Begin typing your search above and press return to search.

పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న టీమిండియా ఆటగాళ్లు... ఫైనల్ లో దసరా గిఫ్ట్!

ఈ సమయంలో టీమిండియా ఆటగాళ్లు జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు.

By:  Tupaki Desk   |   12 Oct 2024 4:40 PM GMT
పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న టీమిండియా ఆటగాళ్లు... ఫైనల్  లో దసరా గిఫ్ట్!
X

దేశమంతా దసరా పండగ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. భక్తులంతా అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించుకుంటున్నారు. మరోపక్క ఈ రోజు ఉప్పల్ స్టేడియంలో చివరిదైన మూడో టీ20 మ్యాచ్ లో బంగ్లాతో భారత్ తలపడనుంది. ఈ సమయంలో టీమిండియా ఆటగాళ్లు జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు.

అవును... దసరా పండగ సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని టీమిండియా ప్లేయర్లు తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. బంగ్లాదేశ్ తో ఈ రోజు మ్యాచ్ నిమిత్తం హైదరాబాద్ కి వచ్చిన భారత ప్లేయర్లు పండగ దినం శనివారం నాడు పెద్దమ్మ తల్లి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు.

కాగా... బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను ఇప్పటికే 2-0తో గెలుచుకున్న టీమిండియా... ఈ రోజు ఉప్పల్ వేదికగా జరగనున్న చివరిదైనా మూడో టీ20 మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఇప్పటికే రెండు మ్యాచ్ లనూ కోల్పోయిన బంగ్లా... గౌరవాన్ని కాపాడుకోవాలని చూస్తోంది!

ఈ నేపథ్యంలో... ప్రధానంగా తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి పై స్పెషల్ ఫోకస్ ఉందని అంటున్నారు. ముఖ్యంగా గత మ్యాచ్ లో పవర్ ప్లే లోనే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయినప్పటికీ.. జట్టు 222 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిందంటే.. ఇందులో ప్రధానంగా 34 బంతుల్లో 74 పరుగులు చేసిన నితీష్ పెర్ఫార్మెన్స్ స్పెషల్ అని చెప్పాలి.

ఈ మ్యాచ్ లో 7 సిక్స్ లు బాదిన నితీష్... బౌలింగ్ లోనూ రాణించాడు. ఇప్పుడు తెలుగు గడ్డపై తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడబోతున్న ఈ విశాఖ కుర్రాడు ఎలాంటి ప్రదర్శన చేస్తాడనే విషయంపై తీవ్ర ఆసక్తినెలకొందని అంటున్నారు.