల్పించేందుకు నిరంతరం పని చేస్తూనే ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.